Showing posts with label విశ్లేషణలు. Show all posts
Showing posts with label విశ్లేషణలు. Show all posts

Wednesday, September 11, 2013

అభినందన చందనం

12 comments

                                               
      

వృత్తి, ప్రవృత్తి కలగలసిన సాహితీ కలనేత డా. పెళ్లకూరు జయప్రదగారి  సాహిత్యం.వారికి నా అభినందన చందనం!          
               డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డిగారు తన నవలలు,కథలు,కవితలద్వారా పాఠకలోకానికి చిరపరిచితురాలు.  వైద్యవృత్తి, రచనారంగం రెండింటిలోను  నైపుణ్యాన్ని ప్రదర్శించగల సవ్యసాచి. అటు వైద్యసేవలనందిస్తూనే ఇటు  సాహితీ సేవ గావిస్తున్న జయప్రదగారు రచనపట్ల  తన అభిప్రాయాన్ని తాను వెలువరించిన కథలు,నవలల ముందుమాటలలోనే స్పష్టం  చేస్తూ నా లక్ష్యం అంతా సమాజం మంచివైపుగా మారాలనేదే అని అంటారు. ఇక నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడ్డాక కథావస్తువును ఆకట్టుకునే రీతిలో అల్లుకుపోవడం వీరికి నల్లేరుపై నడకే.
                    వైద్యవృత్తిలో  తీరికదొరికితే చాలు కాస్త విశ్రాంతి లభిస్తుంది అనుకోకుండా దొరికిన విరామాన్ని సాహితీ సృజనకు వినియోగించడం ముదావహం. సమాజంలోని సమస్యాత్మక సంఘటనలెన్నిటికో  అక్షరతూణీరాలను గురిపెట్టడములోను వీరి హస్తవాసి ఎన్నదగినదే. అస్వస్థతకు చేదుగుళికలే పరమౌషధం కదా!

