Showing posts with label పత్రికా ప్రచురణలు. Show all posts
Showing posts with label పత్రికా ప్రచురణలు. Show all posts
Saturday, September 27, 2014
Thursday, October 3, 2013
అనుబంధం కలకాలం నిలవాలంటే
3-10-13,ఆంధ్రభూమి దినపత్రికలో నా వ్యాసం.

పెళ్లంటే నూరేళ్లపంట! నిజమే, పెళ్లి
అనే పదం వధూవరుల హృదయాలను మీటే
స్వరజతి.అయితే పెళ్లి, వీరిరువురి మధ్యనే కాక రెండు కుటుంబాల నడుమ ఏర్పరచే బంధం
కూడా ఎన్నతగినదే. కోటి కోరికల నేపథ్యంలో తమ కాపురం మూడు పువ్వులు,ఆరుకాయలుగా
వర్ధిల్లాలని కోరుకుంటారు. పెళ్లికూతురు,పెళ్లికొడుకు పెళ్లిసూత్రాల మాటున ముడిబడ్డ తమ బంధం కడదాకా నిలవాలని
కాంక్షిస్తారు.అదేకదా దాంపత్యధర్మం. అయితే రోజులు గడిచేకొద్ది పెళ్లి సందడి తగ్గి
కాపురం హడావిడి మొదలవుతుంది.సంసారంలో అనుకున్నవి అన్నీ జరగకపోవచ్చు.కోరుకున్నవి జరగనప్పుడు సంసారం ప్రేమసుధాసారం అనుకున్నది కాస్త సారంలేని సంసారం
అనుకోవడం మొదలవుతుంది. ఈ సమయంలో సంయమనం కోల్పోకుండా ప్రవర్తిస్తే సంసార రథానికి
బ్రేకులు పడకుండా సాగిపోతుంది. కోరికలు తీరాలంటే కావలసినది ఆర్థిక వెసులుబాటు. ఒకొక్కసారి
డబ్బు ఉన్నా ఖర్చు చేయాలంటే కుదరని ఏకాభిప్రాయం. ఒకరు అవసరమనుకున్నది మరొకరికి
అనవసరమనిపిస్తుంది. అపార్థాలకు తెర లేచేది ఇక్కడే! అలాంటప్పుడు సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటే ఇల్లే
స్వర్గమవుతుంది.
డబ్బు: ప్రతి విషయం డబ్బుతో మొదలై డబ్బుతోనే
ముగిస్తే ఆ డబ్బే దంపతుల నడుమ అడ్డుగోడై నిలబడుతుంది.అప్పుడిక కలలుగన్న పంచరంగుల
స్వప్నాలన్నీ కరిగిపోయినట్లు అనిపిస్తుంది.దానికి కారణం నువ్వంటే నువ్వని వాదనలు
లేదా ఇరువురు ఒకరి తల్లిదండ్రులను మరొకరు విమర్శించకోవడం.ఒకరి ఆచార వ్యవహారాలు మరొకరికి
నచ్చకపోవడం! అమ్మాయి తెచ్చిన కట్నం చాలలేదని అబ్బాయి, ఆస్తిపరులు కాదని,అనుకున్నంత
పెద్ద ఉద్యోగం కాదని అమ్మాయి దెప్పిపొడుస్తుంటే మనసులు దూరమవుతాయి. పొరబడటం సహజమే.
అయితే అపోహపడి అపవాదులెయ్యడం దాంపత్య బంధాన్ని పుటుక్కున తెంపేస్తుంది. అడిగినంత
కట్నం ఇవ్వలేదనో, కోరిన కోరికలు తీర్చలేదనో అబ్బాయి కినుక వహిస్తూ, అబ్బాయికి ఆస్తి
లేదనో,సంపాదన తక్కువనో అమ్మాయి బాధ పడటంలాంటివి పెళ్లయాక లోపాలుగా కనబడటమే
ఆశ్చర్యమనిపిస్తుంది. అంతేకాదు అమ్మాయి చదువుకుని ఉద్యోగం చేస్తున్నా,ఆస్తి వెంట
తెచ్చినా అది తమ చేతిలో పడనంతవరకు అసంతృప్తే అయితే అది కయ్యానికే దారి తీసిన
వియ్యమవుతుంది.
నమ్మకం: ఇక దాంపత్యం బలిష్టమైనది కావాలంటే
నమ్మకమే గట్టి పునాది.ఈ పునాదిని అనుమానం పట్టి వూపిందా కాపురం కుప్పకూలడానికి గొయ్యి
పడ్డట్టే! భర్త డబ్బు విషయంలో లెక్కప్రకారం చెప్పడం లేదనో,ఎవరికైనా ఇస్తున్నాడేమోనని
భార్య ,తనకు తెలియకుండా భార్య ఏవేవో కొంటుందనో లేదా పుట్టింటి వారికి అంతో ఇంతో
చేరవేస్తుందని భర్తకు భ్రమ.ఈ అర్థంలేని అపనమ్మకాలు, అనుమానాలు దాంపత్యానికి
అగాథమవుతాయి.
ఇతరులజోక్యం: ఇదొక విచిత్రమైన విషయం. భార్యాభర్తలిరువురు తమ
సమస్యను తాము చర్చించుకుని పరిష్కరించుకోక వారి కుటుంబాల లేదా బంధువుల జోక్యాన్ని
ఆశిస్తే వారు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు.నిజమే కాని వారి సర్దుబాటు ఇరువురిలో
ఏ ఒక్కరికి సమ్మతం కానపుడు సమస్య చిలికి చిలికి గాలివానై అందులో సంసారబంధం
కొట్టుకుపోతుంది.
అభిప్రాయభేదాలు: ఇవి అనుబంధాన్ని కుదిపే వడగళ్లలాంటివి. పెళ్లి అనే ముడి
పడినంతమాత్రాన ఇద్దరిది ఏకాభిప్రాయమే అని నిర్ణయించలేం.ఆలోచనావిధానంలో తేడాలుంటాయి.అభిప్రాయాలలో
వైవిధ్యము తప్పదు. అయితే నాదే ఒప్పు,నీది తప్పు అని భీష్మించుకుంటే మాత్రం అది
అనుబంధం కాదు అంపశయ్యవుతుంది.
అనురాగలోపం: భర్తకు భార్యపై,భార్యకు
భర్తపై అనురాగం పల్లవించాలి. ప్రేమాభిమానాలు అంగడిలో కొనలేము.మనసున ఉన్న
అభిమానాన్ని మాటలతో ప్రకటించినా ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని మనగలగాలి. చిన్న బహుమతులు
ఇచ్చిపుచ్చుకోవడం కూడా మంచిదే.అయితే అంతకుమించి ప్రేమపూర్వక సంభాషణ ఉన్నచోట అనురాగం
మొలకలేసి దాంపత్యం విరితోటవుతుంది.
అవగాహన: ఒకరిమాట ఒకరు వినే వైనంలో
శ్రద్ధ చూపకపోతే మనసులు అర్థం కావు.అర్థంకాకపోవడానికి కారణం, వినపడనట్లు
ప్రవర్తించడం.వినిపించుకోకపోవడం నిర్లక్షధోరణిని ప్రస్ఫుటిస్తుంది. ఎప్పుడూ ఉండేవే
అని తాత్సారం చేస్తే మాట్లాడేవారి అభిమానం, దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిజంగా వినవలసిన,
ప్రాముఖ్యత ఉన్నవిషయాన్ని వినకపోతే చాలా కోల్పోవలసివస్తుంది.
సర్దుబాటులేనితనం: నువ్వెంత అంటే
నువ్వెంత అనుకుంటుంటే అది కాపురమవదు,కష్టాల కడలవుతుంది.
ఆ కడలిలోని అలల తాకిడిని
ఢీకొనలేక కాపురం కుదేలవుతుంది.ఒకరితో ఒకరికి సయోధ్య లేకపోతే సంసారరథం గాడి
తప్పుతుంది.
సంతానలేమి: పిల్లలు కలగడం.కలగకపోవడం
అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. నెపం ఇల్లాలిపై వేయడం ఎంత అమానుషమో కేవలం
పురుషుడినే వేలెత్తి చూపడము అవాంఛనీయమే.పిల్లలు పుట్టకపోయినా లేదా ఆడపిల్లలే పుట్టినా
తరచి చూడాల్సిన శాస్త్రీయ విషయాలను పక్కకు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు
చేసుకుంటూపోతే దాంపత్యంలో ప్రతి సంఘటన విడాకులకు బాట వేస్తుంది.
ఇగో(అహం): నువ్వా నేనా అని తారతమ్యాలు
లెక్కిస్తే అది దాంపత్య భాగస్వామ్యంకాదు.వ్యాపార భాగస్వామ్యం అవుతుంది. కలిసి చేసే వ్యాపారంలో సైతం
సర్దుకుపోయే తత్వముంటేనే ఆ వ్యాపారబంధం నిలబడేది. సంసారనౌక మునిగిపోరాదు అనుకుంటే
ఎక్కువ తక్కువలు కాదు, మనము అనే మాటకు విలువ నివ్వాలి.నీ దారి నీదే
నా దారి నాదే అనుకుంటే కుటుంబం తెగిన గాలిపటమవుతుంది.
అసంతృప్తి:
పెళ్లయిన చాలా రోజుల తర్వాత అందచందాలపై విమర్శలు ప్రారంభిస్తే మనసు మలినమవుతుంది. కళ్లు
తెరుచుకుని చూస్తూ చేసుకున్న పెళ్లిలో కనబడని లోపాలు ఆ తరువాతి కాలంలో కనబడ్డాయంటే
అది హాస్యాస్పదమే!
ఇవన్నీ పెళ్లి విఫలమయేందుకు దోహదపడే
విషగుళికల్లాంటివి.మరి అనుబంధం కలకాలం నిలవాలంటే ఓర్పు,నేర్పు కలగలసిన
సర్దుబాటుతనం, తరగని ప్రేమాభిమానం సమతూకమై నిలవాలి.అపుడిక సంసార రథం సాఫీగా సాగి
దాంపత్యం అనుబంధాలకు లోగిలవుతుంది.
Thursday, July 25, 2013
చేరువైనా,దూరమైనా మాటమహిమే!
