Monday, January 30, 2012

జ్ఞాపిక-కథ వెనుక కథ

6 comments






ఆంధ్రప్రభలో ప్రచురింపబడిన కథ.

బాల్యపు జ్ఞాపకాల తోటలో అపురూపమైనవి చిన్ననాటి ఫోటోలు.ఆనాటి ఫోటో కలిగించిన ప్రేరణే ఈ కథ.

జ్ఞాపిక

‘’తాతయ్యా ఈ ఫోటో చూడు’’
ఆనందంగా తాతయ్యకు తన ఫోటో అందించింది ఏడేళ్ల భావన.
పాప పుట్టిన గంటలోనే తనే స్వయంగా తీసిన ఫోటో అది. తన అతి చిన్నప్పటి ఫోటో అంటే భావనకు అమితమైన ఇష్టం.ఆల్బమ్ తెరచి ఫోటోలన్నీ ముందేసుకుని చూస్తూ తాతయ్యలను,అమ్మమ్మ,నానమ్మలను,వారితో తన అనుబంధాలను గుర్తుపెట్టుకునేందుకు తల్లి నేర్పిన తారకమంత్రంగా ఫోటోలను పదేపదే చూస్తూ, ‘దిసీజ్ అమ్మమ్మ,దిసీజ్ నానమ్మ’ అని వల్లె వేస్తూ అన్నిటికన్న ఆప్యాయంగా తన మొదటి ఫోటోను పదే పదే చూసుకునే భావన అమెరికా నుండి ఇండియాకు వస్తూ, అమెరికాలో అమ్మ,నాన్నలతో పంచుకున్నతన అనుభూతులను ఆల్బంలో ఆప్యాయంగా పదిలపరచినవి తీసుకుని వచ్చింది.
“ అమెరికా వచ్చినపుడు నేనే తీసానురా అమ్మలూ నీ మొదటి ఫోటోను.”మనవరాలందించిన ఫోటోను మరోమారు తనివితీరా చూసాడు పరమేశం.
“తాతయ్యా,మరి నీ చిన్నప్పుడు ఫోటో ఏది?” భావన ప్రశ్నను ఊహించని పరమేశం మొదట తెల్లబోయినా, “అదిగో ఆ గోడ మీద ఫోటోలో” అంటూ లేచివెళ్లి ఫోటోను తీసి అందించాడు.తనెక్కడున్నాడో ! వేలు పెట్టి చూపించాడు మనవరాలికి.
“ఇదా!అంతా బ్లాక్ అండ్ వైట్ లో! వేర్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫోటో వెన్ యు వెర్ లైక్ మి? ’’
‘మనవరాలి ప్రశ్నకు, అసలు తన దగ్గరకు ఆ ఫోటో ఎలా వచ్చిచేరిందో, ప్రతిరోజు తననెలా ప్రభావితం చేస్తుందో!ఎలా చెప్పాలి?’పరమేశం మనసు గతాన్ని చిత్రిస్తోంది.
ఆ రోజుల్లో ఎవరి దగ్గర వీడియోలు లేవు,పెళ్లి ఫోటోలు లేవు.అందుకే తాతముత్తాతలని చూపించే జ్ఞాపకాలేవి లేవు.వారిగురించి తల్లిదండ్రులు చెప్పిన జ్ఞాపకాల ఊసులుతప్ప.సాంకేతిక విజ్ఞానం పెరిగేకొలది నేడు రకరకాల ఫోటోలు నిమిషంలో ప్రత్యక్షమమవుతున్నాయి.డిజిటల్ కెమెరాలు ప్రంపంచాన్ని బంధించి చూపుతున్నాయి.మరి నాడో!...
* * *
ఉదయాన్నే నిద్రలేచాడు పరమేశం.
“అమ్మా,ఈ వేళ స్కూల్ లో ఫోటో తీస్తారు,తల స్నానం చేస్తా,నీట్ గా తయారయి రమ్మన్నారు డ్రిల్ సారు. ’’
“అయ్యో,కొట్టిన కుంకుడుకాయలు లేవే?అన్న తల్లి మాటలకు మరేం ఫర్లేదు సబ్బుతోనే చేసేస్తా’’ అని గబగబా స్నానంచేసి జుట్టు ఆరగానే ఒత్తయినజుట్టుకు కాస్త ఆముదం పట్టించి,అదిమిదువ్వి,ఉన్న ఒకేఒక ప్యాంటును ఆనందంగా తొడుక్కుని అద్దంలో చూసుకుంటుంటే,
“అబ్బో! ఈవేళ నిక్కరుకు సెలవా,బానే వున్నావు పదపద స్కూల్ కు టైమవుతోంది’’ పరమేశం తండ్రి తొందరచేసాడు కొడుకును.
“ఈ రోజు పాఠాలుండవు నాన్నా,ఫేర్వెల్ పార్టీ వుంది. ’’

‘పార్టీయా!ఎక్కడ డబ్బులు అడుగుతాడో ?పైసాపైసా పోగేస్తేకాని వచ్చే ఏడాది కాలేజీ ఖర్చులు భరించలేడు.గింజగింజ పోగేస్తేకాని పైసలు చేరవు’,ఆర్థిక శాస్త్రం చదవకపోయినా బ్రతుకు శాస్త్రాన్ని ఔపోసన పట్టినవాడి మనసుపడే తపన అది.
తండ్రి మనసు చదివినవాడిలా, “మాకు మా జూనియర్లు పార్టీ ఇస్తున్నారు,ఫోటో కూడా తీస్తున్నారు. ’’ అంటూ ఆనందంగా బడివైపు పరిగెట్టాడు పరమేశం
“సరే,కాస్త నవ్వు ముఖంతో పడు ఫోటోలో. ’’ వెళ్తున్న కొడుక్కు వినబడేలా గట్టిగా కేకేసి చెప్పాడు పరమేశం తండ్రి.
బిస్కట్లు,కారంబూందీ,పాలకోవా బిళ్ల ఇచ్చారు.కోవా బిళ్ల చప్పరిస్తుంటే తియ్యగా కరిగిపోతోంది.అలాగే అన్నినాళ్ల స్నేహబంధం తరిగిపోతుందేమోనన్న భావన అందరిలో దిగులు రేపింది.
ఫోటోతీసే కుర్రాడు దూరంగానున్న పట్నంనుంచి వచ్చాడేమో,విద్యార్థుల అత్యుత్సాహాన్ని తట్టుకోలేక డ్రిల్ మాస్టారి సాయంతో అందరిని ఫ్రేములోకి సరిగావచ్చేటట్లు కూర్చోబెట్టాడు.ఎండ కనుమరుగైతే ఫోటో కూడా కనుమరుగవుతుందని అతనికి తెలుసు.మరిక ఆలస్యం చేయలేదు.కెమెరా క్లిక్ మంది.ఆనందంతో చప్పట్లు కొట్టి లేచారు పిల్లలందరు.
“పది రూపాయలు కట్టి పేరివ్వండి.ఫోటోలు వచ్చాక ఇస్తాము. ’’ డ్రిల్ సార్ చెప్పిందివిని గతుక్కుమన్నాడు పరమేశం.శెనగలు,మరమరాలకే లెక్కలు కట్టి మరీ ఇచ్చే తండ్రి పది రూపాయలే!అమ్మో!
“చిన్న ఫోటో రాదా సార్? ’’ పరమేశం ప్రశ్నకు నవ్వుతూ తల అడ్డంగా వూపాడు డ్రిల్ మాస్టారు.
మాస్టారి నవ్వు చూసాక మరిమాట్లాడలేకపోయాడు పరమేశం.
“రేపు తీసుకురా డబ్బులు’’ అంటే అందరితోపాటు తల వూపేసాడు.కాదు కూడదు అని మొండికేస్తే కష్టాలన్నీ ఏకరువు పెట్టి మరీ ఇస్తాడు.అడక్కపోయినా బాగుండుననిపిస్తుంది అప్పుడు.అయినా ఉండబట్టలేక అడిగేసాడు ఇంటికి వెళ్లగానే.
“సరేలేరా,ముందు పరీక్షలకు బాగా చదువు,అయినా మీ పిల్లల ఫోటోలన్నీ మీ హెడ్మాస్టరు గదిలో తగిలిస్తారే,రోజు కనబడుతూనే వుంటాయే.మనం మాత్రం రోజు తీరికూర్చుని చూసుకుంటుంటామా?ఎదురెదురుగానే వున్నవాళ్లందరు ఒకరినొకరు చూసుకుంటానే వున్నారు కదా! ’’
“అయ్యో నాన్నాఈ ఫోటో మా బాల్యపు తీపిగురుతని నీకెలా చెప్పాలి?పరీక్షలయాక ఎవరెక్కడుంటామో?ఎప్పుడు కలుసుకుంటామో? ’’
“సరే చూద్దాంలే’’
ఆ మాటకే సంబరపడిపోయాడు పరమేశం.
ఇవాళ రేపు అనుకుంటుండగానే పరీక్షల టైంటేబిల్,పరీక్ష సెంటర్ల హడావిడి1
పరీక్షలన్నీ సంతృప్తికరంగా రాసాక స్కూలుకు వెళ్లి ఆఫీసురూంలోవున్న డ్రిల్ సార్ కు నమస్కరించి,
“ఫోటోలున్నాయా సార్’’ అని అడిగాడు పరమేశం.