          సాహితీవనంలో ఆమె పూయించిన సాహితీసుమాలు ఎన్నో,ఎన్నెన్నో! అన్ని ప్రక్రియలలోను తనదైన బాణీని వినిపించారు.ఆకాశవాణిలో సైతం తన కథాసరిగమలను వినిపించారు.విజయవాడ ఆకాశవాణి కేంద్రంనుండి ప్రసారమైన  శాపవిమోచనంగుండె తడి చేసే కథ . కూతురు స్నిగ్ధ కన్నులనుండి జారిన నిర్మలమైన కన్నీటి బొట్టును పితృప్రేమలా అభివర్ణిస్తూనే ఆ కన్నీటి చుక్క తండ్రి ఉత్తరాన్ని తడిచేసిందనడం కథా ఎత్తుగడను తెలుపుతుంది. తండ్రి ఆవేదనను,తాపత్రయాన్ని,కూతురి అసహాయతను  చెప్పకనే చెప్తుంది కథాప్రారంభం . తండ్రి కూతుళ్ల అనుబంధానికి పూడ్చలేని గండి ఎక్కడో  పడే ఉంటుందని అర్థమవుతుంది. ధనవిలువ మాటున మనిషి కూల్చివేస్తున్న విలువలను చిత్రిక పడతారు. మనిషి నడవడిలోని ఆరోహణ,అవరోహణలను సమంగా మీటి  మనిషి మనవలసిన విధమిదీ అంటూ ప్రవర్తనావళిని బీజాక్షరాలుగ కథలో  నాటుతారు.
                  ప్రేమ  అనే పదం ఆకర్షణకే అంకితం. గుర్తిస్తే...దాన్ని మించిన ప్రేమలు చాలావున్నాయి అంటారు జయప్రదగారు.  ప్రేమంటే ఇదే!...ఈ కథ చదివాక స్నేహబంధము ఎంత మధురము అన్న కవి మాటలు గుర్తుకురాక మానవు.సభ్యత   ముసుగులో గొంతు దగ్గర భద్రంగా దాచుకున్న నా కన్నీటి కుండ బ్రద్దలయింది అంటారు. కథ చదివిన పాఠకుడి గుండె ఘనీభవించిన నయాగరా అవుతుంది. చదువులేక అజ్ఞానంతో విషయపరిజ్ఞానం లోపించిన వారికి అవగాహన , చదువుకొనలేనివారికి విద్యాదానం, అమాయక తల్లులకు వాస్తవ పరిస్థితులు, ఆడపిల్లల పుట్టుకకు కారణం స్త్రీ  కాదని పురుషులలోని  వై క్రోమోజోమ్ మాత్రమే ఆడ లేదా మగ అని సెక్స్ ను నిర్ణయిస్తాయని.... ఇలా ఎన్నోఅంశాలు జయప్రదగారి కలం కథాకళి మనతో  కథాకేళి ఆడుకుంటుంది.              
               మానవజీవితం విభిన్న సంఘటనల సమాహారం. కొన్ని వింటాం, కొన్ని చూస్తాం. అయితే ఈ   జీవన వేగంలో  ఎన్నటినో త్వరగానే మరచిపోతాం  అయితే జయప్రదగారు మాత్రం  ఈ సంఘటనలను ఒడిసిపట్టుకుని తన స్పందనను సత్వరమే కవితగా,కథగా లేదా నవలగా మలచి పాఠకులకందిస్తారు. తీసుకున్న ఇతివృత్తం ఏదైనా మనల్ని కూచోబెట్టి చదివించగలిగే శైలి వీరి సొంతం. సమాజంలో తారసపడే వ్యక్తుల ప్రవర్తన మనసును కుదిపినపుడల్లా ఆమె హృదయం ఆవేదనా భరితమవుతుందని చెప్పకనే చెప్తాయి వీరి కథలు. నాకెందుకులే అనే ఉదాసీనతను దరికి రానీయక పరిష్కార దిశగా కథనాన్ని పరుగులు పెట్టిస్తారు. అన్యాయాలను,అరాచకాలను కథలలో, కవితలలో, నవలలలో పాత్రల ముఖతః సాక్షాత్కరింపచేస్తారు.ప్రక్రియ ఏదైనా కావచ్చు కాని పాఠకులను రసరమ్యగుళికలై అలరించే శక్తి వీరి రచనలలోని విశేషం. అక్షరాలు ఆమె మాటలను తు.చ తప్పకుండా ఆలకించి తమను తాము ఆవిష్కరించుకుంటాయి.  