ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురింపబడిన నా సమీక్ష.
మనసు గలగలలు వినిపించిన గాజునది
స్త్రీ బహురూపిణి. విభిన్న
పాత్రలను ఏకకాలంలో పోషించగలగడం ఆమెకున్న అసామాన్య శక్తి.అయితే తదనుగుణంగా స్త్రీ భావజాలం
కూడా త్రిడి ప్రింటర్ లోవలె ఏమూసలో కావాలంటే అలానే కావాలంటూ ముద్ర వేయడం
సబబనిపించుకోదు. శిలాలోలిత కలంపేరుగా లక్ష్మి రచించిన కవితా సంపుటి గాజునది.
స్త్రీ మనసును పారదర్శకం చేసే శీర్షిక గాజునది. శిలాలోలిత ఆలోచనా నెగడు
నిత్య జ్వలితం. అందుకే ఈ నిరంతర కవితా మెరుపులు.ఈ కవితా ఒరవడికి పేర్చబడ్డ కవితా శీర్షికలు స్త్రీల అసహాయతలకు, సమాజంలోని
అవాంఛనీయ పోకడలకు,మసిబారుతున్న మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనాలు.
గాజుబీకరులో బంధింపబడిన నీటి
చిత్రంలా కాక స్థిరీకృతమైన ఆకారాల్లో
జీవలక్షణాలను పుణికి పుచ్చకున్న భావజాలము కావాలని గాజునది లో చెప్పిన లోతైన
భావనాపటిమ కవితా వస్తువుపై శిలాలోలితకున్న పట్టు తెలుపుతుంది.తమదైన వ్యక్తిత్వంతో
కొత్త బాటను నిర్మించుకునే స్త్రీలు చేయి తిరిగిన శిల్పులే కదా!
గాజులగలగలలే కాదు గొంతుముడి
విప్పుకుని బయల్పడిన మాటల గలగలలు వినిపించిన గాజునది, రచయిత్రి నిశిత పరిశీలనా
శక్తిని,సామాజికాంశాల ఆసక్తిని స్ఫటికమై ప్రస్ఫుటింపచేస్తుంది.
జీవితంలో పైకెదిగి వృద్ధిలొకి
రావాల్సిన ఎందరి ఆశాసౌధాలనో బాంబు పేలుళ్లు కూల్చివేసాయి. తెగిపడ్డ సీతాకోక చిలుక
రెక్కలు కవిత చదివితే, మనసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతుంది.కాలమేఘాలు
కురిపించిన బాష్పగోళాలు గోకుల్ చాట్ పేలుళ్లు.వాటికి సశేషంగా మిగిలిన దుఃఖవీచికలు
ఇంకా మనసును తాకుతూనే ఉన్నాయి.
గాజుముక్కల వంతెన కవితలో
బ్రతుకు సమరాన్ని వర్ణిస్తూ గాజుముక్కలపై నడకేనని అనడం ఉపమానమే కాదు అమృతోపమానం.
నిజమే!ఆదమరచి నడిచామా గాజుముక్కలు కసుక్కున కాటేస్తాయి.
విరోధినామ సంవత్సరమైనా. వికృత నామ
వత్సరమైనా కాలం చెట్టుకు పూచిన కొత్త పువ్వులేనంటారు. ‘ కాలానికి కాళ్లు నొప్పి
పడినప్పుడల్లా ఓ క్షణమాగి కొత్త పేరుతో
నడుస్తుంటుంది’ అని చమత్కరించడం చిరునవ్వులు పూయిస్తుంది.కాలం పరచిన బాటలో
మీ కాలి బాట మీలోకే దారితీయాలని చెప్పడం
ఆత్మావలోకనమే.
మానవ హారం మరో చక్కటి కవిత.
మనిషిని మనిషిని కలిపి కుట్టేది మానవత్వం. ‘కలలెప్పుడు మానసిక ప్రపంచ కవాటాలే.
మనిషి గొంతు ముడి విప్పితే రాలేది మాటలే.అవే కలగలిసిన మానవత్వపు మూటలు’ అని చదివినప్పుడు బస్తాలలో
బంధింపబడిన మానవత్వాన్ని మూటలు విప్పి మానవాళిపై వెదజల్లాలనిపిస్తుంది.
కాంతి+కాంతి=చీకటి. చీకటి రేఖలపై కాంతిని ప్రసరించి స్త్రీ పురుష సమానత్వంలో
అహానికి వీడ్కోలు పలికితే బ్రతుకంతా వెన్నెల పుప్పొడే! మలినమైన మానవతా పరిమళం
మనిషితనానికి వీడ్కోలు పలికితే ఆర్థిక సంబంధాలు అగాథాలు సృష్టిస్తాయి.అని కాంతిని
స్త్రీ,పురుషులకు సంకేతపదాలుగా వర్ణించారు.
చలన సూత్రాలు.చదివితే కళ్లలో
అకాల వర్షమే! దేహాలు వదిలి వెళ్లినా వాళ్లు విదిల్చిన అక్షరాలు ఊతకర్రయి అక్షరపూలను శాశ్వతం చేసాయనడం, ఎందరో
సాహితీవేత్తలు కురిపించిన అక్షరాలకు
మోకరిల్లాలనిపిస్తుంది.
రోబో కవితలో, ‘ ప్రాణమున్న రోబోలం మనం.మనకై
మనం నవ్వం,మాటలాడం.కరుణించం, కలసిరాం. మననుంచి
ఎప్పుడో జారిపడిపోయిన పాదరసం బొట్టు మన మనసు’ అంటారు.అందుకే ఆ పాదరసపు బొట్టుకు పునఃప్రతిష్ట జరగాలంటారు.నిజమే! అమానుషత్వమే
తనువంతా ఆమ్లధారలా తడుపుతున్నవేళ మనసును తిరిగి ప్రతిష్టించుకోవాల్సిందే..
ఉత్తరం ఉరిపోసుకుంది.ఇది
అక్షర సత్యం. ‘ మనిషి మాటలు ఔట్ డేటెడ్. స్పర్శను,స్వరాన్ని కోల్పోతూ
అక్షరాలు చాటింగులు,సొరుగులు,గోడలు,ముఖ పుస్తకాలే ఇక మనకు మిగిలింది ’ అన్నా, మానవ పరిమళం
మనిషితనమొక్కటే అని చెప్పినా,ప్లాస్టిక్ పర్యావరణానికి
ముప్పని చెప్పడమైనా ఆమె దృష్టంతా మానవసమాజ శ్రేయస్సే!
0 comments:
Post a Comment