Sunday, December 29, 2013

చిత్రగ్రంథి

ఈ రోజు ఆదివారం ఆంధ్రప్రభలో చిత్రగ్రంథి కవితా సంపుటిపై నా సమీక్ష.


                     

       
                                                             కవితారసాలూరిన చిత్రగ్రంథి

 సుధామ జగమెరిగిన కవి,రచయిత, విశ్రాంత ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి. సాహితీప్రక్రియలన్నిటిలోను ప్రవేశమున్నప్పటికీ కవితాసరిగమల ఆలాపనకే పెద్దపీటవేసి ఆంధ్రప్రభ దినపత్రికలో కవికాలమ్ నిర్వహించిన ఈ కవి కలం కవితాసుధాభరితమై ప్రశంసలనందుకుంది. సాహితీబాటలో కవిగా,రచయితగా, బహుపాత్రధారియైన సుధామ మనముందుకు తెచ్చిన చిత్రగ్రంథి కవితా సంకలనం వస్తువైవిధ్యంతో అలరిస్తుంది.
ఇక చిత్రగ్రంథిలోకి ప్రవేశిద్దాం.తొలికవితకు శీర్షికే కవి(త) ప్రవేశం .
కలుషితమవుతున్న పర్యావరణం మనిషిని ప్రకృతికి దూరం చేస్తోంది.
నీటిని గాలిని ధ్వనిని
క్షరముకాని అక్షరంగా సహజసిద్ధంగా
స్వచ్ఛంగా నిలుపుకుంటే చాలు
మహిని,మనిషిని కూడా రక్షించుకున్నట్లే. అంటూ పర్యావరణాన్ని రక్షించుకోవాలనే స్పృహను కలిగిస్తారు.
భూత,వర్తమాన,భవిష్యత్కాలాలను సమన్వయపరచుకోవడమెలాగో స్వగతం-స్వాగతం కవిత మనకు వినిపిస్తుంది.
గతాన్ని వర్తమాన కవ్వంతో చిలికి  భవిష్యత్తు మీగడను పైకి తేల్చడమే ముఖ్యం అనడం కవి దార్శనికత మూడు కాలాలకు విస్తరించడమే.
జీవితంపై ఆశ ఉద్దీపన కావాలి కాని అంతం కాకూడదు.
జీవితేచ్ఛ  కవితలో ఆశలు నిర్మించేవాళ్లు గోడలను కొలుస్తారంటారు. అవరోధాల గోడలనధిగమించాలి. మృత్యుశ్వాసనధిగమించి జీవితేచ్ఛ పరిమళించాలి.బ్రతుకుపై నిరాశకు వీడ్కోలు పలికే కవిత.
అగ్నినగ్నీకరం  కవిత భగ్గుమనే హృదయావేదనను ప్రతిఫలిస్తుంది. నగిషీకరించడంకాదు నగ్నీకరించినపుడు అది అగ్నీకరణమన్న కవి భావుకత కవితావేశాన్నందిస్తుంది.
మనిషి మానుషాన్ని మటుమాయం చేస్తున్నాడు. మానవ ప్రకృతిని మానవుడు ధరించేలా చెయ్యి.జీవనగీతం రానివ్వమని కొత్త పల్లవి పాడుతారు.
ఉల్లితరిగినప్పుడు కన్నీళ్లులా ….పఠిత సజలనేత్ర కావాలి అనడం హృద్యంగా ఉంది.
విలువ శీర్షికన రాసిన కవిత అమూల్యమైనదే. మెట్లపై మనిషి జారి పోవడం కాదు,నేడు మెట్లే జారిపోతున్నాయి.
వినిమయ విపణి వీధిలో మనిషే వస్తువై, మారిన ప్రపంచానివే విలువలు కాని వ్యక్తిత్వ ప్రపంచానివి కావు అనడం ఈ కవికి మానవతా విలువలపైనున్న ఆర్తిని ప్రస్ఫుటింపచేస్తుంది.
చితిలోను చ్యుతిలేని వృద్ధాప్యం
బ్రతుక్కీ,మృత్యువుకి మధ్య చివరి జాప్యం.
చివరి జాప్యంలో మారుతున్న విలువలలో మనిషీ మారకద్రవ్యమే అని సూటిగా చెప్పడం గుండెలో నాటుకుని కళ్లను తడుపుతుంది.
ఆకాశవాణినుండి కవితావాణిదాకా సుధామ మీటిన మైలురాళ్లు సాహితీబాట లోని పథికులకు మార్గనిర్దేశనాలే అనడంలో అతిశయోక్తి లేదు.
ఏదో నాలుగు కవితలు రాసేసాం, కలం మూసేసాం అనుకోకుండా  విలక్షణత,వస్తువైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన కవితా పఠనం ఉత్సుకతను ఉద్దీపన కావిస్తుంది.చిత్రగ్రంథి  కవితా సంకలనం మనసును ఉరకలేయించడమేకాదు  అదుపు తప్పిన సమాజపోకడలకు  చురకలు వేస్తుంది.చిలికేకొద్ది చిక్కనైన కవిత్వం  తొంగి చూచిన ప్రతి పాఠకుడిపై చిలకరించిన చల్ల పలుకై పలకరిస్తుంది. ఆలోచన, అవగాహన, రమ్యతకు తగిన సమతుల్యత మాటల పటాటోపంకాక పదాల పల్లవింపులు సహజత్వానికి దగ్గర దారై మన దరిదాపులలోనే కవి నిలుచుని మనతో కవితా కబుర్లు చెప్తున్నట్లుంటుంది .మనసును హత్తుకున్న కవితేదయినా ఆ కవితాస్రష్టను కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది.


                                                                                                    






  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

0 comments:

Post a Comment