నేటి ఆంధ్రభూమిలో(25-7-13) నా వ్యాసం.
సృష్టిలో మనిషికి మాత్రమే లభించిన వరం వాక్కు. మన మాటలో ఎంతగా విజ్ఞత పాటిస్తే అది మంత్రమై ఎదుటివారిని అంతగా అలరిస్తుంది. చిలకలకు, మైనాలకు మాటాలు నేర్పితే అవి మనం నేర్పిన మాటలనే పలుకుతాయి. అదే మనిషైతే సొంత ఆలోచనాశక్తితో భావాలను పంచుకుంటాడు. పసిపాపలను లాలించి, బుజ్జగించే మాటలు, ఎదిగిన పిల్లలను అనునయించే మాటలు, కష్టాల బారిన పడినవారిని ఓదార్చే మాటలు... ఇలా ఎన్నో రూపాలలో మాటే మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే, మాటలను వినియోగించేటప్పుడు పాటించాల్సిన కనీస మర్యాదల్ని విస్మరిస్తే- మాటలే తూటాలై పేలి అవతలి వ్యక్తి మనసును గాయపరుస్తాయి. కటువు మాటలు పాముకాటుకన్నా విషపూరితం. తప్పు చేసిన వారిని దండించే సందర్భంలో సౌమ్యత పాటిస్తే మళ్లీ ఆ తప్పు జరిగే అవకాశం ఉండదు. ఎపుడూ అరుస్తూ, కేకలు వేస్తూ కంకర రాళ్లలాంటి మాటలను ఇతరులపై ప్రయోగిస్తే మనసుల మధ్య దూరం కొలవలేనంతగా పెరిగిపోతుంది.
‘మీరొక మాట చెప్పండి.. పనవుతుంది..’ అని కొందరంటుంటారు. అది పెళ్లి సంబంధమైనా కావచ్చు. ఉద్యోగానికి సిఫారసు కావొచ్చు. కొంతమంది మాటకున్న విలువ అలాంటిది. కొంతమంది పెద్దలు అంతగా చదువుకోకపోయినా, సాహిత్యంపై పట్టులేకపోయినా అనుభవం నేర్పిన పాఠాలను తమ మాటలలో రసాత్మకంగా చెబుతుంటారు. అలాంటి వారి మాటలు భావితరాలు తమ జీవనగమనంలో పేర్చుకోవలసిన మైలురాళ్లని అర్థమవుతుంది. అలాగే, కొందరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. మరి కొందరు ప్రయోజనం లేని మాటలను ఊసుపోక చెబుతూ పదే పదే వల్లె వేస్తుంటారు. పరుగులు తీసే కాలానికి ఇలాంటి మాటలు ‘స్పీడ్ బ్రేకర్లే’. కాలం విలువ తెలిసిన వారు మాత్రం ఇలా వృథా మాటలతో కాలక్షేపం చేయరు. మాటతీరుతో ఎవరి ము ఖభావాలను గానీ, వారి మనసులో ఏముందో గానీ కొంతవరకూ చెప్పవచ్చు. కానీ, ఇది ఎల్లవేళలా సాధ్యం కాదు. తేనెపూసిన మాటల గమ్మత్తేమిటంటే మనకు తెలియకుండానే ఆ మాటలు నిజాలని నమ్మేస్తాం. అసలు నిజం బయట పడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మాటలను సమతూకంలో వాడటం అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. కానీ, ఆ పద్ధతిని అలవాటు చేసుకోవడం అంత కష్టమేమీ కాదు.
‘మేం చాలా కచ్చితంగా మాట్లాడతాం, ఏదైనాసరే కుండబద్దలు కొట్టినట్లు చెప్తాం..’ అని ఎవరైనా అంటే- వాళ్లు కుండల్ని కాదు.. ఎదుటివారి హృదయాన్ని బద్దలు కొడుతున్నారని గ్రహించాలి. చెప్పే విధానంలో సౌమ్యత లేకపోతే వినే వ్యక్తిలో గౌరవం తగ్గుతుంది. దీంతో ప్రేమాభిమానాలు తగ్గిపోయ ఒకరికొకరు దూరమవుతారు. మనసు గాయాలకు మంచి మాటే సరైన లేపనం. ‘మా మాటే శిలాక్షరం’- అని ఎవరైనా మొండిగా అనుకుంటే వారు మనుషులేనా? అన్న మాట వాడక తప్పదు!
http://www.andhrabhoomi.net/content/c-56
Tuesday, June 11, 2013
అమ్మనాన్నలే పిల్లలైనవేళ..
11-6-2013, ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన నా వ్యాసం.
బాల్యం, కౌమారం, వృద్ధాప్యం, వానప్రస్థం అని నాలుగు భాగాలుగా విభజించి మనం చెప్పుకుంటున్న మానవ జీవన యానం అందరికీ అనుభవైకవేద్యమే. ఈ దశలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ మనిషి తనతోపాటు తన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేస్తూ వైవిధ్యభరితమైన జీవన విధానాలను ప్రదర్శిస్తూంటాడు. ఈ ధోరణులు కుటుంబ వ్యక్తులనే కాక సమాజాన్నీ ప్రభావితం చేస్తుంటాయి. సమాంతరంగా అతడూ సమాజం చేత ప్రభావితమవుతుం టాడు. అయితే, ఈ నాలుగు దశలను దాటి వచ్చాక కలవరపరచే స్థితి పడకపై కదలలేని అవస్థ. ప్రతి మనిషికీ ఈ కష్టం వస్తుందని ముందుగానే నిర్వచించలేం. అయితే అందరూ ప్రార్థించేది మాత్రం మంత్రమేసినట్లు మాయమైపోవాలనుకునే స్థితినే! మనం ఎంతగా అనుకున్నా అన్నీ అలాగే జరగవు కదా! అలాంటి దుర్భర పరిస్థితి వస్తే- తుది శ్వాస విడిచే దాకా కాలు, చెయ్యి వెరశి మొత్తం శరీరం కదలలేని స్థితిలోనున్నా బండరాయిలా జీవించక తప్పని స్థితి. ఈ అవసాన దశనేది తారసపడతుందనేది అందరికీ తెలిసినా అధిగమించలేని అయోమయం మాత్రం వృద్ధులను మరింత బాధకు గురిచేస్తోంది. అంగవైకల్యమున్న పిల్లలు, ప్రమాదానికి గురైన పిల్లలు, మానసిక దౌర్భల్యమున్న చిన్నారులు ఎంతగా ఎదిగినా- తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
‘నాకై నేను జరగలేను, కాస్త పక్కకు ఒత్తిగిలుతాను, నన్ను కొంచెం జరుపుతావా నాయనా..’-అని దీనంగా అడిగిన పాపానికి తండ్రి పీకను కసుక్కున కోసేసిన కసాయి కొడుకులు, బతికుండగానే తల్లిని శ్మశానం ముంగిట పడేసిన బిడ్డలు, దస్తావేజులు మార్చి తల్లిదండ్రులను ఏమార్చి ఆస్తులు రాయించుకొనే పిల్లలు ఎక్కడో కాదు.. ‘ధర్మక్షేత్రం, వేదభూమి’ అని కీర్తిగాంచిన మన భారతదేశంలోనే ఉన్నారంటే మానవత్వం ఎంత అడుగంటిపోతోందో..? అని ఉలిక్కిపడకమానం.
పిల్లల పెంపకం, చదువులు, పెళ్లిళ్ళు ఇవన్నీ సవ్యంగా జరిగేలా చూసేది అమ్మానాన్నలే. తమకు రెక్కలు ఆడినంతవరకు ఎలాంటి విశ్రాంతి లేకుండా నిత్యం యంత్రాలవుతారు తల్లిదండ్రులు. లేవలేరు, నడవలేరు, నడిచినా వేలు పట్టుకుని నడిపించాలి, తింటుంటారు, వాంతి చేసేస్తుంటారు, కాలకృత్యాలు దగ్గరుండి చేయించాలి... ఈ పనులన్నింటినీ చిన్నారులకు ఆనందంగా చేస్తారు అమ్మా నాన్నలు. కానీ- జీవిత చరమదశలో తల్లిదండ్రులకు ఇదే స్థితి రావడం దయనీయం. ఈ స్థితిలో తల్లిదండ్రులకు ఎవరు సేవలు చేస్తారు? అందుకేగదా.. వృద్ధాశ్రమాలున్నాయని కొందరంటారు. అలా అనేవారు భవిష్యత్లో తమకూ ఇలాంటి స్థితి తప్పదని గ్రహించాలి.
కన్నవారిపట్ల మమకారం, వాత్సల్యం, ప్రేమ ఉన్న సంతానానికి ఇతరులు చెప్పాల్సిన పని లేదు. వారు ఐచ్ఛికంగా తల్లిదండ్రుల సేవలో తరిస్తారు. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాల్సివస్తే వారిని కనిపెట్టుకుని ఉండటానికి ఆయాలనో, నర్సులనో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, జీతం ఇచ్చి నియమించుకునే వారిని ఒక కంట గమనించాలి. వారికి ఎంత డబ్బులిచ్చినా ఓర్పు, సహనం కొనేవి కాదు. మనిషిలో సహజ సిద్ధ గుణాలవి. అందరూ మదర్ థెరెసాలు కాలేకపోవచ్చు కానీ, విసుక్కోవడం, కసురుకోవడం వల్ల వృద్ధులైన తల్లిదండ్రులను మానసికంగా మరింత దుర్భలులను చేస్తుంది. పళ్లు తోమించడం, స్నానం చేయించడం, శారీరక ఉపశమనానికి పౌడరు, వేజలైన్ వంటి వాటిని ఉపయోగించడం- వారికి మనం చేయగల చిన్న చిన్న సహాయాలు. వారి దుస్తులను, వస్తువులను శుభ్రం చేయడం వంటివి ఎంతో తృప్తి కలిగిస్తాయ. తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల ప్రేమను ఇనుమడింపచేస్తుంది. మనల్ని పెంచి పెద్దచేసిన వారి శారీరక బాధలను, ముదిమి కష్టాలను పూర్తిగా తీర్చలేకున్నా- వారిని మానసిక వేదనకు గురి కాకుండా చూడగలం కదా? దీన్ని మించిన మానవత్వమేముంది? ఇంతకుమించిన ఆత్మతృప్తి ఎక్కడ దొరుకుతుంది? ఆదరించేవారుంటేనే- ‘పునరపి బాల్యం’. దేవుడు ఆడే చదరంగంలో ఇది చివరి ఎత్తే కదా!