సమాజంపట్ల కాస్తయినా ఆలోచనలేకపోతే మనిషి మానవత్వంలోపించిన గాజుబొమ్మే! తేనెటీగల్లా  ముసురుకున్న ఆలోచనలు,  పేర్చబడ్డ అక్షర వల్మీకము! ఫలితంగా జయప్రదగారి కలం ఝళిపించిన ఆలకించే అక్షరం! ఇది నానీల సమాహారం.  వీటిలో ఆవిష్కరింపబడిన అక్షరసత్యాలు చెర్నాకోలై చురుక్కుమనిపిస్తాయి.నానీల సృష్టికర్త డా.గోపిగారు అందించిన స్ఫూర్తితో నానీలకు శ్రీకారం చుట్టానని చెప్పారు. కథకైనా,కవితకైనా నిశితమైన పరిశీలనే ఆయువుపట్టు. వృత్తి,ప్రవృత్తి జుగల్ బందీయై జయప్రదగారికి సమాజపోకడలపై చక్కటి అవగాహన, పరిశీలనాసక్తిని ప్రసాదించింది.
              రచయిత(త్రు)లెవరు తోచడంలేదని రాస్తూ కూర్చోరు.సమాజంపట్ల వారి దృక్పథంలో ఆర్తి,ఆవేదన నెలకొన్న కారణాన కలిగే స్పందన వారిని రచనవైపు పురికొల్పుతుంది. కథలు రాయడానికి అవసరమయే ముడిసరుకు విపణివీధిలో దొరికే వస్తువు కాదు. మస్తిష్కపు పుటలలో మరపడుతున్న ఆలోచనా నెగళ్లు తడబడుతూ, ఒరుసుకుంటూ,ఒకదానినొకటి తోసుకుంటూ అక్షరసేద్యంలో భాగస్వాములుకావాలని  ప్రయత్నిస్తుంటాయి. జీవితం కష్టసుఖాల కావిడే! అయితే సమతుల్యత లోపించి కష్టాలు మాత్రమే కాటువేస్తే మరపుమాటున నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తాము. తెచ్చిపెట్టుకున్న నిశ్శబ్దంమాటున  తాత్కాలికంగా నిద్రపోతాయి, కాదు నిద్ర నటిస్తాయి.నిద్ర వదిలిందా విస్ఫోటనమే! పరిష్కారంకోసం ఎదురు చూడవు.కోల్పోయిన జీవితానికి పరిహారం ఇవ్వగలరా అని  ఎదురు ప్రశ్నిస్తాయి. ఇదే వీరి రచనలలోని అంతర్వాహిని. ఘనీభవించిన శోకమూర్తులు ఈమె కథలలోని స్త్రీపాత్రలు. కథ ముగిసే సమయానికి పాఠకుల హృదయాలు ద్రవీభూతమవుతాయి.  వీరి రచనలు చదివిన పాఠకులు మనసును ముడుచుకుని కూర్చోలేరు. ఇక్కడే డా.జయప్రదగారి రచనా శిల్పం అక్షరశిలగామారి చదువరుల హృదయంపై పీఠంవేసి కూర్చుంటుంది. కథకు వస్తువు అనుభవాల ప్రేరణలే అయినా ఊహ సైతం ఊపిరిపోసుకున్న ఆలోచనానుభవమే కదా!
            మా తొలినాటి కథలు అని పరిచయం చేసిన కథలకు ముందుమాటగా తన తొలికథ చిరుప్రాయంలోనే మొగ్గతొడిగిందంటారు. కత్తిపట్టలేని నేను కలం పట్టానన్నారు. అనూహ్యంగా కథనరంగంపై కలంకవాతు చేస్తున్నారు. ఇక వీరి రచనలలో పురుడు పోసుకునే ప్రశ్నలెన్నో!  స్త్రీలపట్ల వివక్ష చూపేవారిని ఈమె గొంతు ఎలుగెత్తి ప్రశ్నిస్తుంది.స్త్రీల మనసులకే సొంతమైన సున్నితభావాలకు విలువనివ్వరేమని ఆవేదన చెందుతారు.  డా.జయప్రద గారు నవలలు కథలేకాక కవితలపై కూడా తన అనురక్తిని చాటుకున్నారు.  ప్రవహించే కాలం విభిన్న కవితాంశాలతో చదివినంతసేపు పాఠకులను  అంతర్ముఖులై మనసులోకి నడవమంటుంది. రచయిత్రిలో పెల్లుబికే భావపరంపర ద్రావకంలా గొంతుకలో దిగుతూ మన తీర్పు కోరుతాయి. స్త్రీ పురుష వివక్షపై ఈమె స్పందించిన తీరు ఘాటైన తిరగమోతే!

