Monday, April 23, 2012

ఆటవిడుపులో ఆటలు

10 comments
              ఆనాటి నోములు,పేరంటాలునుండి ఈనాటి కిట్టీపార్టీల వరకు రూపమేదైనా రూపుదిద్దుకునేది మాత్రం ఆటవిడుపే!అలాంటిదే బ్లాగ్ ప్రమదల బ్లాగావని. దైనందిన జీవితంలో ఎవరికి వారు ఎన్నో ఒత్తిడులకు గురవడం సహజం.అటువంటివారికి పెద్దలు వేసే మాటలమంత్రాలు సేదదీర్చి మనసుకు హాయికొల్పుతాయి.మరి పెద్దలకే విసుగు,ఒత్తిడి ఎదురయితే వారికి మందు పిల్లలు వారి పిల్లలు.మరి ఈ అవకాశం దొరకని మనకు తన తలుపులు తెరిచిన బ్లాగ్ప్రపంచం పెద్ద,చిన్నతేడా లేక నాలుగు అక్షరాలు కలబోసుకుంటే చాలు ఆర్తిగా పలకరించి అక్కున చేర్చుకుంటుంది.ఈ బ్లాగ్విశ్వంలో ఎన్నో చలువ పందిళ్లు!అందులో చక్కని బ్లాగుల వేదికలు.బ్లాగులో నామమాత్రపు పరిచయాలే కాని ఆత్మీయతకు కొదవలేదు.కలిసి పంచుకున్నది భోజనం కాదు మమతల పరిమళాన్ని.నిన్నటి ఆదివారం నగరం అగ్నిగుండమే కాని మనసుల చల్లని నీడ మరిపించింది.ఆటవిడుపులో ఆటపాటలు ముగింపుకొస్తుంటే ఆనాటి బాలానందం గుర్తుకొచ్చింది.
ఆటలు,పాటలు,నాటికలు నేటికి ఇక చాలిద్దామా......ఇళ్లకు ఇపుడు పోదామా....గబగబగబ.... అంటూ రేడియోలో పాట అయిపోయేవరకు వేసిన చిందులు! ఓహ్!జ్ఞాపకాల పూలు రాల్చిన ఆదివారం!