బాల్యం, కౌమారం, వృద్ధాప్యం, వానప్రస్థం అని నాలుగు భాగాలుగా విభజించి మనం చెప్పుకుంటున్న మానవ జీవన యానం అందరికీ అనుభవైకవేద్యమే. ఈ దశలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ మనిషి తనతోపాటు తన చుట్టుపక్కల వారిని ప్రభావితం చేస్తూ వైవిధ్యభరితమైన జీవన విధానాలను ప్రదర్శిస్తూంటాడు. ఈ ధోరణులు కుటుంబ వ్యక్తులనే కాక సమాజాన్నీ ప్రభావితం చేస్తుంటాయి. సమాంతరంగా అతడూ సమాజం చేత ప్రభావితమవుతుం టాడు. అయితే, ఈ నాలుగు దశలను దాటి వచ్చాక కలవరపరచే స్థితి పడకపై కదలలేని అవస్థ. ప్రతి మనిషికీ ఈ కష్టం వస్తుందని ముందుగానే నిర్వచించలేం. అయితే అందరూ ప్రార్థించేది మాత్రం మంత్రమేసినట్లు మాయమైపోవాలనుకునే స్థితినే! మనం ఎంతగా అనుకున్నా అన్నీ అలాగే జరగవు కదా! అలాంటి దుర్భర పరిస్థితి వస్తే- తుది శ్వాస విడిచే దాకా కాలు, చెయ్యి వెరశి మొత్తం శరీరం కదలలేని స్థితిలోనున్నా బండరాయిలా జీవించక తప్పని స్థితి. ఈ అవసాన దశనేది తారసపడతుందనేది అందరికీ తెలిసినా అధిగమించలేని అయోమయం మాత్రం వృద్ధులను మరింత బాధకు గురిచేస్తోంది. అంగవైకల్యమున్న పిల్లలు, ప్రమాదానికి గురైన పిల్లలు, మానసిక దౌర్భల్యమున్న చిన్నారులు ఎంతగా ఎదిగినా- తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
‘నాకై నేను జరగలేను, కాస్త పక్కకు ఒత్తిగిలుతాను, నన్ను కొంచెం జరుపుతావా నాయనా..’-అని దీనంగా అడిగిన పాపానికి తండ్రి పీకను కసుక్కున కోసేసిన కసాయి కొడుకులు, బతికుండగానే తల్లిని శ్మశానం ముంగిట పడేసిన బిడ్డలు, దస్తావేజులు మార్చి తల్లిదండ్రులను ఏమార్చి ఆస్తులు రాయించుకొనే పిల్లలు ఎక్కడో కాదు.. ‘ధర్మక్షేత్రం, వేదభూమి’ అని కీర్తిగాంచిన మన భారతదేశంలోనే ఉన్నారంటే మానవత్వం ఎంత అడుగంటిపోతోందో..? అని ఉలిక్కిపడకమానం.
పిల్లల పెంపకం, చదువులు, పెళ్లిళ్ళు ఇవన్నీ సవ్యంగా జరిగేలా చూసేది అమ్మానాన్నలే. తమకు రెక్కలు ఆడినంతవరకు ఎలాంటి విశ్రాంతి లేకుండా నిత్యం యంత్రాలవుతారు తల్లిదండ్రులు. లేవలేరు, నడవలేరు, నడిచినా వేలు పట్టుకుని నడిపించాలి, తింటుంటారు, వాంతి చేసేస్తుంటారు, కాలకృత్యాలు దగ్గరుండి చేయించాలి... ఈ పనులన్నింటినీ చిన్నారులకు ఆనందంగా చేస్తారు అమ్మా నాన్నలు. కానీ- జీవిత చరమదశలో తల్లిదండ్రులకు ఇదే స్థితి రావడం దయనీయం. ఈ స్థితిలో తల్లిదండ్రులకు ఎవరు సేవలు చేస్తారు? అందుకేగదా.. వృద్ధాశ్రమాలున్నాయని కొందరంటారు. అలా అనేవారు భవిష్యత్లో తమకూ ఇలాంటి స్థితి తప్పదని గ్రహించాలి.
కన్నవారిపట్ల మమకారం, వాత్సల్యం, ప్రేమ ఉన్న సంతానానికి ఇతరులు చెప్పాల్సిన పని లేదు. వారు ఐచ్ఛికంగా తల్లిదండ్రుల సేవలో తరిస్తారు. ఉద్యోగరీత్యా బయటకు వెళ్లాల్సివస్తే వారిని కనిపెట్టుకుని ఉండటానికి ఆయాలనో, నర్సులనో ఏర్పాటు చేసుకుంటారు. అయితే, జీతం ఇచ్చి నియమించుకునే వారిని ఒక కంట గమనించాలి. వారికి ఎంత డబ్బులిచ్చినా ఓర్పు, సహనం కొనేవి కాదు. మనిషిలో సహజ సిద్ధ గుణాలవి. అందరూ మదర్ థెరెసాలు కాలేకపోవచ్చు కానీ, విసుక్కోవడం, కసురుకోవడం వల్ల వృద్ధులైన తల్లిదండ్రులను మానసికంగా మరింత దుర్భలులను చేస్తుంది. పళ్లు తోమించడం, స్నానం చేయించడం, శారీరక ఉపశమనానికి పౌడరు, వేజలైన్ వంటి వాటిని ఉపయోగించడం- వారికి మనం చేయగల చిన్న చిన్న సహాయాలు. వారి దుస్తులను, వస్తువులను శుభ్రం చేయడం వంటివి ఎంతో తృప్తి కలిగిస్తాయ. తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల ప్రేమను ఇనుమడింపచేస్తుంది. మనల్ని పెంచి పెద్దచేసిన వారి శారీరక బాధలను, ముదిమి కష్టాలను పూర్తిగా తీర్చలేకున్నా- వారిని మానసిక వేదనకు గురి కాకుండా చూడగలం కదా? దీన్ని మించిన మానవత్వమేముంది? ఇంతకుమించిన ఆత్మతృప్తి ఎక్కడ దొరుకుతుంది? ఆదరించేవారుంటేనే- ‘పునరపి బాల్యం’. దేవుడు ఆడే చదరంగంలో ఇది చివరి ఎత్తే కదా!
Wednesday, May 1, 2013
మానవత్వం ఎక్కడ?
ఈ రోజు (1-5-2013) ఆంధ్రభూమిలో ప్రచురింపబడ్డ నా వ్యాసం.
http://www.andhrabhoomi.net/content/m-503
జీవనయానంలో బ్రతుకంతా మారథాన్ రేస్ లా
మారిపోతున్న నేటి తరుణంలో మానవత కాగడా పెట్టినా వెతికినా దొరకని వస్తువులా
మృగ్యమయే పరిస్థితి ఏర్పడింది.ఈ దుస్థితి నానాటికీ అధికమవుతోంది. ఇటీవల మనమంతా నోటమాటరాక టి.విలకు కళ్లప్పచెప్పి గాంచిన
సంఘటనలనే తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. నడిరోడ్డుపై ప్రమాదానికి గురైనపుడు
సహాయం కోరి ఆక్రందనలు చేసినా కరగని కసాయితనాన్ని, పసిపాపపై పాశవిక దాడిని
గురించి ప్రసారమాధ్యమాలద్వారా చూసి తెలుసుకున్నాక ‘మానవత్వమా ఏదీ నీ చిరునామా?’ అని వెతకాల్సి వస్తోంది.
తరాల అంతరాలు
ఒకవైపు,వృత్తిలో ముందుండాలనే ఆరాటం మరొకవైపు సాటి మనిషి గురించి కనీసం కాస్తయినా
ఆలోచించలేకపోవడం మానవత చిరునామానే గల్లంతు
చేసేస్తోంది. యంత్రాలకు సైతం విశ్రాంతినిస్తాం. కాని మనుషులే మానవ యంత్రాలుగా
రాత్రి,పగలు పరిశ్రమిస్తూ, తమ జీవితాలలో తామేం మరచిపోతున్నామో గ్రహించలేని
స్థితికి చేరుకున్నారు.మరి అలాంటివారికి, మనిషి అంటే మానవత్వానికి మరోపేరు అని
అ,ఆలనుండి నేర్పినా వినే తీరిక ఉంటుందా అంటే? సందేహమే!
జీవితానికి అర్థమేమిటి అని చరమాంకంలో ప్రశ్నార్థకం పలికేకన్నా జీవితాన్ని
అర్థవంతంగా మలచుకోవడం మానవజీవితంలో మానసిక వికాసం మొగ్గతొడిగిననాడే
మొదలవాలి. విలాసవంతమైన జీవితానికి
తగినన్నివనరులు, అవకాశాలు,అయినా ఏదో శూన్యం, వెలితి, నిరాశ! ట్రెడ్ మిల్ పై
ఎడతెగని నడకలా నిద్రలేచింది మొదలు నిద్రించే వరకు జీవితమంతా పరుగుకే కేటాయిస్తే
మిగిలేదేమిటి?గతం వద్దు గత అనుభవాల పాఠాలు మాకొద్దు, భూతకాలంలో ఏమవుతుందో అనే
దిగులెందుకు? వర్తమానంలో సుఖపడటమే ముఖ్యమనుకునే వారి మాటలలోనే చెప్పాలంటే ఎంజాయ్ చేయడమే జీవిక అనుకుంటే మనిషి ఉనికికే
అర్థంలేదు. మరణించాక కూడా మన ఉనికిని తెలిపేది మన నడవడే. మనం నాటిన మైలురాళ్లు
ముందు ముందు శిలా ఫలకాలై వాటిపై మనిషిగా మనం నడయాడిన తీరు లిఖించబడి
కీర్తించబడుతుంది.
ప్రపంచమే పెద్ద యంత్రాగారమై మనుషులు మరమనుషులై
హృదయాలను మరచిపోతే కరుణ స్థానంలో కార్పణ్యం చోటుచేసుకుని, మనిషిని స్వార్థపు
హాలాహలంలో కరిగించి మనీషిగా రూపుదిద్దుకోనీయదు.
