Friday, February 17, 2012

కథల అత్తయ్యగారు



సాక్షి ఫన్ డే లో గత సంవత్సరం నేను రాసిన సమీక్ష.

కథాలోకానికి ఆత్మీయవ్యక్తి నిడదవోలు మాలతిగారు.తన బ్లాగు తూలిక ద్వారా అంతర్జాలంలో చిరపరిచితురాలు.

ఇరవైమూడు కథలున్న ఈ సంపుటంలో కథలలోని వైవిధ్యం, కథనాన్ని ఒడుపుగా చెప్పగల నేర్పరితనం కథలను విడవకుండా చదివింప చేస్తాయి.
కథావస్తువులన్నీ వాస్తవసంఘటనలేనని రచయిత్రే ముందుమాటలో చెప్పడం జరిగింది.అయితే ఈ సంఘటనలకు తగినపాత్రలను సృష్టించి,కల్పనను కేవలం కాటుకచందాన ఉపయోగించడం వలన కథలన్నీ రసాత్మకంగా ఆవిష్కరింపబడ్డాయి.
కథావిర్భానికి ఆలోచనే హేతువు.మరి ఆలోచనకు అనుభవాలే వేదిక.రచయిత్రి కథనంలో అనుభవాలను వల్లెవేసినట్లుకాక కథాశిల్పానికి చక్కటి నగిషీలు చెక్కారు.సమతూకంలో అమరిన పాత్రల మేళవింపు,హాస్యపు తాళింపు పఠనాసక్తిని పెంచుతాయి.కథలు మొదట మౌఖికం.అమ్మమ్మ,నానమ్మ లేదా అత్తయ్యలు చెప్పే కథలు పిల్లలలో కథానురక్తిని కలిగిస్తాయి.ఈ అనురక్తే కథల అత్తయ్యగారు సంపుటానికి మూలమనవచ్చు.తన బాల్యాన్ని అత్తయ్య ముంగిట్లో పరచి కథలేరుకున్న మాలతిగారికి కథాబీజం అక్కడే అంకురించినట్లుంది.
1950వనాటి జ్ఞాపకమే జేబు కథ. ఆ రోజులలో చదువుకునే ఆడపిల్లల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు.జామెట్రీ బాక్సు క్రిందపడి చేసిన శబ్దానికి పరిమళ,మాస్టారి ఆగ్రహానికి గురవుతుంది.ఆ బాక్సును తీసుకురావద్దన్నందుకు పెన్సిలు,రబ్బరు వుంచడానికి తల్లితో పోరి మరీ జాకెట్టుకు జేబును కుట్టించుకుంటుంది.ఈమాట.కాంలో ప్రచురించబడిన ఈ కథలో హాస్యరసం ప్రత్యక్షంగా కనపడదు.అయితే మనం దృశ్యీకరించుకుంటూ చదివినపుడు నవ్వులు పూస్తాయి.
పిల్లలను పెంచడంలో ఒకొక్కరిది ఒక పంథా.ఆడ,మగ తేడాల్లేని పెంపకం నేటితరానిది.పెంపకంలో వైవిధ్యం అమ్మాయిని ధైర్యశాలిగా,అబ్బాయిని భీరువుగా చెయ్యవచ్చు.అయితే అదే ఉపద్రవం అనుకుంటూ బాధపడ్డ ప్రదీపు కొడుకును బలవంతంగా సముద్రంలోకి తీసుకెళతాడు.అయితే పిల్లల పెంపకానికి సిద్ధాంతీకరణకాక సమయస్ఫూర్తి కావాలన్న సూక్ష్మాన్ని పార్వతి పాత్ర ద్వారా చెప్పించడం పెంపకం కథ ముగింపుకు నిండుదనాన్నందించింది.
అమెరికాలో మంచువర్షం ఆహ్లాదమే కాని అజాగ్రత్తగా కాలు మోపితే ప్రమాదంలోకి తోస్తుంది అనే హెచ్చరిక అయ్యో ఒక్కరైనా చెప్పలేదే అనే కథద్వారా అందరికి చెప్పారు.

అక్షరం పరమపదం ఆకట్టుకునే కథ. చక్కటి మాండలికం చదువరిని విశాఖతీరాస కూచోబెడుతుంది.అక్షరజ్ఞానంలేని సంద్రాలు సూక్తిముక్తావళిని ఔపోసన పట్టినట్లు తన వాగ్ధారతో అబ్బురపరుస్తుంది. ఏటుండిపోతాదంటూ వేదాంతం వల్లించే సంద్రాలు నువ్వు మడిసి జలమమెత్తినందుకు నీకో దరమం ఉన్నది,అది నువ్వు చేసుకోవాల.అని చెప్పడం మనిషికి మార్గనిర్దేశనమే.

కథల అత్తయ్యగారిని తొలికథలో పరిచయంచేసి చివరికథ శివుడాజ్ఞలో ప్రత్యక్షంచేసి కథలకూర్పులో సమన్వయం చూపారు.చిన్ననాడు కథలు చెప్పిన అత్తయ్యను కలవాలన్న తపన,కలిసినపుడు తన్మయత్వం,కలవకపోతే బాధ.ఈ రెండు ముగింపుల కథ పాఠకుల ఊహాశక్తికి ప్రేరణ కలిగించే చక్కటి ప్రక్రియ. ధైర్యంగా మాట్లాడలేనివారిని నోట్లో నాలుక లేని వారంటాం.కాని అటువంటి వారికి కూడా పరిస్థితులనుబట్టి నాలుక మొలుస్తుంది.అదే వజ్రాయుధమవుతుంది అని చెప్తుంది పలుకు వజ్రపు తునక.ఆరాలు తీయడం సమాజ లక్షణమని,సమూహ నైజమని గుర్తించాలికాని ఉలిక్కి పడగూడదని చెప్పే మీరెవరి తాలూకు,హాలికులైననేమి వంటి చక్కటి కథలున్న ఈ సంపుటం నిస్సందేహంగా అగ్రస్థానంలోనే ఉంటుంది.
నిడదవోలు మాలతిగారి కథాసంఘటనలు ఎక్కడో ఒకచోట తారసపడేవే.జన్మస్థలాన్నివదలి మూడున్నర దశాబ్దాల క్రిందటే అమెరికాలో అడుగుపెట్టిన వ్యక్తి.వేరుమరచి కొత్తకొమ్మలు,రెమ్మలపై మనిషి ఊగుతున్న నేపథ్యంలో మూలాలు మరువక బాల్యపు ఊసులను,అమెరికా జీవనాన్నికథల అత్తయ్యగారు రూపేణా మనకందించడం ఎక్కడవున్నా మరువని తెలుగు భాషకు,
తెలుగుతనానికి కైమోడ్పు.చక్కని వరుసక్రమంలో,బాపు ముఖచిత్రంతో ఏర్చికూర్చిన విశాలాంధ్ర పబ్లిషర్స్ అభినందనీయులు.

సి.ఉమాదేవి
కథల అత్తయ్యగారు
రచయిత్రి-నిడదవోలు మాలతి
పేజీలు-160 వెల-70/-
ప్రతులకు-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

2 comments:

మాలా కుమార్ said...

మీపరిచయం చదువుతుంటే ఇప్పుడే పుస్తకం తెచ్చుకోవాలనిపిస్తోంది .
పుస్తక పరిచయం బాగుంది .

సి.ఉమాదేవి said...

ధన్యవాదాలు మాలాకుమార్ గారు,పుస్తకం చదవకముందే విశ్లేషణ మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు సంతోషం.

Post a Comment