Sunday, April 22, 2012

పండుటాకులు కాదు పసిడిపత్రాలు

0 comments


22-4-12 ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడిన నా  సమీక్ష.
   http://www.andhrabhoomi.net/content/pandu                 
ఐతా చంద్రయ్యగారు కథ,కవిత,నవల,నాటిక,సమీక్ష,అనువాదం తదితర ప్రక్రియలన్నింటిలోను తన రచనాశక్తిని,రచనాసక్తిని ప్రస్ఫుటింప చేసిన రచయిత.వారి నవల సంధ్యావందనము వృద్ధుల చేదు అనుభవాల సమాహారం.ఆనందనందనమను వృద్ధాశ్రమము వారి కథలను కలబోసుకునే వేదిక. పెరుగుతున్న వయోభారము, తరుగుతున్న జీవన విలువలే అన్నికథనాలకు మూలసూత్రము.
          ఆశ్రమవాసి సోమనాథ్ కు రావలసిన పెన్షన్ మంజూరు ఆలస్యమైనపుడు అతడి రిక్త హస్తానికి సరైన భోజనం పెట్టడానికి కూడా కోడళ్లిద్దరు ఇష్టపడరు.అదే అతడి గ్రాట్యుటీ రాగానే తమ పిల్లల పెళ్లిళ్లకు,చదువులకు ఉపయోగపడాలంటూ సోమనాథ్ ను మాటలతో మభ్యపెట్టి వారి పిల్లలపేర డిపాజిట్లు చేయించుకుంటారు. తల్లిదండ్రులను అవకాశవాదంతో లోబరచుకుని మళ్లీ ముఖం చాటేసే సుపుత్రులకు కొదవలేని భారతావనిలో భార్య మరణానంతరం ఆశ్రమంలో సేదతీరే ఇలాంటి  సోమనాథ్ లెందరో!ఇదే తీరున ఆనందనందనాన్ని చేరుకున్న రచయిత అయిన కబీరుదాసు మంచి పాటకారి కూడా!రచయిత అతని ద్వారా పాటలచరణాలను పలికించి, జీవితబాటలోని ఒడిదుడుకులకు అన్వయించడం చక్కటి ప్రయోగమే!         
          ఇక ఆశ్రమ ట్రస్టు కార్యదర్శి లాయర్ కమలాకర్ ఆశ్రమ నిర్వహణలో  చూపించే శ్రద్ధ వృద్ధులను అలరిస్తుంది. వారికి ఆటలపోటీలు,సమాజహిత కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారి మనసులకు చల్లని లేపనంవలె సేదతీర్చడం వారి కడగండ్లను మరిపిస్తుంది.ఇంత చక్కటి వాతావరణం ప్రాప్తించినపుడు, వానప్రస్థాశ్రమానికి ఇంతకంటె ఏంకావాలి అనిపించకమానదు.ఈ ఆశ్రమం నీడను చేరిన  జగదాంబ, అన్నపూర్ణ,జగదీష్,ఆనందరావు మొదలైన వారి అనుభవాల పుటలన్నీ అక్షరభాష్పాలే! వైద్య సదుపాయం, ఆరోగ్యకర ఆహారం,వెచ్చటి పరామర్శ! వృద్ధుల కనీస అవసరాలు.ఇవి కూడా అందించలేని సంతానం ఆడే యూజ్ అండ్ త్రో ఆటలో పావులైన మరెందరినో అక్కున చేర్చుకుంటుంది ఆనందనందనం. కారణాలు,సందర్భాలు వేరైనా వారి సంఘర్షణలో, ఆవేదనలో సారూప్యం వారి బాటను ఏకం చేసింది. మాట్లాడేందుకు ఎవరు లేరే అని నిట్టూర్చే వారందరు వారి రాకకు గల బలమైన కారణాలను వివరించడంలో రచయిత వెదజల్లిన పాతపాటల పరిమళం, తిరగేసిన చరిత్రపుటలు,అలరించిన ఆధ్యాత్మిక భావనా వీచికలు నవల నడకకు మెరుగులు దిద్దాయి. కార్యదర్శి కమలాకర్ తన కొడుకనే నిజాన్ని కబీర్ దాస్ వెల్లడి చేయడం నవలలో నాటకీయమైన కొసమెరుపు.     
           అయోమయం చౌరస్తాలో బిక్కుబిక్కుమంటూ నుంచున్న సీనియర్ సిటిజన్స్ కు సచ్చిదానందనిలయంగా ఆనందనందనాన్ని రచయిత అభివర్ణించడం అక్షరసత్యం.నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో ఆప్యాయతలు, అనుబంధాలు  మరుగై ఎవరికివారే యమునాతీరే అనే పాశ్చాత్య సంస్కృతి ప్రబలమవడమే ఇలాంటి ఆశ్రమాలు, ఆశ్రయాలుగా మారడానికి కారణమంటారు రచయిత.రక్తం పంచుకు పుట్టిన పిల్లల వింత ప్రవర్తనకు,విపరీత బుద్ధికి తట్టుకోలేక ఆనందనందనం చేరి తాము పడ్డ మానసిక శ్రమనువీడి ఆనందంగా జీవించగలుగుతున్నారు అని తన నవల ద్వారా చెప్పడంలో ఐతా చంద్రయ్యగారు సఫలీకృతులయారనే చెప్పాలి.                                                                                                                                                                                                                                                    
పుస్తకం దొరకు చోటు
ఐతా చంద్రయ్య
ఇ.నెం.4-4-11,షేర్ పురా,సిద్ధిపేట్-502 103
మెదక్ జిల్లా,(ఆ.ప్ర)
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాద్
సాహిత్యనికేతన్, హైదరాబాద్
ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్
 (ఆంధ్రభూమి సౌజన్యంతో )








Monday, April 16, 2012

మానవత నుదుట మానని గాయాలు

4 comments




ఆదివారం సాక్షి ఫన్ డేలో రచయిత రామాచంద్రమౌళిగారి 'పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు' కథాసంపుటంపై నా సమీక్ష.