విచక్షణ లోపించినపుడు పైన పేర్కొన్నఅమానుష కార్యాలు చర్వితచర్వణమే! అందుకే మానవీయ
విలువలకు బాల్యంలోనే పునాది వేయగలగాలి. మానవత్వపు ఛాయలో విద్యాబోధన జరగాలి. విశాలదృక్పథం
సన్నగిలి బుద్ధి కుచించుకుపోతే సుగుణాలు ఆవిరై దుర్గుణాలు పాతుకుపోతాయి. మనసులు ఇరుకైనచోట మనుగడ
కష్టం. అందుకే తల్లి ఒడిలో నేర్వవలసిన తొలి పాఠం మానవత్వమే! అది నేర్వనినాడు మనిషితనానికి అర్థమే
మారిపోతుంది.
Tuesday, August 14, 2012
ర్యాగింగ్
http://www.andhrabhoomi.net/content/ragging
ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన వ్యాసం
ర్యాగింగ్ ను అరికట్టలేమా? వృత్తి,సాంకేతిక విద్యాలయాలు తెరుస్తున్నవేళ
ఇది.ఇంటర్,అర్హత పరీక్షలు పూర్తిచేసుకుని కెరీర్ పరంగా తమకనువైన , తాము అర్హతపొందిన
సీట్లను సంపాదించుకుని బ్రతుకు బంగారుబాట చేసుకోవాలని కొత్త కాలేజీలలోకి
ప్రవేశిస్తారు విద్యార్థి, విద్యార్థినులు. ప్రొఫెషనల్ కాలేజీలు వారికి కొత్త వాతావరణాన్ని
చూపిస్తాయి.భావిజీవితంలో తమను ఉన్నత శిఖారాలకు
చేర్చే విద్యాలయం తమపాలిటి దేవాలయంగా
భావించి విభిన్నతలపులతో విద్యాలయ తలుపుల ముంగిట నిలుస్తారు.కాలేజీలో
ప్రవేశించగానే వారు ముందుగా చూసేది తమకు తెలిసినవారెవరైనా ఉన్నారా అని.అటు ప్రొఫెసర్లలో
కాని ఇటు సీనియర్లలోకాని తమ వెన్నుదన్ను ఎవరున్నారా అని చూస్తారు.వీరికన్నా వీరి
తల్లిదండ్రులు ఎక్కువ ఆత్రుత కనబరుస్తారు.కారణం! కాలేజీలలో చేరిన తమ పిల్లలు ర్యాగింగ్
క్రీడకు ఎక్కడ బెంబేలెత్తుతారో అనే భయం వీరిని ఆందోళనకు గురి చేస్తుంది.కాలేజీ
వేదికదాటి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది ర్యాగింగ్ సమస్య.సుప్రీంకోర్టు కూడా ఈ
విషయంపై తీవ్రంగానే స్పందించింది.అయినా ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ పేరున బలవుతున్న
విద్యార్థి,విద్యార్థినులను గురించి వింటుంటే మనమెందుకు ఈ విషసంస్కృతిని
అరికట్టలేకపోతున్నాం అనే వేదన కలుగుతుంది. ర్యాగింగ్ రాక్షసక్రీడలా మారడానికి కారణ
మేమిటి? బాధ్యులెవరు? దీనిని నిరోధించడానికి చర్యలు ఎవరు చేపట్టాలి?
ఈ ప్రశ్నల నేపథ్యంలో అసలు ర్యాగింగ్ ఎలా
మొదలవుతోంది అని ఆలోచిస్తే అందరు చెప్పే కారణమిదే. కొత్తగా వచ్చి చేరినవారికి సీనియర్లతో
సయోధ్య ఏర్పడటానికి,వారు కొత్త మరచి అందరితో కలగలిసి తిరిగేందుకు అని.మరి విషయం ఇంత
సూక్ష్మాంశమైతే ప్రాణాలను హరింపచేసుకునే వారిమాట ఏమిటి? కొత్తవారికి ర్యాగింగ్
ఇబ్బందికరంగా ఉంటుంది.వారిది పిరికితనం అని తీసిపారెయ్యడానికిలేదు. బలహీనమనస్కులు,
సెన్సిటివ్ గా బాధపడేవారికి ర్యాగింగ్
భయంకరంగా తోస్తుంది.ఇది మోతాదు పెంచితే వారు మానసిక ఒత్తిడికి గురై అందంగా ఊహించుకుంటున్న
భవిష్యత్తు మరచిపోయి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.తరుణోపాయం?
చట్టబద్ధమైన ఆంక్షలు,కఠిన
శిక్షలు,విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ స్క్వాడ్లు ఇవన్నీ ప్రభుత్వపరంగా అమలయే
విధానాలు.అయితే సామాజిక నేపథ్యంలో ఈ ర్యాగింగ్ తో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో
తల్లిదండ్రులకు,విద్యాలయాల యాజమాన్యానికి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది.మా పిల్లలు
పెద్దవాళ్లయారు వారిపై మా ఆంక్షలేముంటాయి అని పెద్దలు తప్పించుకోవడం కూడదు.ర్యాగింగ్
ఒక ఆటవిడుపు అని భ్రమపడకూడదు. ర్యాగింగ్ మూలంగా జీవితాలు చిధ్రం కాకూడదు.సరికొత్త
వాతావరణంలోకి అడుగిడిన విద్యార్థి, విద్యార్థినులకు భయంకలిగించే బదులు సామరస్యంగా
స్నేహపూరిత భావంతో ఆహ్వానం పలకాలి.కాలేజీని అందులోని ల్యాబ్, లైబ్రరీ, క్యాంటీన్, టాయిలెట్
వంటివి వెతుక్కోనక్కర లేకుండా కొత్తవారికి
చూపించాలి. మరీ వ్యక్తిగతప్రశ్నలు కాకుండా వారంతవరకు చదివిన విద్యాలయాలు, ఇష్టమైన
ఆటలు,పాటలు,పుస్తకాలు మొదలైన విషయాలను అడుగుతూ వారిలో జంకును పోగొట్టాలి. పాఠాలు
అర్థం కాకపోతే సీనియర్లుగా వారికి చదువులో కూడా సహకారమందించ వచ్చును. వారిని
ప్రొఫెసర్ల దగ్గరకు తీసుకుని వెళ్లి పరిచయం చేయవచ్చు. ఈ విషయాలు స్వల్పంగా
కనిపిస్తాయి కాని అనల్పమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి.కొత్తగా చేరినవారికి కావాలసిన
ఆత్మీయ వాతావరణాన్ని అందించే బదులు ర్యాగింగ్ పేరుతో వారిని భీతావహులుగావించడం
అభిలషణీయం కాదుకదా! ర్యాగింగ్ వలన కలిగే అసౌకర్యాలను, నష్టాలను తల్లిదండ్రులుకూడా
తమ పిల్లలకు వివరంగా తెలియచెప్పాలి. ఇదొక సామాజిక సమస్యగా పరిగణించి విద్యాలయాలలో విద్యార్థిని,
విద్యార్థులకు ర్యాగింగ్ దురాచారాన్ని రూపుమాపే దిశగా అవగాహన కల్పించాలి.
Wednesday, June 6, 2012
పనిపిల్లలూ పసిపిల్లలే!
6-6-12,ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో నా వ్యాసం.
మీకు పనిపిల్ల వుందా? అని
ఎవరైనా అడిగినప్పుడు, ఉంది అంటే ఎంతదృష్టం ఎప్పడు మీ చేతిక్రింద ఉంటుంది అంటారు.నిజమే ఈ
మాటమాత్రం ముమ్మాటికీ నిజం.ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాక పనిపిల్ల రోజంతా
ఇంటి ఇల్లాలి చేతిక్రిందే ఉంటుంది. ఆ అమ్మాయికి పనిగంటలనేవి ఏవి నిర్దిష్టంగా
ఉండవు. పిలిచిన వెంటనే పలకాలి.లేదంటే అక్షింతలు.తెమ్మన్నది తేవాలి. అందుకోమన్నది
అందుకోవాలి. చెయ్యమన్నది చెయ్యాలి. లేదంటే తిట్ల వర్షం లేదా దెబ్బల వాన
కురుస్తుంది.ఇక ఇంట్లో ఉండే వారందరికీ వీరే పనిపిల్లలు. బడికెళ్లే
పిల్లలకు బూట్లందించాలి. లైటు, ఫ్యాను వెయ్యమన్నప్పుడు వెయ్యాలి.ఆపమనగానే వచ్చి
పరుగున ఆపాలి. ఊడ్చిందే ఊడుస్తూ,తుడిచిందే తుడుస్తూ, కడిగిందే కడుగుతూ వైర్ లెస్
గాడ్జెట్ అవుతుంది. తమ ఇష్టాలను మరచి ,కష్టాలకు అలవాటు పడుతుంది ఇలాంటివారి
బాల్యం. తమ పిల్లల చేతులకు మాయిశ్చరైజర్ పూసే వారికి ,పనిపిల్లల అరచేతులలో బొబ్బలు
కనబడవు.ఇంతకష్టపడ్డా వీరికి సరైన వసతులుండవు. ఏ మెట్లక్రిందో ఉండాల్సిందే.ఈ
పిల్లలు కష్టపడకపోతే వీరికిక తగినంత తిండే ఉండదు. కన్నతల్లిదండ్రులే వీరిని
కష్టాలకొలిమిలోకి నెట్టుతారు. సంతాననభారం లేదా ధనలేమితో పిల్లలను పోషించలేక ఏ అమ్మ ఇంట్లోనో పనికి కుదిరిస్తే అంత తిండి,గుడ్డ జరిగిపోతుందన్న వారి ధోరణే పనిపిల్లలనబడే పసిపిల్లల బతుకులను నరకప్రాయం చేస్తోంది.