“ఇంకానా,పెద్దకామందు గారి అబ్బాయి,కరణంగారి అమ్మాయి,తహసీల్దారుగారి చెల్లెలి కొడుకు అందరు ఫోటోలు పట్టుకెళ్లారుగా. ’’
‘నీవెందుకు తీసుకోలేదు’ అన్నట్లున్న చూపులను తప్పించుకుంటూ,
“సార్, పోనీ నెగటివ్ ఉందా’’ ఆశగా అడిగాడు పరమేశం.
“అదిక్కడెందుకుంటుంది?ఫోటో స్టూడియోలో ఉంటుంది కదా,ఇంతకీ ఫోటో చూడనేలేదా ’’ అంటూ ఒక కవర్ లోనుండి ఫోటో తీసి చూపాడు.
ఆనందంగా ఫోటో అందుకోబోయాడు.
“సరిగా పట్టుకో.అలా కాదు ,వేళ్లముద్రలు మచ్చలుగా పడతాయి.అదీ అలా..... ’’
ఫోటో అంచున పట్టుకుని కళ్లతోనే తడిమాడు.
ఫోటో! తన జీవితంలో మొదటి ఫోటో,ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు,ఉపాధ్యాయురాండ్రు.స్కూలు ప్యూను అందరు కలిసివున్న గ్రూపు ఫోటో.మరోమారు ఆనందంగా చూసి వెనుదిరిగాడు నిస్పృహగా.

మార్కుల రిజిష్టరు వచ్చిందని హెడ్మాష్టరు దగ్గరకు వెళ్లాడు పరమేశం అందరితోపాటు.
ఆశగా గోడలవైపోసారి చూసాడు.
“ఏమిటలా దిక్కులు చూస్తావ్,ఇక్కడ సంతకం పెట్టు పరమేశా! ’’ హెడ్మాష్టరు నవ్వుతూ చేసిన హెచ్చరికతో ఉలిక్కిపడి సంతకం పెట్టి మార్కుల రిజిష్టరందుకున్నాడు.
ఇక మార్కుల పర్సెంటీజీల లెక్కలు,తీసుకోవాల్సిన గ్రూపులపై చర్చలు,మధ్యమధ్యలో మనసులో మెదిలే ఫోటో!
కాలేజీలో చేరేటప్పుడు వచ్చే కొత్తబట్టలు,కొత్త పుస్తకాలు,కొత్తపెన్ను,కొత్త చెప్పులు అన్నీ కొత్తవే!ఇక స్నేహాలు కొత్తవే.స్నేహితులను ఎప్పుడు కలుసుకునే బస్టాండులో మరోమారు కలుసుకుని మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో,ఎక్కడ కలుసుకుంటామో అనుకుంటూ ఇంటిదారి పట్టాడు.దారిలో వగరుస్తూ ఎదురయాడు నరేష్.హడావిడిగా పరిగెడుతున్నాడు.
నరేష్ ను ఆపి, “ఏమైందిరా? ’’ అని ఆతృతగా అడిగాడు పరమేశం.
“అయ్యో!నీకు తెలియదా..మన వేణు చెట్టుమీదనుండి పడిపోయాడట హాస్పిటల్ కు పట్నం తీసికెళ్తున్నారట. ’’
పరమేశం నరేష్ ను అనుసరించాడు.ఇల్లు తాళం వేసి ఉంది.నిరాశగా వెనుదిరిగారు.రోజులో ఒకసారైనా వేణు ఇంటి మీదుగా వెళ్లేవాడు పరమేశం.వేణు వచ్చి ఉంటాడేమోననే ఆశ!మనసంతా వేణు తలపులతో నిండిపోయేది.నెమ్మదిగా మాట్లాడినా చురుకుగా ఉండేవాడు. చదువులోతనపనేమో తానేమో.అయితే ఆటలలోబెస్ట్.చెట్లెక్కడంలో ఫస్ట్.చెట్లపై కోతికొమ్మచ్చులాడేవాడు.ఈ సరదా ఆట వేణునిలా పడగొట్తుందని అనుకోలేదెవరూ.
వాడుకగా వేణు ఇంటి ముందునుంచి వెళ్తున్నాడు పరమేశం.వేణు ఇంటి ముందు సందడిగా ఉంది. వేణును చేతులమీద దించుకుని వెళ్తున్నారు ఇంటి లోపలికి. చెమటలు పట్తున్నాయి పరమేశానికి.ఆతృతగా ఇంట్లోకి వెళ్లాడు.


వేణు తల్లి ఏడుస్తోంది. తండ్రి నిర్లిప్తంగా గోడకు చేరగిలపడున్నాడు. “చెట్లెక్కకురా అంటే విన్నావా’’ వేణు అమ్మమ్మ ఓవైపు అరుపులు, మరోవైపు ఏడుపులు.
“వేణూ! ’’ ఆప్యాయంగా పిలిచాడు పరమేశం.
పరమేశాన్ని చూసి వేణు కళ్లు సంతోషాన్ని నింపుకున్నాయి.
“కాలేజీలో చేరుతున్నారటగా?’’ ఉత్సుకతతో అడిగాడు వేణు.
అవునని ఆనందంగా అనలేకపోయాడు పరమేశం.
“నేనిక నడవలేనన్నారు డాక్టరు,వెన్నెముకలో నరాలు దెబ్బతిన్నాయట. ’’
సైన్సులో చదివిన నాడీ వ్యవస్థ గుర్తుకొచ్చి వెన్నుపాము జలదరించినట్లయింది పరమేశానికి.
“మరెలా? ’’ ఏమనాలో తెలియలేదు పరమేశానికి.
“ఏముంది...ఇలా మంచంలోనే.. ’’ కళ్లల్లో కాంతిలేని నవ్వు వేణు పెదవుల మీద.ఏం చెప్పాలో తోచక పరమేశం పైకి చూసాడు.
పరమేశం కళ్లు ఆనందంగా మెరిసాయి.తమందరు కలిసి తీసుకున్న గ్రూపుఫోటో అందంగా ఫ్రేము చేయబడి గోడమీద!పరమేశం ఆనందాన్ని గుర్తించాడేమో, “ఫోటో చూడలేదా?’’ అడిగాడు వేణు.
“చూసాను స్కూల్ లో కాని తీసుకోలేకపోయాను. ’’
“అరెరె మిస్ అయావే,సరేపోనీ తీసిచూడు,చూస్తే చాలదు అందులో వుండే మనవాళ్లు ఒకొక్కరు ఎక్కడికెళ్లారు,ఏ కాలేజీలో చేరుతున్నారు ఇవన్నీ నాకు వచ్చి చెప్పాలి,సరేనా? ’’ మాటలు డిమాండింగ్ గా వున్నా వేణు గొంతు దీనంగా పలుకుతోంది.
“అదేంట్రా నువ్వు నన్ను అడగాలా?రోజు వస్తా కాలేజీలో చేరేదాకా సరేనా.’’ వేణు చేతిని ప్రేమగానొక్కి చెప్పాడు పరమేశం.
అలా ఫోటోను చూసే భాగ్యం ప్రతిదినము కలుగుతుందనే ఆనందము కలిగింది.ఇక రోజు వేణు దగ్గరకు వెళ్లడం,స్నేహితుల గురించి పాత జ్ఞాపకాలకు కొత్త సంగతులు మేళవించి వర్ణించిమరీ చెప్పేవాడు పరమేశం.గోళీకాయలు మొదలుకుని చెడుగుడు ఆటవరకు చెప్పుకుని పడిపడి నవ్వుకునేవారిద్దరూ.ఎవరెవరు ఎక్కడ చేరుతున్నది అన్నీ వివరంగా తెలుసుకునేవాడు వేణు.వేణు ముఖంలో నీలినీడలు పరచుకుంటే పరమేశం ప్రాణం విలవిలలాడేది.వేరే మాటమార్చి తాత్కాలికంగా మరిపించేవాడు.వేణు తల్లి కూడా తనకొడుకు దగ్గర కూర్చుని కబుర్లు చెప్తున్న పరమేశాన్ని ఆప్యాయంగా పలకరించేది.ఫోటో చూసుకుంటూ కన్నుల్లో నీరు తనకు కనబడకుండా తుడుచుకునే కొడుక్కు పరమేశం కలిగించే ఊరట చూసి ఆమె కళ్లు చెమ్మగిలేవి.
కాలేజీలో చేరాడు పరమేశం.ఇక వేణును పలకరించడం సెలవులలోనే సాధ్యమయేది. నానాటికీ వేణు ఆరోగ్యం మెరుగవడంకాక క్షీణించసాగింది.ఎవరు కదిలించబోయినా ఏడ్చేసేవాడు.పరమేశం కనబడినప్పుడు మాత్రం బాధ మరచినట్టు నవ్వును అరువు తెచ్చుకునేవాడు.


ఒకరోజు హఠాత్తుగా, “ పరమేశం ఈ ఫోటో నువ్వు తేసేసుకో.’’ అన్నాడు వేణు.
“వద్దు వేణు ఏదో కొత్తలో గమ్మత్తుగా ఉండి రోజు చూస్తుండేవాడిని,ఇప్పుడాసరదా తీరిపోయిందిలే నువ్వు మమ్మల్నందరిని రోజు చూసుకోవచ్చుగా. ’’ అన్నా డు పరమేశం.
“అదేంకాదు,వీరందరు పేరుపేరునా నీ మనసులో హత్తుకుపోయారు.అందరిని చక్కగా గుర్తుంచుకున్నావు.నీ దగ్గరసలు ఫోటో లేదుగా. ’’ ఫోటో బలవంతంగా చేతిలో పెట్టాడు.మరోమారు ఫోటోవంక తదేకంగా చూసి సరేలే అంటూ ఫోటోను గోడకున్న మేకుకు తగిలించేసాడు పరమేశం.
“సరే నీ ఇష్టం ఆ ఫోటో నీ దగ్గరకు ఎలాగోలా చేరుస్తాలే. ’’ నవ్వాడు వేణు.
మొదటి టర్మ్ ఎగ్జామ్స్. ఇంటి ధ్యాస మరచి పుస్తకాలకే అతుక్కున్నాడు పరమేశం.అప్పుడు పి.యు.సి ప్రొఫెషనల్ కాలేజీకి గడపలాంటిది.అది దాటితే ఉద్యోగమొచ్చినంత సంబరమే!
పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే కమ్మటి భోజనం, ముక్తాయింపుగా చివరలో తిన్న గడ్డ పెరుగు నిద్రను ఆహ్వానిస్తున్నా వేణును కలవాలని మనసు తొందర చేస్తోంది.అడుగులు వేణు ఇంటివైపు గబగబ పడుతున్నాయి.
తలుపు తాకగానే తెరుచుకుంది.తలుపు తెరచిన వెలుగులో వేణు పడుకునే మంచం శూన్యంగా....
తెలియని భీతి ఆవహించింది పరమేశాన్ని.
“రెండ్రోజులయిందిపోయి. ’’ పీలగా పలుకుతోంది వేణు తల్లి గొంతు.వేణు పడుకున్న మంచంపై కూర్చుని ప్రేమగా తలగడను తడుముతూ దుఃఖాన్ని దాచుకునే ప్రయత్నంలో వెక్కుతున్నాడు పరమేశం.
“లే నాయనా ఇదిగో ఈ ఫోటో నీకిమ్మన్నాడు. ’’ ఫోటోను చీరకొంగుతో తుడిచి చేతికందించింది.ఫోటో వైపు చూసాడు పరమేశం.
కన్నుల్లో కమ్ముకున్న నీరు ఫోటోలో వున్న వేణును మసగమసగ్గా చూపిస్తోంది. “ఇది నీ జ్ఞాపిక వేణూ ’’ అంటూ ఫోటోలో ముఖాన్నిదాచుకున్నాడు పరమేశం.
* * *
తాతయ్యా ఎందుకు ఫోటోతో మూసుకున్నావు?తాతయ్య ముఖాన ఉన్న ఫోటోను తొలగించి నవ్వబోయింది భావన. తాతయ్య జ్ఞాపకాలను కదిలించింది తనేనని తెలియని భావన తాతయ్య కళ్లలోని భాష్పానికి భాష్యం వెదకుతోంది.
* * *