సాహితీ ఔషధమే లేపనంగా సమాజహితం కోరే సాహిత్యానికి పెద్దపీట వేసే రచయిత రామా చంద్రమౌళిగారు. మానవతావిలువలు ఆవిరైనవేళ మనిషి మ్రోగని మురళీనాదమే!అయితే ప్రేమ,కరుణ మనిషిని ఆర్తిగా పొదువుకున్న వేళ స్పందించే వేణునాదమవుతాడు.రెండు విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మనుషుల భిన్నప్రవృత్తులే కథావస్తువుగా స్వీకరించి కథారచనను బాధ్యతగా పరిగణిస్తారు రామా చంద్రమౌళిగారు. వీరి అక్షరకొలిమిలో పుటం పెట్టిన కథలివి.
‘జీవితం ఏమిటి’ విశ్లేషణాత్మక కథ.జీవితం దైవం నాటిన పూలతోటే కాని తల్లిదండ్రుల అవినీతి సంద్రంలో మునిగిన చుక్కానిలేని నావ రవళి.పసితనాన్నే వసివాడిన కసిమొగ్గ అనిపిస్తుంది. ‘ఖాళీ‘ కథలో నీరజ మనసును ఎడారితో పోలుస్తూ ఆమె మనసును అడవి ఆక్రమించిందంటారు.ఆత్మీయత,ఆప్యాయత లోపించిన ఇల్లు మమతల పందిరి కానేరదు.మోడుబారిన జీవితం ఎడారి సదృశమే అని రచయిత పోల్చడం అక్షరసత్యం.ఇక ‘అతీతం’ కథలో అనైతికత విజృంభించి మానవులను పతనదిశగా నడిపిస్తే స్పందించని హృదయాలు,వర్షించని కన్నులు హార్డ్ డిస్క్ ను కోల్పోయాయి అని రచయిత అనడం మన హార్ట్ డిస్క్ ను కుదుపుతుంది.అర్థం కాని గమ్యం,లక్ష్యం లేని పరుగు నిరర్థకమంటారు.ఉరుకు,పరుగుల జీవనవేగంలో మానవతా స్పర్శను రుచి చూపించిన కథ ‘అనిమిత్తం.‘
నేడు మనిషి మమతలవాసన కాక డబ్బు వాసన వేస్తున్నాడు. తృప్తిలేనపుడే ధనాశకు బానిసవుతాడు. మనిషెపుడూ అసంతృప్త ద్రావణమే.ఒక చెప్పు తెగిపోతే మరోచెప్పు పనికిరాదన్నది సామాన్యవిషయం.కాని ఈ సూత్రాన్ని భార్య మరణానికి అన్వయించుకుని గుండె పగిలి నజీర్ మరణిండం చూసి అసంతృప్త ద్రావణమనదగ్గ రమణ విచలితుడవుతాడు.మనిషి లోతులను తెలిపిన కథ ‘లోతు’.
ఏరంగమైనా విలువలు కోల్పోతున్న వైనమేనని రామా చంద్రమౌళిగారు తాను కురిపించిన కథావర్షంలో తడిసిన అక్షరభాష్పాలు మన గుండెను చెమ్మగిలచేస్తాయి.మనిషిని,మనిషి మనసును అధ్యయనం చేసిన సిద్ధాంత వ్యాసమనదగ్గ కథాసంపుటం పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.


పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు(కథలు)
వెల:రూ.100/-$10
ప్రతులకు: రాష్ట్రంలోని అన్ని పెద్ద పుస్తకాల షాపుల్లో

Monday, April 9, 2012

మనిషి నిర్వచనం

4 comments




9-4-12 సోమవారం ఆంధ్రప్రభ సాహితీగవాక్షంలో నా కవిత.