   అమెరికా,భారతదేశం భూగోళానికి అటు ఇటే కాని పరస్పర ఆకర్షణ మాత్రం అయస్కాంతమే! బాల్యమంతా పొదువుకున్న రెక్కలక్రింద నుండి  తొంగి చూచి  ఎగరడం నేర్చుకున్నాక నేరుగా వలసకేంద్రంలో దిగి అమ్మ,నాన్నలను కాని కట్టుకున్న ఇల్లాలినికాని కేవలం ఆర్థికాంశాలకే పరిమితం చేస్తే ఉద్భవించేది కవితకాదు అక్షరాల కొలిమి.

భరతగడ్డమీద పిల్లల్నికనడం...
అమెరికాకు దత్తతనివ్వడానికేనని తెలిసుంటే...
ప్రసవానికొక పునర్జన్మ నెత్తకపోదును
అని నిట్టూర్చింది ఆమె నిష్ఫల విశ్వాసం...
నీలో ప్రేమ భాండాగారం ఇంకిపోనంతవరకు
నీ పిల్లల స్వార్థానికి ఢోకాలేదు.....
అయినా ఆమె అథరాలు చిరునవ్వుని వీడవు
ఆమెను కమ్మిన మాయ కాష్టంలో కాలిపోదు
జయప్రదగారు తన కవితలలో ఆర్తి,ఆవేదన సమన్వయపరచి వినిపిస్తారు.రెండు విభిన్నాంశాలను  ఏకవాక్యంలో వ్యక్తీకరిస్తూ నేటి సమాజ పోకడను అక్షరాశ్రువులద్వారా నిరసిస్తారు.కవితలలో భావుకత అలరిస్తే వాస్తవికత ఆలోచింపచేస్తుంది.
ఇక ఆలకించే అక్షరం వీరు వెలువరించిన నానీల సంపుటి.
మంగళసూత్రాన్ని
పేనారుగాని
మనసుల్ని అల్లలేదు
విడాకులందుకే

మనిషి మనసు
అస్థిరం 
అది వేల స్పందనల
మధ్య మగ్గం

గుండె చెమర్చింది
అందుకే
నా వేళ్లకొసన
కవిత్వం పండింది  
నానీలనిండా జాలువారిన చమత్కృతి కదళీపాకమే! నానీలలోని విరుపుల మెరుపులన్నీ మనసును ఓ క్షణం ఉలిక్కిపడేలా చేస్తాయి. నానీల నిర్మాణంలోని సరళత మనసును పరిమళమై చుట్టుకుంటుంది.అందుకే వీరి నానీలు వేమన పద్యాల్లా నాలుకపై నర్తిస్తూనే ఉంటాయి.
డా.జయప్రదగారు నవలలను రచించారనడంకన్నా మనకు పరిచయస్తులైన వారినే మనకు తిరిగి గుర్తుచేసారనవచ్చు. మనం పాత్రలు మాట్లాడటం చూస్తాం. మనసుతో వింటాం.ఆ పైన మనం ఆ పాత్రలతో మమేకమై  అనుబంధాలను పెంచుకుంటాం.  ఇక నవలలలో ఈమెకున్న సౌలభ్యం అలవోకగా పురివిప్పి నర్తించే సంభాషణలే! పైగా ఎక్కడా అనవసర పాత్ర ప్రవేశించదు. అయితే పాత్ర కాలిడిందా  మనోవిశ్లేషణ మొదలవుతుంది. అలా తాకి వదలడంకాదు మనసులోని మర్మము తెలుసుకోమంటూ వెంటపడతాయి వీరు సృష్టించిన అక్షర శిల్పాలు. డా. జయప్రదగారు రచించిన  ఆమె నవల ఏ వాదానికీ లొంగని మానవతావాదానికి ప్రతీక. సరళంగా , సూటిగా సాగుతుందీ నవల. కథ అల్లికలో  మానవతకు పెద్దపీటవేస్తూ ఇతరులకు వెలుగుదారులు పరచే మదర్ థెరీసా బాటను నడిచేవారి మనోదేవాలయాన్ని దర్శింపచేస్తారు. పాఠకులముందు ఆమె కథ ఉంటుంది. కాని అది అద్దమై మన ఆలోచనలను ప్రతిఫలిస్తుంటుంది. నవల ముగింపు కథౌన్నత్యాన్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. మనస్తత్వాల చిత్రీకరణలో చెయ్యి తిరిగిన రచయిత్రి డా.జయప్రదగారు. వీరి వృత్తి వైద్యమే కాని అది తెరచిన కిటికీనుండి వీరు గాంచిన జీవన మూలాలు శృతిబద్ధంగా మీటిన కథోపనిషత్తయి మనలను అలరిస్తుంది. వారికివే నా ఆత్మీయతాభినందనలు.

                                                                                                                                                                     
  


Friday, February 24, 2012

సినిమాలు-స్త్రీ పాత్రలు

6 comments


గత సంవత్సరం ఆంధ్రప్రభ ఆదివారంలో నేను చేసిన పుస్తకసమీక్ష.