Wednesday, January 25, 2012

కథాజగత్-మాతృన్యాయం

0 comments
మాతృదేవోభవ అనే పదానికి న్యాయం చేసిన కథ మాతృన్యాయం

మాతృన్యాయం-రచయిత: గంగా శ్రీనివాస్

ఈ కథకు సమీక్ష రాయడం ప్రారంభించిన రోజే కన్నవారిని కాదంటే భరణం కట్టాల్సిందే అనే వార్తను చదవడం తటస్థించింది. ఆదాయవనరులు,కుటుంబసభ్యుల సంఖ్యనుబట్టి మార్గదర్శకాలుకూడా జారీ చేసినట్లు వార్త చెప్తోంది.తల్లిదండ్రుల సంరక్షణ,వయోవృద్ధుల నిబంధనలు-2011 అమల్లోకి వస్తే తల్లిదండ్రులకిక అన్యాయమే జరగదు,పిల్లలు సేవలు చేస్తుంటే వారి పని ఇక కాళ్లూపుతూ కూర్చోవడమేనని అనుకుంటారేమో!

కథావస్తువును ఎంచుకునేటప్పుడు పాతవిషయాన్నికాక కొత్తదనానికై అన్వేషణ జరగడం సహజం.వృద్ధులైన తల్లిదండ్రులు-పిల్లల నిరాదరణ అన్నసమస్య నిత్యనూతనం కాదుకాని అదొక రావణకాష్ఠం.నేటియవ్వనమే రేపటి వార్ధక్యం కదా?అద్భుతమైన మార్పు ఆవిష్కరింపబడితే తప్ప ఈ విషయం పాతబడదు.మరి ఈ మార్పు ఎక్కడ ప్రారంభమవాలి? మనిషిలోనా?మనుగడలోనా?పిల్లలప్రవర్తనాతీరును,తల్లిదండ్రులపట్ల వారి ఉదాసీనతను సమాజం ఆక్షేపించాలా లేక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా?ఇలాంటి ప్రశ్నలెన్నిటినో లేవనెత్తిన కథలోని మలుపులు చూద్దాం.
న్యాయవాది రాఘవరావు నేరస్థుడిని శిక్షింపచేయడంలో తన వాగ్ధాటినే పదునైన కత్తిగా వాడటంలో దిట్ట.అటువంటి న్యాయవాది, తన పొరుగుననే వున్నవృద్ధదంపతులు దుర్గాంబ,అనంతపద్మనాభంలు కొడుకు ఇంట,కోడలిచేత పడుతున్న అగచాట్లను నిశితంగా గమనించేవాడు.ఆ నేపథ్యంలో వారి కొడుకు,కోడలిపై క్రిమినల్ నెగ్లిజన్స్ నేరంగా ప్రతిపాదించి,విధింపచేసే శిక్ష కఠినమైనదే అవుతుంది.
శారీరక బాధలకు పరిష్కారం వైద్యం.మందులు,సర్జరీలు అనారోగ్యాన్ని జయించలేనపుడు విముక్తిగా మరణాన్ని కోరుకుంటాడు మనిషి.అయితే మానసిక,శారీరక బాధేదైనా పిల్లల ప్రేమపూర్వక పలకరింపులే అమ్మానాన్నలకు చలివేంద్రం.ఇవి కొరవడిన అనంతపద్మనాభం తమ పుత్రుడు తమను శారీరక,మానసిక బాధలకు గురి చేస్తున్నాడని న్యాయవాది రాఘవరావు ద్వారా కోర్టుకు ఫిర్యాదు చేస్తాడు.ఇక కోర్టు వాతావరణాన్ని కథనానికి తగినట్లు చిత్రీకరించడంలో శ్రీనివాస్ గారు నూటికి నూరు శాతం సఫలీకృతులైనట్లే.
న్యాయవాది ఆస్తుల వివరాలు ప్రశ్నించినపుడు దుర్గాంబ తడబడుతుంది.ఆ తడమాటుకు తన చురచుర చూపులతో అనంతపద్మనాభం చురకలంటిస్తాడు.కథాశిల్పంలో ఈ ఎత్తుగడ కథాపఠనంపై ఉత్సుకతను పెంచింది.ముగింపుఎలా ఉంటుందోనన్న ఆతృతకు మొగ్గ తొడిగింది.తల్లిదండ్రులమీద దయలేని పుత్రులను చెదలతో పోల్చిన వేమన మానవత్వంలేని పుత్రులను కాస్తంత ఘాటుగానే విమర్శించాడు.అదే తనమాటగా నొక్కిచెప్పాడు న్యాయవాది రాఘవరావు.కొడుకుకోసం తమ ఆస్తులన్నీ కరిగించేసుకున్న దుర్గాంబ,అనంతపద్మనాభంల కొడుకు సాయికిరణ్ ను కఠినంగా శిక్షించాలని రాఘవరావు కోర్టును కోరడం సామాజి స్పృహ వున్న ఎవరిచేతనైనా ఆమోదింపబడే న్యాయమే.

డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ క్రాస్ ఎగ్జామిన్ కు ఉపక్రమించినపుడు దుర్గాంబ పేరు లలితమ్మగా మారడం కథాగమనానికేం అడ్డుకాలేదు.

మనవడు తేజను బడికి తీసికెళ్లినపుడు జరిగిన ప్రమాదంలో తేజ,అనంతపద్మనాభం ఇద్దరు గాయపడతారు.ఆ రోజు పుట్టినరోజు కూడా కావడంతో వేసిన కొత్తబట్టలు మట్టికొట్టుకుపోయి గాయాలైన తేజకు మందు రాస్తున్న కోడలు దివ్య దగ్గర, భర్తకు కూడా కాస్త మందు తీసుకోబోయిన అత్తను విసురుగా తోస్తుంది కోడలు.ఫలితం..గోడను గుద్దుకుని తల చిట్లి సొమ్మసిలి పడిపోతుంది దుర్గాంబ.ఈ సంఘటనే అనంతపద్మనాభాన్ని కోర్టు ముంగిట నిలిపింది.అయితే కోర్టులో దుర్గాంబ సమాధానాలు అందరిని ఆశ్చర్యపరిచే దిశగా సాగుతాయి.అటు కొడుకు ఇటు భర్త! ఎవరి పరువు భంగపడరాదు.వారిద్దరి మర్యాద తనపైనే ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు.భర్త బాధపడినా కొడుకు చిన్నబోయినా ఆమెకు బాధే!సమాజంలో జరిగే తప్పుకు సమాజం బాధ్యత ఉండదా?ఈ ప్రశ్న దుర్గాంబ సంఘర్షణలోనుండి ఉత్పన్నమవుతుంది.

ఒకప్పుడు పాఠశాలల్లో మోరల్ సైన్స్ పేరిట వారానికి ఒక పీరియడైనా వుండేది.కాని ఆ సమయాన్నికూడా లెక్కలు,కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటరు కబ్జా చేస్తున్నాయి.కాసులొచ్చే చదువులకే క్లాసులలో ప్రాధన్యత పెరిగి సమాజానికి ఉపయోగపడే పాఠాలు
మృగ్యమవుతున్నాయన్న నిజాన్నితల్లి దుర్గాంబ పాత్ర ద్వారా రచయిత చక్కగా వినిపించారు.