తనచుట్టుతాను గిరిగీసుకున్నవృత్తం
నలుసై అందని మనిషి నిర్వచనం
కాసుల ప్రాముఖ్యత నల్లని ముసుగై
కుటుంబ ప్రాధాన్యతను కమ్ముకుంది కాలమేఘమై
జీవనపరుగులో ర్యాంకు,బ్యాంకు మంత్రాక్షరాలు
చెట్టంత మనిషి ఆర్థికయంత్రాలకు చెరకుపిప్పి
నొప్పికి లేపనం పచ్చనోటు పసరు
రెక్కలు మొలిచిన మేధో వలసపిట్టలు
అంకుల్ శ్యామ్ ఊయల ఒడిలో
కొట్టే కేరింతలకు డాలర్ల చప్పట్లు
చిరునవ్వులు చిదిమేసిన సాయంత్రాలు
జటాయువైన వృద్ధాప్యం
అలసిన బాల్యాన్ని పొదువుకునే అమ్మ పేరు టి.వి
అంతర్జాలపు పయనంలో గమ్యమెరుగని మజిలీలు
మనిషిని వెతకాలి,వెతకి పట్టుకోవాలి
చిరునామాను నిర్వచించాలి
మనిషి పేరు మానవత్వం
ఆప్యాయతే నివాసం
మంచిమాటే చిరునామా.

Sunday, April 8, 2012

కథావిహారం

6 comments




8-4-12 ఈ రోజు ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం సప్లిమెంట్ లో ప్రాప్తం కథలసంపుటిపై ప్రచురితమైన నా సమీక్ష.


విభిన్నసంఘర్షణల కథావిహారం ప్రాప్తం

జగత్తులోని ప్రతి అంశం కథావస్తువే!గుట్టలుగా పోగుబడ్డ కథాంశాలలో తనను స్పందింపచేసిన అంశం ఏదైనా సరే దానిని మనసునిండా నింపుకుని వైనంగా నగిషీలు చెక్కి శిల్పాన్ని పారదర్శకం చేస్తారు విహారిగారు. కథానురాగం మెండుగాగల రచయిత.వీరు మధ్యతరగతి జీవులనడుమ,దగాబడ్డ బంధాల మధ్య అగుపడే కథా విహారి.కథకు కావలసిన ముడిసరుకు సమకూరాక అక్షరవిన్యాసం మొదలయే వీరి కథలలో సహజంగా రచయితలు సృష్టించే పదలయలేకాక వాక్యరాగాలు పల్లవిస్తుంటాయి.ప్రాప్తం కథాసంపుటి వారి కథాపాటవానికి ఓ మెచ్చుతునక!

జవాబులు రాసి ఇచ్చేసిన పరీక్షపేపర్ ను తిరిగి ఇవ్వమని అడిగినట్లుంది రేణుక అంటారు విహారిగారు చలిమంట కథలో. చిన్నవాక్యంలో సూక్ష్మంగా చెప్పినా భావజాలంలోతు మాత్రం అఘాతం.నిజమే! విడాకులిచ్చేసాక భర్త మరోపెళ్లి కూడా చేసుకుంటాడు. భర్తపై ప్రేమ చావలేదు,నాకు మళ్లీ నాభర్త కావాలి అని ఏడవడం గతజలసేతు బంధనమేకదా!

ఇక చెరలాట కథాప్రారంభంలో వసంత ముగ్ధగా అనిపించినా కథ చివరి అంకంలోకొచ్చేసరికి ఆమె స్థిత ప్రజ్ఞత ఆమెను చెరలాటలో బలిపశువు కాకుండా కాపాడుతోంది.ఎవరికివారు వసంతను తమ అవసరాలను అనుగుణంగా మలచుకోవాలనుకుంటారే తప్ప ఆమె మనసుకు ప్రాధాన్యతనివ్వరు.అందుకే తన స్వయంనిర్ణయానికి అనుకూలంగా ఒంటరిగానే మిగిలిన వసంత తనకు తోడుగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని నిలుపుకోవడం చెరలాటలో గెలుపే!