మానవహక్కులగురించి
మాట్లాడుతారు.మానవత్వాన్ని మరచి పసిమొగ్గలనదగ్గ చిన్నపిల్లలను ధూళి, దుమ్ము,పొగ
వెదజల్లే ఫ్యాక్టరీలలో,జౌళి పరిశ్రమలలో,ప్రమాద భరితమైన భవన నిర్మాణంలో, విష వాయు వులు
వెదజల్లే కెమికల్ పరిశ్రమలలో ఊపిరినావిరి చేసి, ఆస్తమావంటి రోగాలకు సులభంగా దారిచూపే
సిమెంట్ కర్మాగారాలలో ఇరికించి వారి ఆరోగ్యానికీ ఎసరు పెడ్తున్నారు.ఇది
శ్రమదోపిడీయే కాదు,వారి బాల్యనికీ దోపిడీయే! ఇంటా,బయటా ఏ పనులలోనైనా పిల్లలను
వినియోగిస్తారు.వారిని శారీరకంగా మానసికంగా హింసిస్తారు.
పధ్నాలుగు సంవత్సరాలలోపు
బాలబాలికలను గృహాలలోకాని,హోటళ్లలోకాని,పరిశ్రమలలోకాని పనులకొరకు వినియోగించడాన్ని
ప్రభుత్వం చట్టరూపేణా ఏనాడో నిషేధించింది.అయినా కోట్లాదిమంది పిల్లలు నేటికీ
బాలకార్మికులుగా తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు.పరిశ్రమలలో శ్రమించే బాల
కార్మికులకు తాము పని చేసేచోట ఉండే వాతావరణం ఎంత ఫ్రమాదకరమైనదో తెలియదు..కెమికల్
వాయువులు వారిని చర్మరోగాలకు గురి చేస్తాయి. టపాసులు,అగ్గిపెట్టెలతయారీ పిల్లలను
అనుకోకుండా ప్రమాదాలలోకి నెట్టడమేకాదు వారి ప్రాణాలను హరించడం చూస్తుంటాం.
తల్లిదండ్రుల పేదరికం పసిపిల్లలను పనిపిల్లలుగా
మారుస్తోంది.పేదరికం సాకుగా తమ పిల్లలను పనిలో చేర్చిన పెద్దలు, పిల్లల కష్టాన్ని
నంజుకుంటారే తప్ప పిల్లలపై మరే శ్రద్ధ చూపరు.ఎవరింట్లోనో పనికి పెట్టి వారిని
కన్నందుకు బ్రతుకుతెరువు ఏర్పరచామని అనుకుంటారే తప్ప అమ్మ,నాన్నలను వీడిన పిల్లలు
కొత్త ప్రదేశంలో తినీ తినక భయంతో నిద్రరాక,పనిభారంతో కృంగిపోయి కష్టం
చెప్పుకునే దారిలేక విలవిలలాడ్డం వారిని కన్నవారికి అర్థంకాదు.చెప్పినా అర్థం
చేసుకోరు.చేసుకోవాలని ప్రయత్నించరు.మరి పిల్లల తల్లిదండ్రులే వారి బిడ్డలకు
చిన్నవయసులోనే పనిసంకెళ్లు బిగిస్తుంటే పిల్లలను పనిలో పెట్టుకున్నవారు వారి
పిల్లలగురించి తప్ప ఇతర పిల్లల గురించి ఆలోచించనివారు పనిపిల్లల గురించి
ఆలోచిస్తారా? ఆ ఆలోచనే దరిచేరనివ్వరు.తమకు,తమ పిల్లలకు కూర్చున్న దగ్గరకు
కాఫీలు,పాలగ్లాసులు రావాల్సిందే!మళ్లీ ఇవన్నీ కడిగి తడిలేకుండా తుడిచి ఎక్కడివక్కడ
అమర్చాలి. వదిలిన చెప్పులు ,విడిచిన బట్టలు,తిన్న పళ్లెం,తాగిన కప్పులు,గ్లాసులు
ఎప్పటికప్పుడు తమతమ స్థానాల్లోకి వెళ్లవలసిందే.మీ ఇల్లెంత బాగుందో,అన్నీ చక్కగా
అమర్చారే అంటే గర్వంగా తలపంకిస్తారే తప్ప చేదోడుగా ఉన్న పనిపిల్ల ప్రస్తావన
తీసుకునిరారు.శారీరకంగా నిర్బలులైన ఈ పిల్లలను పనితనంతోనే అంచనా వేస్తారు.అంతేకాని వారికి శక్తిలేదని, చేయలేరని ఒప్పుకోరు.పిల్లలు
చేస్తేసరి.లేకుంటే తొడపాశం,వీపుమీద వాతలు ఉండనే ఉంటాయి. తమ పిల్లలను ఒక్కదోమ
కుడితే ఆ దోమను చంపందే వదలరు.మరి ఆహారం చెడితే పనిపిల్లలకే వాటా!కుళ్లిన పండ్లు
వారికే!ఇది అతిశయోక్తి కాదు.ఇంత ధరపెట్టి కొన్నాం,ఎలా పారేస్తాం అనే నైజమే దీనికి
మూలం. ఇలాంటి సంకుచిత్వం వీడాలి.మన పిల్లలు పసిపిల్లలయితే, పనిపిల్లలు పసిపిల్లలు కారా? చిన్నవయసులో
వారిని పనుల్లో బలిచేయకండి.అన్నం పెట్టడంతోపాటు ఆప్యాయతతో కాస్త అక్షర భిక్ష
కూడా పెట్టండి.
Tuesday, March 20, 2012
అమెరికా ఓ అమెరికా!




అమెరికా ఒక కలల ప్రపంచం.ఆ దేశ జీవనంతో మన జీవనశైలిని తూకమేసి చూపిన రచన అమెరికా ఓ అమెరికా!ఆచార్య మసన చెన్నప్ప గారి నానీల సంపుటిపై ఆంధ్రప్రభ 11-3-2012 దినపత్రికలో ప్రచురింపబడిన నా రచన.
మెరికల్లాంటి భావాల అమరిక-అమెరికా!ఓ అమెరికా!
మనసున ఉదయించిన భావాలను నానీలుగా మెరిపించడం ఆచార్య మసన చెన్నప్పగారి చతురతా పాటవమే! వీరు ఆవిష్కరింపచేసిన అమెరికా!ఓ అమెరికా!నానీల సంపుటి అమెరికా జీవన సరళిని మన జీవన శైలితో త్రాసులో వేసి తూకం చూడమంటుంది.ఇరువైపులా మొగ్గు చూపగలగడం ఈ త్రాసు ప్రత్యేకత!అక్కడ కొన్నిటికి అగ్రాసనమైతే,ఇక్కడ కొన్ని అగ్రతాంబూలమందుకుంటాయి.
నలుగురితో సుఖమా ఇండియాలో ఉండు,ఏకాంతవాసమా అమెరికాకు రా! అంటారు.ఒంటరితనానికి అక్కడ పెద్దపీట. కలసి జీవించడం మన మనసు మాట.ఆ దేశ ప్రభావం కొంత,ఉద్యోగవిధుల వల్ల మరికొంత ఇక్కడ కూడా సమిష్టి కుటుంబాల స్థానే వ్యష్టి కుటుంబాలు అధికమవుతున్నాయి.కుడివైపున వాహనాలు నడపడం వారి మార్గం! వారిని రైటిస్టులని చమత్కరిస్తారు. వైద్యపరమైన వనరులు,సదుపాయాలు అపారమక్కడ.అందుకే వైద్యులను అపర ధన్వంతరులన్నారు.అమెరికా ఘనత శుభ్రతలోనేనంటూ అచట క్రిములుండవు,ఐస్ క్రీములుంటాయంటారు.అక్కడ రోడ్ల శుభ్రతను కాంచిన కవి ఇక్కడ కార్లకు కొబ్బరికాయలు కొట్తే అక్కడ రహదారులకు కొబ్బరికాయలు కొట్టాలంటారు.కార్లు తప్ప మనుషులు కనబడని రహదారులంటారు వారివి.కార్లు,మనుషులే కాదు అన్ని రకాల వాహనాలు,కలసికట్టుగా సంచరించే మన రహదారులు అలాంటి అభివృద్ధి అందుకోవాలని ఆశపడతాం.
షికాగో నగరంలో వివేకం పురివిప్పి నాట్యమాడిందంటూ వివేకానందుని ప్రసంగాన్ని జ్ఞాపకాలతెర తీసి చూపుతారు. శని,ఆదివారాలు మాత్రమే వెసులుబాటు,మిగత ఐదురోజులు ఖైదీలే అంటారు.తూర్పు,పడమర ఎదురెదురు కదా,అందుకే వారు హిమాలయాలవైపు చూస్తే మనం నయాగరావైపు చూపు సారిస్తామన్న కవి పలుకులు అక్షరసత్యాలు.వెలగలిగిన వస్తువుల అంగడి అమెరికా అనడం వస్తువినిమయ ప్రపంచాన్ని ఆవిష్కరింప చేసింది.అమెరికాలో పల్లీలు కొనాలంటే ఒక్కడాలరే అని ఎవరైనా అంటే,ఒక్క డాలరా! యాభైరూపాయలా!అంటూ పావలాకు కొనుక్కున్న రోజులు గుర్తుకొచ్చి గుండెలు బాదుకుంటాం.
అమెరికా భూతలస్వర్గంకాదు,బెడ్ ఆఫ్ రోజెస్ అంతకన్నాకాదు అని చెప్తూనే మనవాళ్లు అమెరికాలో కష్టపడి సుఖాన్ని అనుభవిస్తున్నారంటారు.ఇక్కడ కులాల కురుక్షేత్రమయితే అక్కడ జాతుల జాత్యంహంకారమంటారు.ఎండకాలం మండే కొండలున్న కాలిఫోర్నియాను కాలే ఫోర్నియా అంటారు.ఇలా ఒకటా రెండా ఎన్నోపదాల విరుపులు,మెరుపులు నానీలను చమత్కృతులతో తాపడం పెట్టి మనసును గిలిగింతలు పెట్తాయి.అమెరికాను అలా చూసి,ఇలా మరచిపోక తన మనసున ముద్రితమైన భావాలను వెంట తోడ్కొని వచ్చి చదివినంతనే నాలుకపై స్థిరపడిపోయే వేమన పద్యాల్లా నానీలను రూపకల్పన చేయడం అభినందనీయం.