పెద్దలకు,పిల్లలకు నడుమ అత్మీయబంధమే గృహపాలనలోని మూలసూత్రంగా గుర్తింపునందుకున్ననాడు శ్రీనివాస్ గారి చేతిలో పురుడు పోసుకున్నఈ కథకు ఊపిరందుతుంది.చివరకు టి.వి. సీరియళ్లలోని అత్తా కోడళ్ల హింసనాదాలు కూడా మనుషులదారేకాక మనసులదారే తప్పేటట్లు చేస్తున్నాయి,నీతిపాఠాలు నేటి పిల్లలకు దూరమయాయంటూ దుర్గాంబ కార్చిన కన్నీరు కన్నతల్లులందరిదీ. ఆవేశంలో జరిగే అనర్థాలలో ఇది కాకతీళయంగా జరిగిన ఒక సంఘటనే తప్ప మరేమి కాదంటూ,ముందుగా పథకరచన జరగలేదన్న సూక్ష్మాన్ని హుందాగా తెలిపిన దుర్గాంబ మాటలు అందరిని మాటరానివారిని చేసాయి.కోడలి దురుసుతనానికి,కొడుకు నిర్లిప్తతకు తగిన శిక్ష పడాలని వాంఛించిన అనంతపద్మనాభం ఆవేశానికి దుర్గాంబ పలుకులు హిమవర్షమే!ఇక చివరకు వారి కొడుకు సాయికిరణ్ కు ఏ శిక్ష పడుతుందోనని ఆతృతగా చూస్తుంటే తల్లిదండ్రులను యాత్రలకు తీసికెళ్లమని న్యాయమూర్తి సూచించినపుడు శ్రవణకుమారుని కథ గుర్తుకు వస్తుంది.మరి అన్యాయానికి న్యాయం చేసిన మాతృన్యాయమూర్తి చేసింది సబబేనా అని ప్రశ్నించుకుంటే విభిన్నస్పందనలు వినిపిస్తాయి.ఎన్నివిన్నా చివరకు చెప్పగలిగేదొకటే....మాతృదేవోభవ!

సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకుని దాని వెనుకగల మూలకారణాలను దుర్గాంబ పాత్ర ద్వారా తెలియచేసి చర్చకు వేదిక కాగల అంశాలనెన్నింటినో మనముందుంచిన రచయిత గంగా శ్రీనివాస్ గారు అభినందనీయులు.
మాతృన్యాయం కథను క్రింద ఇవ్వబడిన లింకులో చదవండి.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/matrn-yayam



src="http://kinige.com/images/kinigebannerimage.png"border="0">

కినిగె తెలుగు పుస్తకానికి చిరునామా

Thursday, January 19, 2012

అబ్బా!ఎంత పులుపు!

0 comments
షడ్రుచులలో పులుపుది ప్రత్యేకమైన స్థానం.ఎన్ని రుచులున్నా తలచుకుంటేనే నోరూరించే రుచి మాత్రం పులుపుదే.కారం.చేదు,వగరు, తీపు ఏది చూచినా నోరూరనిది పుల్లనిది చూస్తూనే నాలుక అతి వేగంగా స్పందిస్తుంది.ఇక చింతచెట్టు క్రింద చింతకాయలు రుచి చూస్తున్న ఈ చిన్నారి హావభావాలు చూస్తూంటేనే పుల్లపుల్లగా...




Tuesday, January 17, 2012

సాహితీకడలికి అక్షరనీరాజనం సముద్రం!

2 comments
సముద్రం-కథా రచయిత:పాపినేని శివశంకర్

సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?ఇదీ కథ ప్రారంభం!ఛాయిస్ లో వదిలేద్దామనిపించే ప్రశ్న.కథాగమనంలో లోతు తెలిసేకొలది జవాబుకు ఎదురుచూస్తూ అదే ప్రశ్న చర్విత చర్వణమై మనల్ని నిలదీస్తుంది.పాపినేని శివశంకర్ గారి కథనం నర్తించిన తీరు నల్లేరుపై నడకేయైనా సాహితీ భాండాగారంలోని అరిసెలు,గారెలు,బొబ్బట్లనదగ్గ సాహితీరుచులను చవిచూపిన రీతి మాత్రం అభినందనీయం.
తన స్నేహితుడైన వనమాలిలోకి సాహితీ ప్రవేశం చేసిన రచయిత తాను తడిమిన మైలురాళ్ల జ్ఞాపకాలతో పాఠకులను మమేకం చేస్తూ గావించిన కలం కవాతు కొత్తదనాన్ని సంతరించుకుని పఠనాసక్తిని,రచనానురక్తిని చిప్పిలచేసి సాహితీసౌరభాన్ని గుబాళింపచేసింది. శ్రీశ్రీ,తిలక్,చలం,షేక్సిపియర్ ఒకరా,ఇద్దరా!ఎందరో సాహితీ పిపాసులను అల్లనల్లన తడిమి సువర్ణాధ్యాయాన్ని కనులముందు సాక్షాత్కరింపచేయడం కథ విశిష్ఠతను ద్విగుణీకరింపచేసింది.
వృత్తిలో ప్రవృత్తిని మిళితంచేసి సామాజిక అవగాహనను ఒక సమాచారంగా కాక సృజనాత్మకంగా వనమాలి తన విద్యార్థులకు బోధపరచే విధానాన్ని వివరిస్తూ పాఠాలలోకికాక పుటలలోకి విస్తరించడం అనే వాక్య ప్రయోగం సముచితం,సందర్భయోగ్యం.పుస్తకంలో ఐక్యం కావడమంటే ఇదే.
రాహుల్ సాంకృతాయన్ ఓల్గాసే గంగా,ప్రేమ్ చంద్ రంగభూమివంటి సాహితీ సృజనకారులను వీరి కలం స్పృశించినవేళ చరిత్ర మనోయవనికపై చలనచిత్రమవుతుంది.
వుయ్ ఆర్ ది హాలో మెన్,వుయ్ ఆర్ ది స్టఫ్డ్ మెన్...టి.ఎస్.ఎలియట్ వేదనాక్షరాలు నేడు ఎల్లెడల కనబడుతున్న మనిషి డొల్లతనాన్ని,కృత్రిమ పూర్ణత్వాన్ని మరోమారు వనమాలి ముఖత పలికిన వైనాన్ని గుర్తు చేయడం నేటి సమాజ ముఖచిత్రాన్నిఅంజనం వేసి చూపడమే!
వనమాలి సహధర్మచారిణి కమలినిని పెళ్లి చూపులలో చూసినప్పుడు పరస్పర వివరాలగురించికాక అన్నా కెరినినా గురించే మాట్లాడినపుడే ఆమెకర్థమైంది అతడి జ్ఞాన దాహం.సాహితీ సముద్రాన్ని ఔపోసన పట్టేంత కాంక్షతో ఎదగడం రచయిత తడిమిన ప్రతి రచనలోను ప్రస్ఫుటమవుతుంది.సముద్రమంతా అల్లకల్లోలమైనా,తాను మాత్రం సాహితీ సముద్రాన్ని ఈదుతూ ఉండిపోవడం సామాన్యుల ఊహకందని విచిత్రం!అయితే మనిషిని తనలో కలిపేసుకున్న పుస్తకానికే అగ్రతాంబూలం.
ఇంట్లో పుస్తకాల అరలు,గ్రంథాలయంలో బారులు తీరిన పుస్తకాల బీరువాలు వనమాలిని పలకరించే నిత్య నేస్తాలు.మూర్తిమత్వమందిన పుస్తక రాశుల నడుమ మనుష్యుల మధ్యకన్నా మిన్నగా గడిపే వనమాలి అంశగల పుస్తకప్రియులు నేడు ఎందరో వున్నారన్నది అక్షరసత్యం.
ఎందుకు చదవాలి పుస్తకాలు అనుకునేవారిని చేష్ఠలుడిగి చూస్తాం!సాహితీ జీవనమే పరమావధిగా భావించిన వనమాలికి సన్మానం జరగడం అసాధారణమేమిగాదు.కాని ఇంతటి విజ్ఞానం తమను అందలమెక్కించలేదని,ఎప్పటికి క్రింది మెట్టు పైనే వున్నామన్న కూతురు విమల ఆక్రోశం,తండ్రిపై ఉక్రోషం ఆమె దృక్పథం దృష్ట్యా న్యాయసమ్మతమే అనిపించినా ఆర్థిక సోపానాలకేకాని జ్ఞాన సోపానాలకు విలువలుండవా ఈ సమాజంలో అని గుండె గుబులు పడుతుంది.దూరంగా ఉండీ మనసులు దగ్గరకాలేకున్న వారసులకు ధనసంపద మాత్రమే వారసత్వానికి పనికివచ్చి,జ్ఞానసంపద తాకరానిదైనపుడు వనమాలి స్థితప్రజ్ఞత ముఖేష్ పాటలో రచయిత పాపినేని శివశంకర్ గారు ఉటంకించడం..యహా పూరా ఖేల్ అబీ జీవన్ కా,తూనే కహా హై ఖేలా,చల్ అకేలా,చల్ అకేలా..హాట్సాఫ్!
స్టీఫెన్ హాకింగ్స్ బ్లాక్ హోల్స్ స్మాల్ యూనివర్స్ గురించి అవసానదశలోను ఆలోచించగల ఆసక్తి..ఆశక్తి!విభిన్నమార్గాలలో సాహితీ సముద్రం తను నడయాడిన దారిని మరింత విస్తృతపరుస్తూ మన జీవనంలో కోరుకున్నవారికి కోరినట్లు లభించినా ఏమవుతాయో ఈ పుస్తకాలన్నీ!అటు వనమాలిలోను నిర్లిప్తత! అతని తలగడ ప్రక్కనే పెర్కిన్స్ పుస్తకం,బోర్లాతెరిచిపెట్టి!మనసులో దుఃఖాన్ని ఎవరో ఏతమేసి తోడిపోసినా తీరనిబాధ పుంజీలు తెంపుకుంటుంది.కథాగమనానికి పాత్రల పరిధి స్వల్పమైనా కథనానికది కొదువకాలేదు. పఠనాసక్తిగల పాఠకులతో పంచుకోవాలనుకునే ఈ కథను సమీక్షకు ఎంచుకున్నాను.ఎటు చూసినా పుస్తకాల దొంతరలు! రెపరెపలాడుతున్న పుస్తకకెరటాలు అలలు అలలుగా చుట్టు కమ్ముకొస్తుంటే నిండు సాహితీ సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యగలం? వనమాలి పాత్ర ద్వారా పుస్తక ప్రియుల అంతరంగాన్నిసాహితీసముద్రంగా అభివ్యక్తీకరించిన రచయితకు ధన్యవాదాలు.
తురుపుముక్క-కథా జగత్ లో ప్రచురితమైన ఈ కథను క్రింద ఇచ్చిన లింకులో చదవగలరు.