బతకనివ్వండి కథ పిల్లలపై వత్తిడి పెంచి తమ తీరని కోరికలను తీర్చే వారసులుగా మార్చుకోవాలనుకునే తల్లిదండ్రుల వైఖరిని అడుగడుగునా చిత్రీకరించి చూపుతుంది.కూతురు ఒక్కరోజు స్విమ్మింగ్ ప్రాక్టీస్ మానితే ప్రళయం వస్తుందన్నట్లు తనే ప్రళయకాల రుద్రుడిలా చిందులేసే తండ్రినుండి కూతురిని దూరంగా తల్లి తెగించి తీసికెళ్లడం ఊహించని మలుపే!శతకోటి వందనాలు అర్పించదగ్గ తల్లి ఆ మాతృమూర్తి. ప్రత్యేకించి ఈ కథపై స్పందనకు కథకుడు వేచి చూసినపుడు అనుకున్నంత స్పందన దొరకలేదంటారు.ఒక మూసలో ఒదిగిపోయి మరిక మార్పును స్వీకరించలేని వ్యవస్థకు చిన్నారులను చిత్రిక పట్టడం నేటి సమాజ చిత్రం.కాళ్లు తడవకుండా సముద్రాన్ని,కళ్లు తడవకుండా సంసారాన్ని ఈదలేమంటారు.మరి సంసారాన్ని ఈదాలంటే సర్దుబాటు గురించి ముందు ఆలోచిస్తారు. పాఠకుడు ఊహించుకున్న ముగింపు రాజీపడటం కావచ్చు అనే సందేహమే ఈ కథను చర్చకు దూరంచేసిందేమో ననిపిస్తుంది.

అద్దంలో బొమ్మ మరో అద్భుతమైన కథ!డబ్బే అందరికీ కేంద్రకం.టైమ్ లేని విత్తార్థులందరు.ఆత్మతృప్తిలేకపోతే ధనరాశులపై పవళించినా నిద్రపట్టదు.మనిషి మనిషికీ చెప్పాలి ఈ కథను అంటారు.నిజమే!తన కుటుంబంలో అసంతృప్తిని చూసిన వ్యక్తి, కడుపారా తృప్తి నిండిన హమాలీ జీవనాన్ని చూసి సంపాదన ఘోషలో కొట్టుకు పోతున్న మధ్యతరగతి అల్పజీవులు వారి భావజాలాన్ని తలకెత్తుకుని బాల్యాన్ని పారేసుకుంటున్న రేపటి పౌరులంటారు. దారి సమస్యల రహదారిగా మారినపుడు మనిషి ప్రవర్తనలో వింతపోకడలు ప్రస్ఫుటిస్తాయి.ఈ విపరీతాన్నే అటెన్షన్ డెఫిషిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ గా పిలువబడుతుందని చెప్తారు.నిశ్చలమైన కాసారానికి చిన్న గులకరాయి చాలు, నీటిని వలయాలుగా తిప్పటానికి అని నడవాల్సిన దారి కథలో రాణి,శ్రీపతి పాత్రల సంఘర్షణ ద్వారా చెప్తారు.

నిత్యయుద్ధం మధ్య తరగతి బ్రతుకు సమరం.అక్కడ బాధ్యతలే గురిపెట్టబడిన అస్త్రాలు.బంధాలను తెంచుకుని వెళ్లలేని జీవనం లాలన కథలో గుండెను చెమ్మగిల చేస్తుంది.

ఆ తల్లికేంకావాలి?... ఆలోచింపచేసే మరోకథ.అసలు ఏ తల్లికయినా ఏంకావాలి?చిన్ననాడు తన లాలనలో పెరిగిన పిల్లలు తన ఆలన పాలన చూసుకుంటారనుకోవడం భ్రమగా మిగిలిపోతే ఆ తల్లికి కావలసిన ఊరట చివరకు మానసిక దౌర్బల్యం రూపులో లభించడం చదివితే అయ్యో!కన్నపేగును నులిమేసే కసాయితనానికి మనసు గిలగిలలాడుతుంది. రవ్వంత అనురాగం,గోరంత సాన్నిహిత్యం ఇవే కదా ఏ తల్లయినా పిల్లలనుండి కోరుకునేవి.