ప్రతులకు,
1)నవోదయా బుక్ హౌస్
కాచిగూడ,హైదరాబాద్-27
2)ఆంధ్ర సారస్వత పరిషత్
తిలక్ రోడ్,హైదరాబాద్-1
3)ప్రమీల ప్రచురణలు,
శ్రేష్టారామం
9-76/2,ఉదయనగర్ కాలనీ
బోడుప్పల్
హైదరాబాద్-500 039
ఫోన్:040-27201007
Saturday, March 17, 2012
మనసుభాష
17-3-2012,ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురింపబడిన నా వ్యాసం.
http://www.andhrabhoomi.net/content/batuku-basha-kadu
బతుకు భాష కాదు.. మనసు భాష కావాలి
తెలుగు చదవడం రానివాళ్లున్నారు, తెలుగు రాయలేని వాళ్లున్నారు, తెలుగు మాట్లాడటం రానివారున్నారు. వారు కన్నడిగులు, తమిళులు, బెంగాలీలు, పంజాబీలు, కేరళీయులు అనుకుంటున్నారు కదూ! కాదు... అరె! వీరికి కూడా తెలుగు వచ్చు, మాటలాడటం చూసామే అంటారు. అయితే తెలుగువారయి కూడా తెలుగు మాటలాడటం రానివారు, మాటలాడటానికి ప్రయత్నించనివారు, మాట్లాడాలంటే సిగ్గుపడేవారు ఉన్నారు.
ఇక మాట్లాడినా పట్టి పట్టి మాట్లాడుతారు. అసలు వీరు మాట్లాడేది తెలుగేనా అని సందేహం కలుగుతుంది. మన మాతృభాషకు ఎందుకీ వేదన అని బాధ కలుగుతుంది. చెక్కుమీద తెలుగులో సంతకం చేసినందుకు తనకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడం తెలుసుకున్న భోగరాజు పట్ట్భారామయ్యగారు ఆవేశపూరితులయ్యారు. దాని ఫలితమే ఆంధ్రా బ్యాంకు అవతరణ! ఏది ఆ స్ఫూర్తి ఈనాడు?
తెలుగు బిడ్డడవయ్యు తెలుగు రాదంచును / సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా? / దేశ భాషలందు తెలుగులెస్స యటంచు / తెలుగు బిడ్డా / యెపుడు తెలుసుకుందువురా? అని ప్రజాకవి కాళోజీగారు అన్నమాటలు చురుక్కుమనిపించక మానవు.
ఆంగ్ల భాషను నేర్చుకుని తద్వారా ఉద్యోగ అర్హతలను పెంపొందించుకోవద్దని ఎవరూ అనరు. బ్రతుకు భాషకు మనసు భాషకు ఉన్న అంతరం తెలుసుకోవాలి. తెలుగుపై ఆదరణ పెంచుకుని, తెలుగులో ఇంటా బయటా సంభాషిస్తూ భాషా పాటవాన్ని పెంచే సాహిత్య పఠనాన్ని ప్రోత్సహిస్తూ నవతరాన్ని తెలుగు బాటలో నడపాలి.
తెలుగు భాష బలంగా వేళ్లూనాలంటే భాషాప్రియత్వ ప్రకటనలో ఒరవడి మారాలి. మాతృమూర్తిపై మమత, మమకారం, స్వతస్సిద్ధం. మరి మాతృభాషపై ఉదాసీనత ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్ల భాషను ప్రాథమిక స్థాయి నుండి ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. పిల్లల సామర్థ్యం పెంచే దిశగా విద్యావిధానాలు రూపుదిద్దుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనా తెలుగును విస్మరించి చిన్నచూపుచూడరాదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. ఆంగ్లం మాధ్యమంగాకల విద్యా సంస్థలలో తెలుగులో మాట్లాడితే శిక్షింపబడుతున్న చిన్నారుల అవస్థలు చూస్తే పిల్లలకు కాకుండా ముందు వారిని శిక్షించినవారికి పాఠాలు నేర్పవలసిన అవసరముందేమోననిపిస్తుంది.
తెలుగు మనసు భాష. మన మనసులోని భావాలను పరభాషలలో ఎంత సామర్థ్యమున్నా తెలుగులో ప్రకటించినంత స్పష్టంగా ఆలోచనలను అర్థవంతంగా వివరించడం కష్టతరం. తెలుగు జాతీయాలు, నుడికారాలు, పొడుపు కథలు సామెతలతో పరిపుష్టమైన తెలుగు భాష వినసొంపుగా ఉండటమే కాదు భాష పట్ల అభిమానాన్ని పెంచుతుంది. అందుకే చిన్నారులకు కథలు చెప్పేటపుడు కథలో వచ్చిన జాతీయాలు, సామెతలకు అర్థాలు చెప్పి భాష సౌందర్యాన్ని ఇనుమడింపజేయాలి. పిల్లలలో పఠనాసక్తిని పెంపొందించేందుకు కథ రాజమార్గం.
తెలుగుకు పొరుగు రాష్ట్రాలవలెనే మనకూ ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరం ఉందని ఎందరు నొక్కి చెప్పినా కార్యరూపం దాల్చడానికి కాలమెప్పుడు కరుణ చూపుతుందోనని వేచి చూడటమే మనకు మిగిలింది. తెలుగు నేర్చుకుంటే మాకేం లాభం అనేవారికి తెలుగు పరీక్షలో రావలసిన కనీస మార్కులు వారు కోరుకుంటున్న ఉద్యోగానికి అదనపు అర్హత అని నిర్ణయిస్తే ఈ ప్రశ్న వేయరు.
ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషను మృతభాషగా మార్చకూడదుకదా! చివరకు పెద్దతెర, చిన్నతెర అని తేడా లేకుండా ఆంగ్ల శీర్షికలకే ప్రాముఖ్యతనిస్తున్నాయి. కడకు వ్యాసాలలోకూడా అసంఖ్యాకమైన ఆంగ్ల పదాలు దొర్లడం తెలియకుండానే జరిగిపోతుంటుంది. అవసరార్థం అరువు తెచ్చుకున్న పరభాష జీవిత నౌకను నడిపిస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఆ భాషపై పెల్లుబికిన వ్యామోహ సునామీ ముంచుతుందో లేక చాప క్రింద నీరులా మూలాలను కబళిస్తుందో తెలియక, అచేతనులై నిలబడ్డ భాషాభిమానులను నివ్వెరబోయేటట్లు చేస్తోంది.
- సి.ఉమాదేవి
http://www.andhrabhoomi.net/content/batuku-basha-kadu
బతుకు భాష కాదు.. మనసు భాష కావాలి
తెలుగు చదవడం రానివాళ్లున్నారు, తెలుగు రాయలేని వాళ్లున్నారు, తెలుగు మాట్లాడటం రానివారున్నారు. వారు కన్నడిగులు, తమిళులు, బెంగాలీలు, పంజాబీలు, కేరళీయులు అనుకుంటున్నారు కదూ! కాదు... అరె! వీరికి కూడా తెలుగు వచ్చు, మాటలాడటం చూసామే అంటారు. అయితే తెలుగువారయి కూడా తెలుగు మాటలాడటం రానివారు, మాటలాడటానికి ప్రయత్నించనివారు, మాట్లాడాలంటే సిగ్గుపడేవారు ఉన్నారు.
ఇక మాట్లాడినా పట్టి పట్టి మాట్లాడుతారు. అసలు వీరు మాట్లాడేది తెలుగేనా అని సందేహం కలుగుతుంది. మన మాతృభాషకు ఎందుకీ వేదన అని బాధ కలుగుతుంది. చెక్కుమీద తెలుగులో సంతకం చేసినందుకు తనకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడం తెలుసుకున్న భోగరాజు పట్ట్భారామయ్యగారు ఆవేశపూరితులయ్యారు. దాని ఫలితమే ఆంధ్రా బ్యాంకు అవతరణ! ఏది ఆ స్ఫూర్తి ఈనాడు?
తెలుగు బిడ్డడవయ్యు తెలుగు రాదంచును / సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా? / దేశ భాషలందు తెలుగులెస్స యటంచు / తెలుగు బిడ్డా / యెపుడు తెలుసుకుందువురా? అని ప్రజాకవి కాళోజీగారు అన్నమాటలు చురుక్కుమనిపించక మానవు.
ఆంగ్ల భాషను నేర్చుకుని తద్వారా ఉద్యోగ అర్హతలను పెంపొందించుకోవద్దని ఎవరూ అనరు. బ్రతుకు భాషకు మనసు భాషకు ఉన్న అంతరం తెలుసుకోవాలి. తెలుగుపై ఆదరణ పెంచుకుని, తెలుగులో ఇంటా బయటా సంభాషిస్తూ భాషా పాటవాన్ని పెంచే సాహిత్య పఠనాన్ని ప్రోత్సహిస్తూ నవతరాన్ని తెలుగు బాటలో నడపాలి.
తెలుగు భాష బలంగా వేళ్లూనాలంటే భాషాప్రియత్వ ప్రకటనలో ఒరవడి మారాలి. మాతృమూర్తిపై మమత, మమకారం, స్వతస్సిద్ధం. మరి మాతృభాషపై ఉదాసీనత ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్ల భాషను ప్రాథమిక స్థాయి నుండి ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. పిల్లల సామర్థ్యం పెంచే దిశగా విద్యావిధానాలు రూపుదిద్దుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనా తెలుగును విస్మరించి చిన్నచూపుచూడరాదన్న అభిప్రాయం బలంగా వినిపించింది. ఆంగ్లం మాధ్యమంగాకల విద్యా సంస్థలలో తెలుగులో మాట్లాడితే శిక్షింపబడుతున్న చిన్నారుల అవస్థలు చూస్తే పిల్లలకు కాకుండా ముందు వారిని శిక్షించినవారికి పాఠాలు నేర్పవలసిన అవసరముందేమోననిపిస్తుంది.
తెలుగు మనసు భాష. మన మనసులోని భావాలను పరభాషలలో ఎంత సామర్థ్యమున్నా తెలుగులో ప్రకటించినంత స్పష్టంగా ఆలోచనలను అర్థవంతంగా వివరించడం కష్టతరం. తెలుగు జాతీయాలు, నుడికారాలు, పొడుపు కథలు సామెతలతో పరిపుష్టమైన తెలుగు భాష వినసొంపుగా ఉండటమే కాదు భాష పట్ల అభిమానాన్ని పెంచుతుంది. అందుకే చిన్నారులకు కథలు చెప్పేటపుడు కథలో వచ్చిన జాతీయాలు, సామెతలకు అర్థాలు చెప్పి భాష సౌందర్యాన్ని ఇనుమడింపజేయాలి. పిల్లలలో పఠనాసక్తిని పెంపొందించేందుకు కథ రాజమార్గం.