స్త్రీపాత్రలను తెరస్మరణీయం గావించిన రచన

కావ్యనాయికలు,కథానాయికలు,నవలానాయికలపై జరిగినంత విశ్లేషణ సినిమాలలో స్త్రీపాత్రలపై అంతగా జరగలేదనే చెప్పాలి.ఒకవేళ స్త్రీపాత్రలపై కొందరు స్పందించి కొంత అక్షరబద్ధం చేసినా అధిక శాతం సినీనాయికల పాత్ర చిత్రణకన్నా వారి వ్యక్తిగత జీవితచిత్రణపట్లే కుతూహలం చూపడం జరుగుతోంది.ఇటువంటి నేపథ్యంలో సినీసాహిత్యప్రస్థానంపై విమర్శనాత్మక విశ్లేషణను ముద్రించడానికి ఆర్థికసహాయమందించిన సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు వారికి నమస్సులర్పించడం న్యాయం.
ఏమి సినిమాలో ఏమో అని చిన్నచూపు చూసేవారు కూడా ఈ విశ్లేషణ చదివితే తమ అభిప్రాయాలను మార్చుకునే అవకాశం ఖాయం.బాగున్నా,బాగులేకపోయినా మొహమాటం మాటున మొహంమొత్తిన సినిమాను సైతం అందల మెక్కించి ఆహా,ఓహో అనడం ఆనవాయితీగా మారిన రోజుల్లో విమర్శనాత్మక గ్రంథంగా వెలువడిన ఈ పుస్తకం ఆకట్టుకునే అంశాలనెన్నింటినో చర్చించింది.
స్త్రీ పాత్రలేని కథలుండటం అరుదు. సమస్యలు,సరదాలు, సుఖాలు, కష్టాలు, నవ్వులు,కన్నీళ్లు ఇవన్నీ స్త్రీని అల్లుకున్న తీగలే.ఈ సున్నితమైన అంశాలు సినిమాలలో సమస్యలుగా చర్చింపబడినా పరిష్కారాలు మాత్రం వేళ్లమీద లెక్కింపవచ్చు.19వ శతాబ్దంలో మూగగా మన ముందు నిలిచిన సినిమాలు కాలక్రమేణా మనకే మాటలు నేర్పసాగాయి.తొలిరోజులలో పౌరాణికాలపై దృష్టి నిలిపినా క్రమక్రమంగా సాంఘిక సమస్యలపై దృష్టిసారించి సమాజంలో ఆశావహమార్పును నినదించాయి.ఈ చిత్రాలు స్త్రీల జీవిత పార్శ్వాలను పారదర్శకం చేసాయి.
సినిమా! మూడక్షరాల ఈ మంత్రోచ్ఛారణ మైమరిపింపచేసే దృశ్య మాధ్యమం.సినీవినీలాకాశంలో తారాతోరణాలెన్నెన్నో! సినీసంబంధిత విశేషాలను దిన,వార,పక్ష,మాస పత్రికలు వివరిస్తున్నా అవి కేవలం కథ,నటన,నటీనటులు ఇత్యాది వివరాలకే ప్రాధాన్యతనిస్తాయి.
డా.ఎ.సీతారత్నంగారు రచించి మనకందించిన ప్రముఖ తెలుగు సాంఘిక సినిమాలలో స్త్రీల జీవిత చిత్రణ ఆహ్వానించదగిన పుస్తకం. సినిమా నేపథ్యంతో రచనలు చాలా పరిమితంగా వస్తాయి. సినిమాలలో స్త్రీ పాత్రల జీవనవిధానాన్ని దర్శకులు చిత్రీకరించిన వైనాన్ని సమర్థవంతంగా సమీక్షించారు సీతారత్నంగారు. పరిపూర్ణత సాధించారనలేము కాని సమగ్రతకు కొదవలేదు.తన పరిధిలో వీలైనన్ని సినిమాలను చూసి,సినిమా కథలను చదివి ఉపయుక్తమైన అంశాలను వివరించారు.