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/samudram---papineni-sivasankar




src="http://kinige.com/images/kinigebannerImage.png" border="0" >

కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా

Saturday, January 14, 2012

సంబరాల సంక్రాంతి

5 comments

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

సాహిత్యం ఎందుకు చదవాలి?

2 comments
ఒకసారి ఇంటిదగ్గరేవున్న లైబ్రరీలో సాహితీసమాలోచన జరుగుతోంది.పాఠకులంతా ఎంతో శ్రద్ధగా వింటున్నారు అని లైబ్రరీ పెద్దలు,ఆసక్తిగా వింటున్న రచయితలు,రచయిత్రులు తలపోస్తున్నారు.ఎనీ డౌట్స్?అని అంతవరకు ప్రసంగించిన వారు అడగడం ఆలస్యం పై ప్రశ్నశరమై వచ్చితలలో పాతుకుంది.అడిగినగొంతును గుర్తించి అందరు ఆ అమ్మాయివైపుకు తిరిగారు.అవును,ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత అందరిదీ.అప్పటికప్పుడు చెప్పిన సమాధానాలు ఒకొక్కసారి సంతృప్తినివ్వవు.మరికాస్త వివరించి,నచ్చచెప్పితే సాహిత్యాన్ని వాడనీయకుండా కాపాడుకోవచ్చుననే ఆశే ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ.
పుస్తకం హస్తభూషణం అంటారు.రైల్వేస్టేషన్లో హిగ్గిన్ బాథమ్స్ మొదలుకుని కిళ్లీ బడ్డీలో అర్ధణాకు అద్దెకె తెచ్చుకున్న పుస్తకంతో మమేకమైన రోజులు,గడిచిన తరానికి ప్రతినిధులైన పుస్తక ప్రియులకు తియ్యని జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి.
సాహిత్యమెందుకు చదవాలి?లాభమేంటి?పుస్తకం చదివే సమయంలో మరేదైనా లాభదాయకమైనపని చేయొచ్చుకదా?అని ప్రశ్నించేవారూ ఉన్నారు.పుస్తకాన్ని తాకితే ఎక్కడ అతుక్కుపోతుందేమోనని భయపడేవారెందరో అడిగే ప్రశ్నలివి.సైన్స్ చదువు డాక్టరవుతావు,లెక్కలు చెయ్యి ఇంజనీరవుతావు అని చెప్తాం కాని సాహిత్యాన్నెందుకు చదవాలి? అని అడిగినపుడు మనసుతడబడుతుంది.సమాధానం చెప్పలేక కాదు,మనల్నిమనం ఎందుకు మరచిపోతున్నామని?మనలో అంతర్ముఖీనత కరవైనందుకు హృదయం కాసేపు కలత చెందుతుంది.ఛాయిస్ లో వదలేసిన ప్రశ్నలుగా వాటిని భావించుకుని మనసుకు సర్ధిచెప్పుకోవడం కనబడే మార్గం.అలాగని సరిపుచ్చుకుంటే సమాధానం దొరక్క ప్రతిప్రశ్నా తెల్లబోతుంది.
గాఢమైన జీవితానుభవాలు,నిత్యసంఘర్షణ,విభిన్న స్పందనలు,ఊహలు,అనుభూతులు, సామాజిక చైతన్యం,వాస్తవఘటనలు,మరెన్నో సంఘటనలు.ఇదే జీవిత సమాహారం.మనసుతెర తొలగితేనే స్పందన.విభిన్న అంశాలకు,విభిన్నరీతులలో స్పందించిన రచనా శిల్పుల సాహితీపోకడలను,వాటి వెనుకనున్న ఆశయాలను,ఆకాంక్షలను వారి రచనలొసగే ప్రయోజనాలను వెరసి వారి సాహిత్యపు తీరుతెన్నులను స్పృశించడమంటే కొండను అద్దంలో చూపించడమే!
సాహిత్యానికి విభిన్న రూపాలున్నట్టే విభిన్న నిర్వచనాలున్నాయి.జీవితాన్ని దర్శించేదే సాహిత్యమంటారు కొందరు.జీవిత విమర్శే సాహిత్యమంటారు మరికొందరు.ఎవరేమన్నా హితవుకోరేదే సాహిత్యం.అందుకే రచయిత లేదా రచయిత్రి సమాజంలోకి సంధించిన అక్షరాస్త్రాలు చెడును చీల్చి మంచిని నెలకొల్పే దిశగా సాగాలి.రచనలు చూపే మంచిమార్గం పాఠకులను ప్రభావితం చేస్తుందా అని తేలిగ్గా అనెయ్యవచ్చుగాని మంచిచేయకపోతే పోనీ చెడును ప్రోత్సాహించకూడదుకదా?
సాహిత్యం బహుముఖాలుగా విస్తరిల్లడం మనకందరికీ తెల్సు. కవిత,కథ,నాటకం జనబహుళ్యంలోకి చొచ్చుకునిపోయిన చక్కటి సాహితీ ప్రక్రియలు.ఇక జానపదకథలు,హరికథలు,బుర్రకథలు,అమ్మపాడే లాలిపాటనుంచి పైరగాలిలో తేలియాడే పల్లెపాటదాకా అన్నీ సాహిత్యరూపాలే!సాహిత్యం తన విశ్వరూపదర్శనంతో అటు పండితులను ఇటు పామరులను రంజింప చేయగలుగుతుంది.
మనిషి జీవనచిత్రంలో అన్నిరంగులు మిరుమిట్లు గొలపవు.కొన్ని వెలిసిపోతాయి,మరికొన్ని పూర్తిగా తడిసిపోతాయి.అయితే జీవన హరివిల్లు విరియాలంటే ఎలా?మనిషిలో ఉండాల్సిన మానవీయ లక్షణాలు ఆవిరవుతున్న ఆనవాళ్లు భయంగొల్పుతాయి.అలాంటి సమయంలోమనిషిని నిలకడగా నిలిపేది మానవీయకోణాన్నిదర్శింపచేసే సాహిత్యం.ప్రతిదినం పరుగే అయిన జీవన వేగంలో అదృశ్యచక్రాలతో పాదవిన్యాసం చేసే మనిషిని,అతని మనసును స్వాంతన పరచేది సాహిత్యం.
వాస్తవానికి మనిషి తనకుతానే దూరమవుతున్నాడు.బ్రతుకు పోరాటంలో మనిషిని కోరికలు కబళిస్తున్నాయి.వాటిని తీర్చుకునే మార్గాన్వేషణలో ఆలోచనావల్మీకం మేరుపర్వతంలా పెరిగిపోతుంది. హృదయస్పందనలు మూగపోతున్నాయి.మనోనేత్రం నిద్రపోతోంది.మేధ మౌనపాత్ర పోషిస్తుంది.భద్రత బదులు అభద్రతావలయంలోకి తానే చొచ్చుకునిపోతున్నాడు మనిషి.సంఘర్షణ జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటుంది.పుట్టుకతోనే మొదలవుతుంది సంఘర్షణ,డబ్బు,ప్రేమ,చదువు,ఉద్యోగం వీటన్నిటిలోను ఘర్షణే. వీటి నడుమ మనిషి మనసును వికసింపచేసి జీవన విలువలను నిలబెడుతుంది సాహితీరంగం.
రచయితకున్న సాహితీబాధ్యత తక్కువేమికాదు.రచనలద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి రచయితకుంది.రచనద్వారా ప్రభావితమైన మనిషి తనలోదాగివున్న శక్తులను మేల్కొలిపే ఆయుధం పుస్తకం అనితెలుసుకోగలుగుతాడు.శరీరం రోగగ్రస్థమైనపుడు మందులవాడకం తప్పనిసరి.అనారోగ్యాన్నిముందుగానే నిరోధించాలని టీకాలు వేయిస్తాం.పైగా విటమిన్లనిచ్చి శక్తిని పెంచుతాం.అలాగే మనసుకున్నస్థబ్దతను కరిగించి,విజ్ఞత కలిగించి,విచక్షణ పెంచి,స్వయం నిర్ణయశక్తిని కలుగచేసి,స్థితప్రజ్ఞతను పెంపొందించి సమస్యలను పరిష్కరించే దిశానిర్దేశాన్ని కలుగచేసేదే సాహిత్యం.మనసుకు శక్తినిచ్చిమేధను వికసింపచేసే టానిక్.టి.వి,సినిమావంటి శక్తివంతమైన మాధ్యమాలున్నాపుస్తకమే మనిషి మనసులోని బ్రతుకు పుస్తకాన్ని తెరవగలిగే మాధ్యమమని చెప్పవచ్చు.హృదయాన్నితట్టిలేపే సాహిత్యం మనకు తామరతంపరగా వుంది.పిల్లల నైతిక ప్రవర్తనను నిర్దేశించే నీతిశతకాలు సాహిత్య హితవులే.మానవతావిలువల్ని అడుగంటనీక,అడుగడుగునా సాహితీవిలువల్నిపెంచి పోషించే కథలు,సమాజాన్ని ప్రభావితం చేసే ధనసంస్కృతిని ఎండగట్టే కథలు ఎన్నోతీరులు, ఎన్నోరీతులు.విభిన్న రచయితలు విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మనిషి మనవలసిన విధమిది అని అంతర్లీనంగా నిద్రాణమైన మానవతావిలువలను సాసితీసరస్వతి ముఖత తెలియచేసే సాహిత్యం మన సొత్తు కావడం మన అదృష్టం.సామాజిక పరిణామంనుంచి గ్లోబలైజేషన్ దాకా వర్గదోపిడీ నుండి అభివృద్ధిదాకా ఎన్నెన్నో అంశాల అక్షరదీపాల సమూహమే సాహిత్యం.సాహిత్యపు వెలుగులో జీవనవిధానాన్నిమెరుగుపరిచే మెలకువలు తెలియాలంటే సాహిత్యపఠనం తప్పనిసరి.