తెలుగుకు పొరుగు రాష్ట్రాలవలెనే మనకూ ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరం ఉందని ఎందరు నొక్కి చెప్పినా కార్యరూపం దాల్చడానికి కాలమెప్పుడు కరుణ చూపుతుందోనని వేచి చూడటమే మనకు మిగిలింది. తెలుగు నేర్చుకుంటే మాకేం లాభం అనేవారికి తెలుగు పరీక్షలో రావలసిన కనీస మార్కులు వారు కోరుకుంటున్న ఉద్యోగానికి అదనపు అర్హత అని నిర్ణయిస్తే ఈ ప్రశ్న వేయరు.
ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషను మృతభాషగా మార్చకూడదుకదా! చివరకు పెద్దతెర, చిన్నతెర అని తేడా లేకుండా ఆంగ్ల శీర్షికలకే ప్రాముఖ్యతనిస్తున్నాయి. కడకు వ్యాసాలలోకూడా అసంఖ్యాకమైన ఆంగ్ల పదాలు దొర్లడం తెలియకుండానే జరిగిపోతుంటుంది. అవసరార్థం అరువు తెచ్చుకున్న పరభాష జీవిత నౌకను నడిపిస్తుందనుకుంటున్న నేపథ్యంలో ఆ భాషపై పెల్లుబికిన వ్యామోహ సునామీ ముంచుతుందో లేక చాప క్రింద నీరులా మూలాలను కబళిస్తుందో తెలియక, అచేతనులై నిలబడ్డ భాషాభిమానులను నివ్వెరబోయేటట్లు చేస్తోంది.
- సి.ఉమాదేవి
Saturday, January 14, 2012
సాహిత్యం ఎందుకు చదవాలి?
ఒకసారి ఇంటిదగ్గరేవున్న లైబ్రరీలో సాహితీసమాలోచన జరుగుతోంది.పాఠకులంతా ఎంతో శ్రద్ధగా వింటున్నారు అని లైబ్రరీ పెద్దలు,ఆసక్తిగా వింటున్న రచయితలు,రచయిత్రులు తలపోస్తున్నారు.ఎనీ డౌట్స్?అని అంతవరకు ప్రసంగించిన వారు అడగడం ఆలస్యం పై ప్రశ్నశరమై వచ్చితలలో పాతుకుంది.అడిగినగొంతును గుర్తించి అందరు ఆ అమ్మాయివైపుకు తిరిగారు.అవును,ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత అందరిదీ.అప్పటికప్పుడు చెప్పిన సమాధానాలు ఒకొక్కసారి సంతృప్తినివ్వవు.మరికాస్త వివరించి,నచ్చచెప్పితే సాహిత్యాన్ని వాడనీయకుండా కాపాడుకోవచ్చుననే ఆశే ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ.
పుస్తకం హస్తభూషణం అంటారు.రైల్వేస్టేషన్లో హిగ్గిన్ బాథమ్స్ మొదలుకుని కిళ్లీ బడ్డీలో అర్ధణాకు అద్దెకె తెచ్చుకున్న పుస్తకంతో మమేకమైన రోజులు,గడిచిన తరానికి ప్రతినిధులైన పుస్తక ప్రియులకు తియ్యని జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి.
సాహిత్యమెందుకు చదవాలి?లాభమేంటి?పుస్తకం చదివే సమయంలో మరేదైనా లాభదాయకమైనపని చేయొచ్చుకదా?అని ప్రశ్నించేవారూ ఉన్నారు.పుస్తకాన్ని తాకితే ఎక్కడ అతుక్కుపోతుందేమోనని భయపడేవారెందరో అడిగే ప్రశ్నలివి.సైన్స్ చదువు డాక్టరవుతావు,లెక్కలు చెయ్యి ఇంజనీరవుతావు అని చెప్తాం కాని సాహిత్యాన్నెందుకు చదవాలి? అని అడిగినపుడు మనసుతడబడుతుంది.సమాధానం చెప్పలేక కాదు,మనల్నిమనం ఎందుకు మరచిపోతున్నామని?మనలో అంతర్ముఖీనత కరవైనందుకు హృదయం కాసేపు కలత చెందుతుంది.ఛాయిస్ లో వదలేసిన ప్రశ్నలుగా వాటిని భావించుకుని మనసుకు సర్ధిచెప్పుకోవడం కనబడే మార్గం.అలాగని సరిపుచ్చుకుంటే సమాధానం దొరక్క ప్రతిప్రశ్నా తెల్లబోతుంది.
గాఢమైన జీవితానుభవాలు,నిత్యసంఘర్షణ,విభిన్న స్పందనలు,ఊహలు,అనుభూతులు, సామాజిక చైతన్యం,వాస్తవఘటనలు,మరెన్నో సంఘటనలు.ఇదే జీవిత సమాహారం.మనసుతెర తొలగితేనే స్పందన.విభిన్న అంశాలకు,విభిన్నరీతులలో స్పందించిన రచనా శిల్పుల సాహితీపోకడలను,వాటి వెనుకనున్న ఆశయాలను,ఆకాంక్షలను వారి రచనలొసగే ప్రయోజనాలను వెరసి వారి సాహిత్యపు తీరుతెన్నులను స్పృశించడమంటే కొండను అద్దంలో చూపించడమే!
సాహిత్యానికి విభిన్న రూపాలున్నట్టే విభిన్న నిర్వచనాలున్నాయి.జీవితాన్ని దర్శించేదే సాహిత్యమంటారు కొందరు.జీవిత విమర్శే సాహిత్యమంటారు మరికొందరు.ఎవరేమన్నా హితవుకోరేదే సాహిత్యం.అందుకే రచయిత లేదా రచయిత్రి సమాజంలోకి సంధించిన అక్షరాస్త్రాలు చెడును చీల్చి మంచిని నెలకొల్పే దిశగా సాగాలి.రచనలు చూపే మంచిమార్గం పాఠకులను ప్రభావితం చేస్తుందా అని తేలిగ్గా అనెయ్యవచ్చుగాని మంచిచేయకపోతే పోనీ చెడును ప్రోత్సాహించకూడదుకదా?
సాహిత్యం బహుముఖాలుగా విస్తరిల్లడం మనకందరికీ తెల్సు. కవిత,కథ,నాటకం జనబహుళ్యంలోకి చొచ్చుకునిపోయిన చక్కటి సాహితీ ప్రక్రియలు.ఇక జానపదకథలు,హరికథలు,బుర్రకథలు,అమ్మపాడే లాలిపాటనుంచి పైరగాలిలో తేలియాడే పల్లెపాటదాకా అన్నీ సాహిత్యరూపాలే!సాహిత్యం తన విశ్వరూపదర్శనంతో అటు పండితులను ఇటు పామరులను రంజింప చేయగలుగుతుంది.
మనిషి జీవనచిత్రంలో అన్నిరంగులు మిరుమిట్లు గొలపవు.కొన్ని వెలిసిపోతాయి,మరికొన్ని పూర్తిగా తడిసిపోతాయి.అయితే జీవన హరివిల్లు విరియాలంటే ఎలా?మనిషిలో ఉండాల్సిన మానవీయ లక్షణాలు ఆవిరవుతున్న ఆనవాళ్లు భయంగొల్పుతాయి.అలాంటి సమయంలోమనిషిని నిలకడగా నిలిపేది మానవీయకోణాన్నిదర్శింపచేసే సాహిత్యం.ప్రతిదినం పరుగే అయిన జీవన వేగంలో అదృశ్యచక్రాలతో పాదవిన్యాసం చేసే మనిషిని,అతని మనసును స్వాంతన పరచేది సాహిత్యం.
వాస్తవానికి మనిషి తనకుతానే దూరమవుతున్నాడు.బ్రతుకు పోరాటంలో మనిషిని కోరికలు కబళిస్తున్నాయి.వాటిని తీర్చుకునే మార్గాన్వేషణలో ఆలోచనావల్మీకం మేరుపర్వతంలా పెరిగిపోతుంది. హృదయస్పందనలు మూగపోతున్నాయి.మనోనేత్రం నిద్రపోతోంది.మేధ మౌనపాత్ర పోషిస్తుంది.భద్రత బదులు అభద్రతావలయంలోకి తానే చొచ్చుకునిపోతున్నాడు మనిషి.సంఘర్షణ జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటుంది.పుట్టుకతోనే మొదలవుతుంది సంఘర్షణ,డబ్బు,ప్రేమ,చదువు,ఉద్యోగం వీటన్నిటిలోను ఘర్షణే. వీటి నడుమ మనిషి మనసును వికసింపచేసి జీవన విలువలను నిలబెడుతుంది సాహితీరంగం.