మనిషిలోని భిన్నప్రవృత్తులను,అందుకు తగ్గవారి భావప్రకటనలను,వివిధ మనస్వత్వాలను వివరించి విశ్లేషించి మనలను కథాచట్రంలో ఇరికించి కూచోబెడతారు విహారిగారు.కథలను ఏకబిగిని చదివేసి ఇక లేద్దామనుకునేలోపు పాఠకుడి మనసును ముగింపు వాక్యంతో చెళ్లుమనిపించి మేల్కొలుపుతారు.ఆ తరువాత....?ఆ తరువాత ఏముంది?కథలు కత్తుల్లా గుండె లోతుల్లోకి దిగుతాయి.పాఠకుడు కథాలోకంనుండి మరిక బయటపడటం కష్టమే!ఆలోచనలు కందిరీగల్లా రొదపెడ్తుంటే పరిష్కారబాట పడతాడు.ఒక్కరైన తనదారి సక్రమంకాదు అని గ్రహించి పంథా మార్చుకుంటే కథాప్రయోజనం నెరవేరినట్లే. ఈ కథలు చదివాక రచనాపూదోటలో విహరించే కథామాలి విహారిగారినుండి మరిన్ని రచనాసుమాలకై పాఠకులు నిరీక్షించడం ఖాయం.

పుస్తకం వెల:రూ125/-
దొరకుచోటు:
విశాలాంధ్ర బుక్ హౌస్,
ప్రజాశక్తి బుక్ హౌస్,
నవోదయ బుక్ హౌస్,
దిశ పుస్తక కేంద్రం,
నవోదయ పబ్లిషర్స్

Thursday, April 5, 2012

కథాజ్వాల

5 comments

ఆవేదనల భావజాలం- కథాజ్వాల


కథలను పాత్రలు నడిపిస్తాయి.పాత్రలను వర్ణనలు వివరిస్తాయి.వర్ణనను వాక్యాలు లిఖిస్తాయి అయితే కథాజ్వాలలో ఈ ప్రక్రియ మొత్తం సమాజానికి మేలుకొలుపైన సందేశంగా,మానసిక విశ్లేషణగా, మేధోపరమైన ఆలోచనా బీజాలను మొగ్గ తొడిగేదిగా ఉండాలని చేసిన కథా రిసెర్చి మాత్రం గట్టిగా జరగిందనేది నిర్వివాదాంశం. ఏ కథనైనా తీసుకోండి.కథతోపాటు మనిషి మస్తిష్కం సైతం తన గమనాన్ని మార్చుకుంటూ ప్రగతి భావాల మాటున నడవమని పోరుతుంది.జీవిత వేదనలను జీవన వేదంగా మలచిన తీరు హృద్యమం. మాఫలేషు కదాచన,కథకు కాళ్లు,కొత్త ప్రహ్లాదుడువంటి కథలు ఈ కోవలోకే వస్తాయి. భావిపౌరుల దీనగాథలు, బలహీనుల ఆర్తనాదాలు బలంగా వినిపించిన కథలు. అణగారిన వర్గాలు ఎలా అణచివేయబడ్డాయో మనసును పిండేలా కథాకళిని నర్తింపచేసిన కథలివి.చేత బెత్తం పట్టిన మాస్టారు చదువు చెప్పినట్లు,పాఠకుడిని కూచోబెట్టి వల్లె వేయించగల కథాకథనం పాఠకుల మెదళ్లలోకి సూటిగా ఇంజెక్ట్ చేయ బడుతుంది. మనసులోని సంక్షోభం బయట పడకపోతే బ్రతుకే సంక్షోభంలో పడిపోతుంది అంటారు జ్వాలాముఖి గారు. జీవిత సత్యాలను, జీవన సూత్రాలను కథీకరించి కథను కదం తొక్కిస్తారు.వెట్టి చాకిరీ దురాగతాలను ఎండగడతారు.
హైదరాబాధలు!అంటూ విభజించిన రచనలలో కథల నిడివి పెద్దదే.అయితే వాటిలో అమరిన పదాల పోహళింపు సూక్తి ముక్తావళే!గతం గుణపాఠంకావాలి,ప్రస్తుతం ప్రాప్తకాలజ్ఞత కావాలి అంటారు అల్లాదీన్ ఆకాశదీపం కథలో.ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోకి పోయే పోరాట ప్రక్రియ జీవితం అని జీవితాన్ని నిర్వచిస్తారు.నేలవిడిచి సాము చేయని వీరి కథలు జీవితాలను నిలువుటద్దాలలో నిలబెడతాయి.

Sunday, April 1, 2012

బ్లాగ్మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

10 comments