Sunday, February 5, 2012

నాన్న-నేను




గతసంవత్సరం సాక్షి ఫన్ డేలో నా సమీక్షావ్యాసం.



ఆలవోకగా అల్లబడిన అక్షర రేఖలు-నాన్న-నేను
బాల్యపు ఊసులు పదిలపరచబడిన జ్ఞాపికలు.ఈ జ్ఞాపికల సమాహారాన్ని మనముందు సాక్షాత్కరింపచేసిన బుజ్జాయిగారు అభినందనీయులు.సంఘటనల కమనీయమైన కలనేతలో పఠనానికి సమాంతరంగా పాఠకులు కూడా అల్లుకు పోతారు.నాన్న-నేను అని ఆప్యాయతను తలపించే శీర్షికతో నాన్న ఇష్టాలు, చిలిపి చేష్టలు వర్ణించి నవ్వులు పూయిస్తారు.అబద్ధపు కథలను నమ్మినట్టు నటించి చుట్టు ఉన్నవారికి హాస్యరసానందాన్ని పంచిన నాన్న చిలిపితనాన్ని మనసుతో తడుముతారు.
ఒక కథ రాసో,ఒక సినిమాలో నటించో సెలబ్రిటిలమైపోయామనుకునేవారికి బుజ్జాయి గారు,బాల్యము నుండి తండ్రితోపాటు తిరిగి మహామహులైన స్థానం నరసింహారావు,బెజవాడ గోపాలరెడ్డి,కాంచనమాల,విశ్వనాథ,బాపిరాజు వంటి దిగ్గజాలతో పంచుకున్న అనుభవాల అనుభూతులు అద్వితీయం.రవీంద్రుని పాదాల చెంత నాన్న తనను పడుకోబెట్టడం, నాన్న ఉపన్యాసాన్ని ఆపమని అరచినప్పుడు, బుజ్జాయిని బుజ్జగిస్తూ మరిక ఆ ప్రసంగం వినపడకుండా (వినబడితే ఆపమంటాడేమోననే భయంతో) శ్రీశ్రీ ఎత్తుకొని బిస్కెట్లు కొనిచ్చి, గంటసేపు ఆరుబయట తిప్పడం వంటి సంఘటనలు చదువుతుంటే ఆడంబర మెరుగని తేనెపలుకులు ధారగా కురిసి రసాలూరిస్తాయి. బుజ్జాయి వేసిన పెన్సిల్ స్కెచ్ బళ్లారి రాఘవ గారి ఇంట భద్రంగా వుండటం బుజ్జాయిగారి రేఖావిన్యాసానికి నజరానా!పసితనాన్నే రేఖలు దిద్దిన బుజ్జాయిగారు బడిన చదవకపోయినా కనబడిన వాల్ పోస్టర్ల ద్వారా అక్షరాలను గుర్తించి నేర్చుకోవడం ఒకింత విస్మయ మనిపిస్తుంది.బడిలో దొరకని ఎన్నో విలువైన అనుభవాలను, అనుభూతులను, సాహితీ సభలను తలపించే సాహితీ చర్చల నడుమ, సమావేశాలకు విచ్చేసే ఎందరో ఉద్దండుల సరసన తన చెయ్యివీడని తండ్రి ఒడిలోనే చదవగలిగారు.
సాహితీ గుబాళింపులు తండ్రికే వదిలి బొమ్మలు చెప్పే కమ్మని కథలను వేలికొసలనలవోకగా చిత్రించి బాలబాలికలనేకాదు,పెద్దలను కూడా మురిపించి,మైమరిపించిన బుజ్జాయి చిత్రాలు మన కళ్లను చిత్తరువులై నిలుపుతాయి.నాన్నపండించిన సాహితీ క్షేత్రాన్ని,తన చిత్రకళా క్షేత్రాన్ని సమాంతరంగా దర్శింపచేసుకున్న బుజ్జాయిగారు ప్రాజ్ఞులు. బాల్యంలో తెలిసీ తెలియని అల్లరితో నాన్నను దాదాపు నాలుగు మైళ్లు కారు దిగి నడిచేలా ఇబ్బంది పెట్టినా, కాలక్రమేణా తండ్రి అనారోగ్యానికి గురైనపుడు, ఆయనను పసిపాపడిలా చూసుకున్న వైనం మనసును కలచివేస్తుంది.అభిమానుల గౌరవాన్ని సమృద్ధిగా పొందిన క్రిష్ణశాస్త్రిగారి పలుకుబడి ఎన్నో సందర్భాలలో బుజ్జాయిగారికి శ్రీరామరక్షగా భాసిల్లింది.ఈ సంఘటనల సమాహారాన్ని చదువుతుంటే మన ఆత్మీయుడు మన దగ్గర కూర్చుని గుండెలో దాచుకున్న స్వానుభవాలను గుర్తుకు తెచ్చుకుంటూ అర్ద్రతగా చెప్తున్నట్టనిపిస్తుంది. దృశ్య కావ్యంగా గోచరించి మనసును అలరించే ఈ పుస్తకంగురించి ఇంకా ఏం చెప్పినా,ఎంత చెప్పినా సశేషమే!

సి.ఉమాదేవి
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

4 comments:

మాలా కుమార్ said...

మీ సమీక్ష బాగుందండి .

సి.ఉమాదేవి said...

థ్యాంక్యూ మాలా కుమార్ గారు.

మధురవాణి said...

బాగుందండీ మీ పుస్తక పరిచయం.. అయితే తప్పక చదవాల్సిన పుస్తకమన్నమాట.. :)

సి.ఉమాదేవి said...

ధన్యవాదాలు మధురవాణిగారు,వీలయితే తప్పక చదవండి.

Post a Comment