రచయితకున్న సాహితీబాధ్యత తక్కువేమికాదు.రచనలద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి రచయితకుంది.రచనద్వారా ప్రభావితమైన మనిషి తనలోదాగివున్న శక్తులను మేల్కొలిపే ఆయుధం పుస్తకం అనితెలుసుకోగలుగుతాడు.శరీరం రోగగ్రస్థమైనపుడు మందులవాడకం తప్పనిసరి.అనారోగ్యాన్నిముందుగానే నిరోధించాలని టీకాలు వేయిస్తాం.పైగా విటమిన్లనిచ్చి శక్తిని పెంచుతాం.అలాగే మనసుకున్నస్థబ్దతను కరిగించి,విజ్ఞత కలిగించి,విచక్షణ పెంచి,స్వయం నిర్ణయశక్తిని కలుగచేసి,స్థితప్రజ్ఞతను పెంపొందించి సమస్యలను పరిష్కరించే దిశానిర్దేశాన్ని కలుగచేసేదే సాహిత్యం.మనసుకు శక్తినిచ్చిమేధను వికసింపచేసే టానిక్.టి.వి,సినిమావంటి శక్తివంతమైన మాధ్యమాలున్నాపుస్తకమే మనిషి మనసులోని బ్రతుకు పుస్తకాన్ని తెరవగలిగే మాధ్యమమని చెప్పవచ్చు.హృదయాన్నితట్టిలేపే సాహిత్యం మనకు తామరతంపరగా వుంది.పిల్లల నైతిక ప్రవర్తనను నిర్దేశించే నీతిశతకాలు సాహిత్య హితవులే.మానవతావిలువల్ని అడుగంటనీక,అడుగడుగునా సాహితీవిలువల్నిపెంచి పోషించే కథలు,సమాజాన్ని ప్రభావితం చేసే ధనసంస్కృతిని ఎండగట్టే కథలు ఎన్నోతీరులు, ఎన్నోరీతులు.విభిన్న రచయితలు విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మనిషి మనవలసిన విధమిది అని అంతర్లీనంగా నిద్రాణమైన మానవతావిలువలను సాసితీసరస్వతి ముఖత తెలియచేసే సాహిత్యం మన సొత్తు కావడం మన అదృష్టం.సామాజిక పరిణామంనుంచి గ్లోబలైజేషన్ దాకా వర్గదోపిడీ నుండి అభివృద్ధిదాకా ఎన్నెన్నో అంశాల అక్షరదీపాల సమూహమే సాహిత్యం.సాహిత్యపు వెలుగులో జీవనవిధానాన్నిమెరుగుపరిచే మెలకువలు తెలియాలంటే సాహిత్యపఠనం తప్పనిసరి.
పుస్తకం హస్తభూషణం అంటారు.రైల్వేస్టేషన్లో హిగ్గిన్ బాథమ్స్ మొదలుకుని కిళ్లీ బడ్డీలో అర్ధణాకు అద్దెకె తెచ్చుకున్న పుస్తకంతో మమేకమైన రోజులు,గడిచిన తరానికి ప్రతినిధులైన పుస్తక ప్రియులకు తియ్యని జ్ఞాపకాలుగా మిగిలే ఉంటాయి.
సాహిత్యమెందుకు చదవాలి?లాభమేంటి?పుస్తకం చదివే సమయంలో మరేదైనా లాభదాయకమైనపని చేయొచ్చుకదా?అని ప్రశ్నించేవారూ ఉన్నారు.పుస్తకాన్ని తాకితే ఎక్కడ అతుక్కుపోతుందేమోనని భయపడేవారెందరో అడిగే ప్రశ్నలివి.సైన్స్ చదువు డాక్టరవుతావు,లెక్కలు చెయ్యి ఇంజనీరవుతావు అని చెప్తాం కాని సాహిత్యాన్నెందుకు చదవాలి? అని అడిగినపుడు మనసుతడబడుతుంది.సమాధానం చెప్పలేక కాదు,మనల్నిమనం ఎందుకు మరచిపోతున్నామని?మనలో అంతర్ముఖీనత కరవైనందుకు హృదయం కాసేపు కలత చెందుతుంది.ఛాయిస్ లో వదలేసిన ప్రశ్నలుగా వాటిని భావించుకుని మనసుకు సర్ధిచెప్పుకోవడం కనబడే మార్గం.అలాగని సరిపుచ్చుకుంటే సమాధానం దొరక్క ప్రతిప్రశ్నా తెల్లబోతుంది.
గాఢమైన జీవితానుభవాలు,నిత్యసంఘర్షణ,విభిన్న స్పందనలు,ఊహలు,అనుభూతులు, సామాజిక చైతన్యం,వాస్తవఘటనలు,మరెన్నో సంఘటనలు.ఇదే జీవిత సమాహారం.మనసుతెర తొలగితేనే స్పందన.విభిన్న అంశాలకు,విభిన్నరీతులలో స్పందించిన రచనా శిల్పుల సాహితీపోకడలను,వాటి వెనుకనున్న ఆశయాలను,ఆకాంక్షలను వారి రచనలొసగే ప్రయోజనాలను వెరసి వారి సాహిత్యపు తీరుతెన్నులను స్పృశించడమంటే కొండను అద్దంలో చూపించడమే!
సాహిత్యానికి విభిన్న రూపాలున్నట్టే విభిన్న నిర్వచనాలున్నాయి.జీవితాన్ని దర్శించేదే సాహిత్యమంటారు కొందరు.జీవిత విమర్శే సాహిత్యమంటారు మరికొందరు.ఎవరేమన్నా హితవుకోరేదే సాహిత్యం.అందుకే రచయిత లేదా రచయిత్రి సమాజంలోకి సంధించిన అక్షరాస్త్రాలు చెడును చీల్చి మంచిని నెలకొల్పే దిశగా సాగాలి.రచనలు చూపే మంచిమార్గం పాఠకులను ప్రభావితం చేస్తుందా అని తేలిగ్గా అనెయ్యవచ్చుగాని మంచిచేయకపోతే పోనీ చెడును ప్రోత్సాహించకూడదుకదా?
సాహిత్యం బహుముఖాలుగా విస్తరిల్లడం మనకందరికీ తెల్సు. కవిత,కథ,నాటకం జనబహుళ్యంలోకి చొచ్చుకునిపోయిన చక్కటి సాహితీ ప్రక్రియలు.ఇక జానపదకథలు,హరికథలు,బుర్రకథలు,అమ్మపాడే లాలిపాటనుంచి పైరగాలిలో తేలియాడే పల్లెపాటదాకా అన్నీ సాహిత్యరూపాలే!సాహిత్యం తన విశ్వరూపదర్శనంతో అటు పండితులను ఇటు పామరులను రంజింప చేయగలుగుతుంది.
మనిషి జీవనచిత్రంలో అన్నిరంగులు మిరుమిట్లు గొలపవు.కొన్ని వెలిసిపోతాయి,మరికొన్ని పూర్తిగా తడిసిపోతాయి.అయితే జీవన హరివిల్లు విరియాలంటే ఎలా?మనిషిలో ఉండాల్సిన మానవీయ లక్షణాలు ఆవిరవుతున్న ఆనవాళ్లు భయంగొల్పుతాయి.అలాంటి సమయంలోమనిషిని నిలకడగా నిలిపేది మానవీయకోణాన్నిదర్శింపచేసే సాహిత్యం.ప్రతిదినం పరుగే అయిన జీవన వేగంలో అదృశ్యచక్రాలతో పాదవిన్యాసం చేసే మనిషిని,అతని మనసును స్వాంతన పరచేది సాహిత్యం.
వాస్తవానికి మనిషి తనకుతానే దూరమవుతున్నాడు.బ్రతుకు పోరాటంలో మనిషిని కోరికలు కబళిస్తున్నాయి.వాటిని తీర్చుకునే మార్గాన్వేషణలో ఆలోచనావల్మీకం మేరుపర్వతంలా పెరిగిపోతుంది. హృదయస్పందనలు మూగపోతున్నాయి.మనోనేత్రం నిద్రపోతోంది.మేధ మౌనపాత్ర పోషిస్తుంది.భద్రత బదులు అభద్రతావలయంలోకి తానే చొచ్చుకునిపోతున్నాడు మనిషి.సంఘర్షణ జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడుతూనే ఉంటుంది.పుట్టుకతోనే మొదలవుతుంది సంఘర్షణ,డబ్బు,ప్రేమ,చదువు,ఉద్యోగం వీటన్నిటిలోను ఘర్షణే. వీటి నడుమ మనిషి మనసును వికసింపచేసి జీవన విలువలను నిలబెడుతుంది సాహితీరంగం.
రచయితకున్న సాహితీబాధ్యత తక్కువేమికాదు.రచనలద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి రచయితకుంది.రచనద్వారా ప్రభావితమైన మనిషి తనలోదాగివున్న శక్తులను మేల్కొలిపే ఆయుధం పుస్తకం అనితెలుసుకోగలుగుతాడు.శరీరం రోగగ్రస్థమైనపుడు మందులవాడకం తప్పనిసరి.అనారోగ్యాన్నిముందుగానే నిరోధించాలని టీకాలు వేయిస్తాం.పైగా విటమిన్లనిచ్చి శక్తిని పెంచుతాం.అలాగే మనసుకున్నస్థబ్దతను కరిగించి,విజ్ఞత కలిగించి,విచక్షణ పెంచి,స్వయం నిర్ణయశక్తిని కలుగచేసి,స్థితప్రజ్ఞతను పెంపొందించి సమస్యలను పరిష్కరించే దిశానిర్దేశాన్ని కలుగచేసేదే సాహిత్యం.మనసుకు శక్తినిచ్చిమేధను వికసింపచేసే టానిక్.టి.వి,సినిమావంటి శక్తివంతమైన మాధ్యమాలున్నాపుస్తకమే మనిషి మనసులోని బ్రతుకు పుస్తకాన్ని తెరవగలిగే మాధ్యమమని చెప్పవచ్చు.హృదయాన్నితట్టిలేపే సాహిత్యం మనకు తామరతంపరగా వుంది.పిల్లల నైతిక ప్రవర్తనను నిర్దేశించే నీతిశతకాలు సాహిత్య హితవులే.మానవతావిలువల్ని అడుగంటనీక,అడుగడుగునా సాహితీవిలువల్నిపెంచి పోషించే కథలు,సమాజాన్ని ప్రభావితం చేసే ధనసంస్కృతిని ఎండగట్టే కథలు ఎన్నోతీరులు, ఎన్నోరీతులు.విభిన్న రచయితలు విభిన్న పార్శ్వాలను స్పృశిస్తూ మనిషి మనవలసిన విధమిది అని అంతర్లీనంగా నిద్రాణమైన మానవతావిలువలను సాసితీసరస్వతి ముఖత తెలియచేసే సాహిత్యం మన సొత్తు కావడం మన అదృష్టం.సామాజిక పరిణామంనుంచి గ్లోబలైజేషన్ దాకా వర్గదోపిడీ నుండి అభివృద్ధిదాకా ఎన్నెన్నో అంశాల అక్షరదీపాల సమూహమే సాహిత్యం.సాహిత్యపు వెలుగులో జీవనవిధానాన్నిమెరుగుపరిచే మెలకువలు తెలియాలంటే సాహిత్యపఠనం తప్పనిసరి.
Subscribe to:
Posts (Atom)