Thursday, January 12, 2012

నాన్న ఉండాలి

0 comments
ఇటీవల విడుదలైన నవ్య దీపావళి సంచికలో నేను రచించిన కథ...నాన్న ఉండాలి.
అమ్మ,నాన్నలలో ఎవరిని కోల్పోయినా పిల్లలు భరించలేరు.విధి విధించిన అశ్రువేదనకు నా అక్షరాంజలి.



“అతడినే చెప్పనివ్వమ్మా.”డ్రామాలో ప్రాంప్టింగ్ లా తోచిందేమో చెప్తున్న లతను వారించాడు డాక్టర్ మనోహర్, ప్రఖ్యాత సైకాలజిస్ట్.
“డాక్టరుగారితో మీరే చెప్పండి నాన్నా,మీరెందుకు ఇలా అయిపోతున్నారో! ”
కూతురివంక సాలోచనగా చూసాడు ముకుందం.
‘ఆ రోజుకు వారం దాటిందేమో కూతురు తన దగ్గరకు వచ్చి.ఛ...తనవలన వీరికెంత ఇబ్బంది! తనను పట్టించుకోవద్దంటే వినదు.ఏం చెప్పాలి?తనను కూడా త్వరగా నిష్క్రమించేలా చేయమనా?’
“నాన్నగారూ,మీరిలా బాధపడుతుంటే పోయినవాళ్లు తిరిగొస్తారా?మాకు మాత్రం బాధగాలేదా అమ్మను పోగొట్టుకున్నామని. ”లత మనసులోని వేదన మాటలో కనబడుతోంది.



“అమ్మలు, నేను మీ అమ్మను పోగొట్టుకోలేదు,అంటే నా భార్యనుపోగొట్టుకోలేదు. ఒక స్నేహితురాలిని పోగొట్టుకున్నాను. తల్లిని మళ్లీ పోగొట్టుకున్నట్లుంది.నన్నొదిలి త్వరగా పైకెళ్లి పోయింది. ”ముకుందం చూపు ఊర్ధ్వదిశలో నిలబడిపోయింది.
“మరి మీరిలా బాధపడుతుంటే అక్కడున్న అమ్మ బాధపడదూ,మీ బాధేంటో డాక్టరుగారికి చెప్పండి.ఇప్పుడు అన్నిటికీ మందులున్నాయి కదా నాన్నగారూ.”
కూతురి మాటలకు నిట్టూరుస్తూ, “మనోవ్యాధికి మందుందామ్మా. ” అంటూ కళ్లుమూసుకున్నాడు కాని మనసులోనికి జొరబడే ఆలోచనలకు తలుపులు బిగించలేకపోతున్నాడు.
“ఉంది సార్, మీరు కాస్త సహకరిస్తే చాలు.మీరు మరీ అండమాన్ ఖైదీ జైలుగోడలమధ్య బందీ అయినట్లు మిమ్మల్ని మీరు నాలుగు గోడల మధ్యే బంధించుకుంటే ఎలా? ”
“సరే డాక్టరు గారు, రేపు వస్తాను.ఈ రోజు నాభార్య పుట్టినరోజు.మా ఇద్దరిలో పుట్టినరోజైనా కిస్మిస్,జీడిపప్పు బాగా వేసి ఉదయాన్నే పాయసంకాచి నైవేద్యంపెట్టాక నాకందించేది.కనీసం ఆమె జ్ఞాపకాలలో ఈ రోజును గడవనివ్వండి. ”
డాక్టర్ మనోహర్ కు వారించాలని ఉంది కాని మనోవేదనతో కృంగిపోతున్న ముకుందానికి అడ్డుచెప్పలేక సరేనన్నట్టు మౌనంగా తలవూపాడు.
“అమ్మలు పద, పాయసం కాచాలి అమ్మకు! ”
అతడికి భార్యపట్ల వున్న అనురాగానికి ముగ్ధుడైనా తన జీవనాన్ని మరీ చీకటిమయం చేసుకుంటున్న ముకుందాన్ని జాలిగా చూడటం మినహా ఆగమని గట్టిగా అనలేకపోయాడు డాక్టరు.
తాను ఔపోసన పట్టిన సైకాలజీ డిగ్రీలు ముకుందం ముందు చిన్నపోతున్నట్టనిపించాయి.

***

“రండి నాన్నగారు దీపం వెలిగిద్దురుకాని.... ”మరోమారు పిలిచింది లత.
ముకుందం గది తలుపు తోసి చీకటిలో ఏమికనబడక కిటికీ తీయబోయింది.
“ఆగు..ఏం చేస్తున్నావ్ ...ఎన్ని సార్లు చెప్పాలి కిటికీలు తెరవద్దని.ఒకసారి చెప్తే అర్థంకాదా.రోజు చెప్పాలా.. ” విసురుగా అన్నతండ్రి మాటలకు క్షణంపాటు చివుక్కుమనిపించినా అంతలోనే మనసుకు సర్ది చెప్పుకుని,
“సారీ నాన్నగారు..పాయసం తయారయింది. మీరు వచ్చిదీపం వెలిగిస్తారు,ఈరోజైనా చీకటినుండి బయటకు వస్తారని ఆశపడ్డాను. నా ఆశ అడియాసే.”దుఃఖంతో లత గొంతు పూడుకుపోతోంది.
“నువ్వెందుకు అమ్మలు సారీ చెప్పడం నేనే చెప్పాలి .మీ అమ్మ నన్ను విడిచివెళ్లింది మొదలు నేను ఈ చీకటికి అలవాటు పడిపోయాను.ఏమో, వెలుగును మాత్రం భరించలేకపోతున్నాను. అమ్మలు,అమ్మకు నువ్వే దీపం వెలిగించి నైవేద్యం పెట్టు” సరే నాన్నగారు.”అంటూ కళ్లలో నీరు తండ్రికి కనపడకుండా తలుపు మూసి బయటకు వచ్చాక గట్టిగా వత్తుకుంది. ‘ఇలాంటివి ఎన్ని సందర్భాలో!కన్నీటి జలపాతానికి ఆనకట్ట ఎలా వేయాలో తెలియక తండ్రికి కనబడకుండా దుఃఖాన్ని బోర్లించేది. తల్లిని తలచుకుని ఆవేదనతో తల్లడిల్లిపోయేది.తల్లి మరణం ఎంత బాధాకరమో,ఆ అనుభవంలోని చేదును మ్రింగలేక పోతోంది,తన పెళ్లి చూసింది.అంతే....అంతదాకా పొంచివున్న జబ్బు మరిక ఆగలేనంటూ తల్లిపై దాడి చేసి కబళించింది.దేవుడిని రోజూ వేడుకునేది అమ్మను తీసికెళ్లిపోకు భగవంతుడా,అమ్మ నాపిల్లలను చూడాలి,వారితో మాట్లాడాలి,కమ్మని కథలు చెప్పాలి.వారి ముద్దు మాటలు అమ్మ వినాలి. ’లత నోటివెంట ఎన్ని నివేదనలో!
కాని లత మాటలెందుకో దేవుడు వినలేదు.తల్లిపోయాక దిక్కుతోచని పక్షిపిల్లలా వణికిపోయింది లత.తండ్రి ఉన్నాడు మీకేం ఫరవాలేదు అన్న చుట్టపక్కాల మాటలతో ధైర్యాన్ని కూడదీసుకోసాగింది.అయితే లత అనుకున్నట్లుకాక తండ్రి పరిస్థితి చూసాక లతలో ఏదో తెలియని భీతి బీజమేసి మొక్కగా ఎదగసాగింది.విడువలేక విడువలేక తండ్రిని వదలివెళ్తూ తనతో వచ్చేయమని చివరిసారిగా మరోమారు బ్రతిమాలింది.తల్లి బ్రతికివున్నప్పుడు ఉన్న ఇల్లును వదలి రాలేనని, మరోమారు బలవంతపెట్టి ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసాడు ముకుందం.తండ్రి మాటలలోని నిస్సహాయత,తల్లి నడయాడిన చోటనే వుండాలనుకున్న ఆరాధనా భావాన్ని గమనించిన లత మరిక తండ్రిని ఇబ్బంది పెట్టకూడదనుకుంది.కాని అలాంటి పరిస్థితిలో తండ్రిని వదలలేక వదిలివెళ్లింది.ప్రతిరోజు తండ్రిని పలకరించేది.కాని రానురాను తండ్రి బదులు వంటచేసిపెట్టే కుర్రాడు రాంబాబు మాట్లాడేవాడు.అయ్యగారు సరిగా భోంచేయడం లేదని,ఇష్టముంటే స్నానం,లేకపోతే అదీ లేదని,గది వదలి బయటకురారని,చీకట్లోనే కూర్చున్నారని లైటు వేయబోతే కొట్టినంత పని చేసారని.
ఇలా వింటున్న లతలో మొక్కగా ఎదుగుతున్నభీతి మానుగా మారసాగింది. తల్లిని పోగొట్టుకున్న దురదృష్టం.ఇక తండ్రిని కూడా పోగొట్టుకోలేదు. నాన్న నోటి వెంట అమ్మ జ్ఞాపకాల అనుభూతులు వినాలి,అమ్మతో తమ బాల్యపు ఊసులను నాన్నకు వినిపించాలి. అమ్మను జ్ఞాపకాలలో బ్రతికించుకోవాలి.కాని ఇప్పుడు నాన్నను నిజంగానే బ్రతికించుకోవాలి.అమ్మను పోగొట్టుకుని తల్లి ప్రేమకు దూరమయాం. ఇలాగే తండ్రి బాధతో కుచించుకుపోతుంటే ఇక నాన్నను కూడా పోగొట్టుకుంటామేమో. ధైర్యాన్ని తండ్రిని చూసే నేర్చుకుంది.డబ్బుకు ఇబ్బందైనా,మనసుకు కష్టమైనా తమకు చెప్పి,ఆ తరువాత నాన్న ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు తమను తలెత్తుకుని జీవించేలా చేసాయి తప్ప బెంబేలు పడింది ఎప్పుడు లేదు.అలాంటిది ఇప్పుడు ఇలా తనలో తనే ముడుచుకుపోతూ...అందుకే ఏదైనా చేయాలి.నాన్నను కాపాడుకోవాలి.అమ్మపై దుఃఖాన్ని మరిపించాలి. ఎలా?’
భర్తతో ఆలోచించింది లత.మంచి సైక్రియాట్రిస్ట్ కు చూపమన్న అతని సలహా కూడా ఓసారి ప్రయత్నిస్తే తప్పేముంది అనుకుంటూ తండ్రికి కూడా ముందే చెప్పకుండా వచ్చి డాక్టరు దగ్గరకు బలవంతంగా తీసుకెళ్లింది.అక్కడా ముకుందం సహకరించలేదు. ‘ తల్లి చనిపోయినప్పటి నుండి ఇదే బాధ.తల్లి మరణించి ఏడాది దాటింది.క్షణక్షణం గుర్తుకు వచ్చే తల్లిని మరవడం అసాధ్యమే.తల్లిని మరిపిస్తాడు తండ్రి అనుకుంటే,ఆయనే మరీ చిన్న పిల్లాడిలా బెంబేలెత్తిపోతున్నాడు.’ లత దేవుడికి మరోమారు తన వేదన నింపిన విజ్ఞాపనలు పంపుతూనే ఉంది. ‘తన పిల్లలను నాన్న చూడాలి.అవును నాన్నయినా చూడాలి.తన పిల్లల అల్లరి చూసి నాన్న కోపం మరచి నవ్వడం చూడాలి.బడికి బ్యాగు తగిలించుకుని వెళ్తుంటే వారివెంట వస్తాననే తాతయ్యను వారించి తుర్రుమనే తనపిల్లలను చూసి సాయంత్రం రండిరా మీ పని చెపుతాను అని ప్రేమగా గుర్రుమనే నాన్నను చూడాలి.ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగాలంటే నాన్న ఉండాలి.’
ముకుందానికున్న ఒక్కకొడుకు అమెరికాలో ఉద్యోగం వదిలి రాలేకపోతున్నాడు.కోడలు రానివ్వడంలేదేమోనని అందరు అనేమాట. కాని మాంద్యం ప్రభావానికి కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో అమెరికా వదలి వస్తే ఇక అంతే సంగతులేమో అనే భయాలు వున్నాయి కొందరికి.
పాయసం గ్లాసునిండా పోసి తెచ్చి ఇచ్చింది లత




పాత జ్ఞాపకాలు ఎన్ని తడిమాయో కళ్లు నీటి చెలమలయి అంతవరకు కనబడుతున్న చీకటిని కూడా చూడకుండా చేసాయి ముకుందాన్ని. పాయసం రుచిని ఆస్వాదించే స్థితిలోలేడు ముకుందం. అందుకే గొంతుకడ్డంపడ్డ బాధను దాటుకుని వెళ్లడం పాయసానికి సాధ్యం కావడంలేదు.
ఆ రాత్రి అన్నయ్య దగ్గరనుండి ఫోనందుకున్న లత ఫోనులోనే బావురుమంది
“.ఇలాగైతే త్వరలోనే నాన్నగారిని పోగొట్టుకుంటామేమోనని భయంగా వుంది అన్నయ్యా” అంది వెక్కి వెక్కి ఏడుస్తూ.
బాధపడుతున్న లతకు అన్నయ్య చెప్పిన మాటలు పచ్చి గాయంపై చల్లని లేపనంలా తోచాయి. త్వరలోనే తాను ఇండియా వస్తున్నట్టు, ఆ ఇంటి వారసుడు ఆకాష్ పుట్టినరోజుకు తామందరు అక్కడికి చేరుకుంటున్నట్లు చెప్పిన వార్త లతకు తాను మోస్తున్న భారాన్ని ఎవరో ఆప్యాయంగా అందుకుని దించి తనకు బరువు తగ్గించినట్టనిపించింది.ఆ కబురు తండ్రికి కూడా చెప్తామనుకుంది.కాని రాత్రి,పగలుకు తేడా తెలుసుకోవాలన్న ఆసక్తి ఏమాత్రం చూపకుండా మనిషి ఎప్పుడు కళ్లు మూసుకునే ఉంటాడు.బాధ మరచి కాసేపు పడుకున్నాడేమోనని లత మరిక లేపకుండా పడుకుని కళ్లు మూసుకుంది. అన్న ఇచ్చిన హామీతో చాలరోజులకు లత నిద్రను మనసారా ఆహ్వానించింది.తల్లి తలపులు,నాన్నపై వేదనకు తాత్కాలిక విరామమిస్తూ నిద్రాదేవి లతను తల్లిలా హత్తుకుంది. “నాన్నగారూ అన్నయ్య వస్తున్నాడు. ” తండ్రి ఎప్పుడు లేస్తాడా ఎంత త్వరగా ఈ వార్త అందిద్దామా అని త్వరగానే లేచిన లత తండ్రి అప్పటికే లేచి భార్య ఫోటోను తడుముకుంటూ నిట్టూర్చడం చూసి బిత్తరపోయింది.ఈయన అసలు నిద్రపోతున్నాడా అన్న సందేహం కలిగింది
“నాన్నగారు.. ”
“చెప్పు అమ్మలు...ఈ వేళేమైనా బయలు దేరుతావా,నీదేమో కొత్త సంసారం.నా కోసం
అల్లుడికి ఇబ్బందికలిగిస్తూ ఎన్నాళ్లుంటావు. ”
“అది సరే నాన్నగారు,ఈ మాట వినండి, అన్నయ్య వస్తున్నాడు. ”
“ఏం చేస్తాడు వచ్చి నాలుగు రోజులు నీలాగే నన్ను హైరాన పెట్టేస్తాడు ఆ డాక్టరు,ఈ మందులు అంటూ.నా తంటాలేవో నేను పడతాను మీరు కూడా ఎందుకు శ్రమపడటం? ” “కాదునాన్నా,బంటి పుట్టినరోజు ఇక్కడే చేస్తాడంట.అందుకే వదిన,బంటి కూడా వస్తున్నారు.’’
“ఎప్పుడట వాడి పుట్టిన రోజు?’’ ఎప్పుడోలే అనుకుంటూ అడిగాడు ముకుందం.
“వచ్చే ఆదివారమే కదా నాన్నా.... ”
“వచ్చే ఆదివారమంటే... ముకుందం హృదయంలో ఏదో తెలియని పొటమరింత,ఉద్విగ్నత!
ఆ గోడ మీద క్యాలెండరుండాలి చూడు. ”
లత ఏ గోడమీద క్యాలెండరుందో అని గోడలను పరికించి చూస్తూ చేత్తో తడుముతోంది. “ఏమిటి ఆ వెతుకులాట ఆలైటు వేస్తేకదా కనబడేది. ”
తండ్రేనా లైటు వెయ్యమంటున్నాడు తన తొట్రుపాటు కనబడకుండా లైటువేసి క్యాలెండరు తీసి చూడసాగింది లత.
ఇవేవి గమనించడంలేదు ముకుందం.కాంతికి అలవాటు తప్పిన కళ్లను చికిలించి చూస్తూ “అరె ఇప్పుడా చెప్పేది,సరిగ్గా బయలు దేరకముందు.మనమేం చేయాలి?ఎవరిని పిలవాలి? ”
కొడుకు స్నేహితులయితే ఒక ఐదారుగురు తప్పించి చాలామంది అమెరికా లేదంటే బెంగళూరు.ఇక మిగిలిన వారు అమ్మలు స్నేహితులు, తన కొలీగ్స్.దాదాపు ఏడాది దాటింది అందరిని పలకరించి.ఎవరెవరు ఎక్కడెక్కడ వున్నారో...ఎలా....ఆ చలపతినడగాలి.వాడినందరు అడ్రస్ బుక్ అనేవారు.ల్యాండ్ లైన్ నంబర్లు,సెల్ నంబర్లు.ఇ-మెయిల్ ఐ.డి అన్నీ సేకరించి వుంచుతాడు.”
“అమ్మలు నీ స్నేహితులందరిని పిలువు. నీకు కూడా అందరిని కలిసినట్లుంటుంది.అలాగే చలపతి అంకుల్ కి ఫోను చెయ్యి,నేను రమ్మన్నానని చెప్పు.డాక్టరు గారికి కూడా కాల్ చెయ్యి,మరచిపోకు ఆయన మనవాడిని అదే నా మనవడిని చూడాలి.”



వాడి సైకాలజీ ఏమిటో ఆయననడిగి కనుక్కోవాలి. ”తండ్రి ముఖంలో ఏదో చిన్న వెలుగు తొంగి చూసినట్లనిపించింది లతకు. ఆ వెలుగును ఆరనీకుండా మరింత పెంచాలి.
లత వెతుకుతున్న టెలిఫోను డైరక్టరీ దొరకడం ఆలస్యమయేకొద్దీ అసహనం పెరిగి పోసాగింది ముకుందంలో.
“ఎంతసేపు వెతుకుతావు?చిన్నప్పుడు ఇలాగే వెతికేదానివి పెన్సిలు పోతే!నేను చూస్తానుండు.ఆ... ఇదిగో ఇక్కడుందిగా” తన ఫైళ్ల మధ్యన ఉన్న డైరీని దుమ్ము దులిపి వెంటనే ఫోనందుకున్నాడు.
ముకుందం గొంతు విన్న చలపతికి ఒక్క క్షణం తాను వింటున్నది ముకుందం గొంతేనా అన్న అనుమానము కలిగింది. అయితే ముకుందం కూతురు ఆ తరువాత మాట్లాడి సందేహాన్ని తీర్చింది. “ మీరొక్కసారి రావాలి అంకుల్.నాన్నకు తన స్నేహితుల ఫోను నంబర్లు కావాలట.అందరిని కలవాలంటున్నాడు. ”
లత మాటలు చలపతికి అమృతాన్ని అదిమిపట్టి త్రాగించినట్టుంది. ‘ ఏడాదిగా అడపాదడపా కలుసుకుంటున్నాచీకటి ముసుగును తొలగించలేక ముకుందాన్ని విసుక్కున్న సందర్భాలు ఉన్నాయి. అన్నింటికి ఒకటే సమాధానం.వెలుగును భరించలేనని.అప్పటికీ భార్యను పోగొట్టుకున్న ఎందరో భర్తలగురించి,భర్తను పోగొట్టుకున్నఎందరో భార్యలగురించి చెప్పాడు.అన్నీ విన్నాక ఎలా బ్రతుకుతున్నారో అని తన బాధకు వారి బాధను కలుపుకుని ఏడ్చేసేవాడు.నీలా చీకటిలో లేరు వాళ్లు అంటే,అది నీకు కనబడదు వారి గుండెనిండా చీకటి వుంటుంది.ఆ చీకటి తెరతొలగదు.అది తొలగాలంటే బాహ్యంగా మనం అంతమైపోవాలి అనేవాడు.ఇక ఇలా మాట్లాడుతూ ఏదైనా అఘాయిత్యం చేస్తాడేమోనని,ఆ పిల్లలకు తండ్రినికూడా దూరం చేసినట్టవుతుందని తనే సంభాషణ తుంచేసేవాడు.మళ్లీ తన చీకటిలోకంలో తలుపులు బిడాయించుకుని మనది కాని మరోలోకంలోకి ఆలోచనలతో ప్రయాణం చేసేవాడు.అలాంటిది ఈ వేళ తనే రమ్మంటున్నాడంటే,ఏదో విశేషమే’ అనుకుంటూ,
కాఫీ తాగడం ఆలస్యం ముకుందం ఇంటివైపుకు వాహనాన్ని పరుగులుతీయించాడు.
చలపతి రాకకోసమే కాచుకున్నట్లున్నాడు ముకుందం.
“అమ్మలు, చలపతి అంకుల్ వచ్చారు, చూడు కాఫీ,టిఫిను ఏర్పాట్లు,అలాగే ఆ నంబర్లన్నీ రాసుకో ఈ లోగా నేను స్నానంచేసివస్తాను. ”
తండ్రి స్నానానికి వెళ్లగానే అంకుల్ అంటూ అణచివున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది లత.
“నువ్విప్పుడు ఏడ్చాల్సిన సమయంకాదు,మీ నాన్నఅణగారిపోయిన శక్తులు పుంజుకుంటున్నాడు. అసలు మేమెప్పుడైనా దేనికైనా వెనకముందులాడితే మమ్మల్ని మార్గదర్శిలా మరీ ముందుకు నడిపించేవాడు. మీ నాన్నలో మార్పు వస్తోంది ఎందుకో,ఎలా అన్నది నీకర్థమయే వుంటుంది.మరిక ఏడవకు. ”
“నేను ఆనందంతో ఏడుస్తున్నాను అంకుల్. నా మేనల్లుడు అమెరికానుండి వచ్చి తాతగారింట పుట్టినరోజు జరుపుకుంటాడన్న వార్తతో నాన్నలో చలనాన్ని చూస్తున్నాను.తన స్నేహితులనందరిని పిలవాలంటున్నారు.మీరు కొంచెం ఆ పని చూడండి అంకుల్ ,నేను పార్టీ ఏర్పాట్లు చూస్తాను. ”కళ్లు తుడుచుకుంది లత తండ్రివస్తున్న అలికిడి విని.షేవింగ్ కూడా మానేసిన నాన్న ఇలా శుభ్రంగా అన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికి లత తన మొర ఈ సారి ఆలకించాడు అనుకుని మనస్సులోనే దేవుడికి నమస్కరించుకుంది.
“అరె..ఏమిటి ఇంకా నంబర్లు రాసుకోలేదా,సరే టిఫిన్లు కానిచ్చేసి ఒకేసారి ఫోన్ చేసి పిలుస్తాలే.” అంటూ రాంబాబందించిన ఉప్మా ప్లేటందుకుని గబగబా తినసాగిన తండ్రిని కన్నుల నిండుగా చూడసాగింది లత.
“అలా చూస్తూ నిలబడితే ఎలా అమ్మలు మంచినీళ్లు తెప్పించవా? ”
తండ్రి మాటతో సర్దుకుని మంచి నీళ్లు తెచ్చిఇచ్చింది.
***

పిలవాల్సిన స్నేహితుల లిస్టు పెద్దదే,మళ్లీ మనలో పడుతున్నాడు,వెళ్లి చూడాలి అనుకుని, పిలిచిన వారందరు హాజరు వేసుకున్నారు.అలాగే లత నేస్తాలు లతను చూసి చాలా రోజులయింది, పిచ్చిపిల్ల తల్లిని కోల్పోయి ఎలా వుందో పలకరించాలని కొందరు వచ్చారు.మొత్తానికి చాలా సందడిగా ఉంది.అందరి నడుమ సూటు,కోటు,దానికి తగిన టై,బూటు! ఆకర్షించగల రూపురేఖలు! బహుమతులతోపాటు ఆప్యాయతల జల్లు కురుస్తోంది. పుట్టిన రోజు జరుపుకుంటున్న బంటి అందరికి చిరునవ్వుతో ‘హాయ్’ అంటూనే నమస్కారాలు పెడుతున్నాడు.
“ఏమోయ్ మనవడి పెళ్లిలా జరిపిస్తున్నావు పుట్టినరోజు! ”స్నేహితుల జోకులకు చాలా రోజులకు కళ్లెగరేసి నవ్వాడు ముకుందం.
“డాక్టరు గారు వీడి సైకాలజీ చెప్పండి వీడు ఇక్కడమ్మాయినా,అక్కడమ్మాయినా పెళ్లి చేసుకునేది? ” ముకుందం ప్రశ్నకు డాక్టర్ నవ్వుతూ,
“ఎక్కడమ్మాయైనా పెళ్లి మాత్రం మీ ముందరే చేసుకుంటాడు.అది మాత్రం గ్యారంటీ.’’అనగానే నవ్వుల గలగలలు విరిసాయి.
“ఫో తాతయ్యా!ఐ వోంట్ మ్యారీ!’’ అని సిగ్గుగా లోపలికి పారిపోబోయాడు బంటి.
పారిపోబోతున్న మనవడిని పొదివి పట్టుకుని, “నేనెక్కడికి పోతానురా?నీ పెళ్లి చూడందే పోనుగాక పోను.’’ దృఢంగా పలుకుతున్న తండ్రిని చూచి మనసులోనుండి కొండంత బరువు దింపిన ఏడుకొండలవాడికి నమస్సులర్పిస్తూ,‘ఇక ఫరవాలేదు నాన్న చీకటిని మరచిపోతాడు.స్నేహితులందరిని కలిసాక వచ్చిన ధైర్యం ఇక వెనుకకు పోదు.
‘మళ్లీ మళ్లీ వస్తుండండి’ అని స్నేహితులకు వీడ్కోలు పలికి,బంటి బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకున్నాడు ముకుందం. తండ్రి ముఖంలో గ్రహణం తొలగినట్లు చంద్రకాంతి చిన్నగా ప్రవేశిస్తుండటం చూసి నాన్నఇక తట్టుకుని నిలదొక్కుకోగలడు,ధైర్యంగా ఉండగలడు. ఉండాలి.మాకు మా నాన్నఉండాలి.’ లత కళ్లు దుఃఖం,ఆనందం కలగలిసిన తడితో తండ్రిని ఆప్యాయంగా చూస్తున్నాయి.

**********

Sunday, January 8, 2012

అక్షరలక్ష్యం

8 comments

అక్షరమంటే అఆలు,కఖలేనని అనుకున్నా!
అక్షరాభ్యాసంతో అక్షరజ్ఞానం వస్తుందనుకున్నా
సాహిత్యాక్షరాలు మనసుపై దాడిచేసాకే
తెలిసింది అక్షరలక్ష్యమేమిటో!

ఆవేశానికి ఆజ్యంపోసి
ప్రశ్నిండం నేర్పే వేదాక్షరాలు
పరవశింపచేసే కవి కోయిలల కుహూరవాలు.

కలతచెందిన మనసుకు
అక్షరమేకదా వైద్యం!

అక్షరాలు వెన్నముద్దలా
లేపనమేకాదు
కొరడాలై ఝళిపిస్తాయి
శతఘ్నులై గర్జిస్తాయి
చలిచీమలై చురుక్కుమనిపిస్తాయి.

ఆలోచనా నెగళ్లలో
నిప్పురవ్వలు అక్షరాలు
ఉద్యమాలకు ఊపిరిపోస్తాయి
పరిశోధనలకు ప్రాణమిస్తాయి

పడకకే పరిమితమైనా
గుండె చెమ్మగిలితే చాలు
అక్షరాలు ఆవిర్భవిస్తాయి

అల్లుకున్న అక్షరాల గారడీలో
ప్రతి అక్షరం ఒక సైనికుడేనని
బారులు తీరిన అక్షరసేన
కలంసాయంతో కవాతు చేస్తుందని

మనసున మొలచే అక్షరబీజాలు
కాగితంపై అక్షరనాట్లయి
అక్షరక్షేత్రం పండేదాకా
అక్షరం నన్ను నిద్రపోనివ్వదు

అక్షరం నా ఊపిరి
నన్నుఊపిరాడనివ్వదు.

Saturday, January 7, 2012

చామంతీ ఏమిటే ఈ వింత?

11 comments
చామంతనాలు
మా ఇంట చామంతులు













మా పంట చామంతులు.




Sunday, January 1, 2012

2012 !!!

11 comments

ఆశ్చర్యం!ఇక బ్లాగులోకి రాలేను అనుకున్న నన్ను తనతోపాటు నడిపించిన 2012 సంవత్సరాన్ని చూచి ఆశ్చర్యం!
బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.