సినిమా పుట్టుక,పరిణామం మొదలుకుని సినిమాలు, అందులోని పాటలపై ఆధారపడ్డ సెల్ ఫోన్, రేడియో,టి.వీలపై పక్షపాతంలేని పారదర్శకమైన సద్విమర్శ సినీ సాహిత్యంలో తొలివరుసన ఈ గ్రంథాన్ని నిలబెడుతోంది.పరిధి దాటని పరిమితులు పరిపూర్ణతను పెంచాయి.సకాలంలో సరైన విమర్శ అని పలికిన మృణాళినిగారు స్పృశించిన అంశాలకు స్పందిస్తే దీనికి కొనసాగింపుగా మరొక రచనకు నాంది పలకవచ్చు లేదా మరిన్ని పేజీలు పెరగొచ్చు.ఆనాటి సినిమా ప్రచారానికి జట్కా,రిక్షాలలో గ్రామఫోను పాటలు,కరపత్రాలు ఆధారం.
నేడు ఆడియో విడుదలలు,టి.విలలో లైవ్ కార్యక్రమాలు,ప్రీమియర్ షోలు వంటి వైవిధ్యభరితమైన ప్రచారాలు, ప్రసారాలు సినిమాలను నట్టింట కూర్చోబెడు తున్నాయి.ఇక సినిమా పత్రికలేకాక ఇతర వార్తాపత్రికలు, వారపత్రికలు సినిమాలపై సమీక్షలనందిస్తూ ఇతోధికంగా తమ గళాన్నివివరంగా వినిపిస్తున్నాయి.అయితే ఇవి సినిమా సమీక్షలకేకాని స్త్రీ పాత్రలను విశ్లేషించే చర్చా వేదికలు కావు.
సుదీర్ఘ సినీ ప్రయాణంలో గుర్తుంచుకోదగ్గ మైలురాళ్లు చక్కని చిత్రాలే.భక్తి భావాన్ని పెంపొందించే భక్తి సినిమాలు, కుతూహలాన్ని రేకెత్తించే జానపదాలు గుర్తుంచుకోదగ్గవే.కాని నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్ఫుటంగా చిత్రీకరించిన సినిమాలు మన మనసులను ఎన్నటికీ వీడిపోవు.ఈ కోవకు చెందినవే మల్లీశ్వరి,పెళ్లిచేసిచూడు,పెళ్లినాటి ప్రమాణాలు,డా.చక్రవర్తి, వెలుగునీడలు,బలిపీఠం,అంతస్తులు,మూగమనసులు,ముత్యాలముగ్గు వంటి చిత్రరత్నాలు.
1938లోనే వచ్చిన సినిమా గృహలక్ష్మి తాగుడుకు అలవాటుపడ్డ భర్తతో అనుభవించిన వేదనలను చూపించింది. 1940లో విడుదలైన సుమంగళి,1945లో నిర్మించబడ్డ స్వర్గసీమ ఆనాటి సామాజిక రుగ్మతలను ఎండగట్టాయి.సాంఘిక ప్రయోజనం నెరవేరితే అదే పదివేలుగా నిర్మించబడే ఆ నాటి సాంఘిక సినిమాలు,స్త్రీసమస్యలైన బాల్యవివాహం,పునర్వివాహం,వరకట్నం వంటి విషయాలకు పెద్దపీటే వేసాయి.ఆర్థిక అసమానతలతో పార్వతి(సావిత్రి) పాత్రలో బలైనతీరును దేవదాసు,సంఘం సినిమాలో సంఘాన్ని ఎదిరించే దమ్మున్న స్త్రీవాదిగా రాణి పాత్ర(వైజయంతిమాల), స్త్రీ ఓర్పును,నేర్పును సమన్వయపరచిన భార్యపాత్రలో అర్థాంగి సినిమా మొదలైనవి స్త్రీలవేదనలనేకాక స్త్రీ శక్తియుక్తులను ప్రదర్శించాయి.1962లో అఖండవిజయాన్ని మూట కట్టుకున్న గుండమ్మకథ, కులగోత్రాలు విభిన్న స్త్రీ పాత్రల సమాహారమే. స్త్రీపాత్రలోని గయ్యాళితనం కూడా మిగిలిన స్త్రీ పాత్రలనెంత ప్రభావితం చేస్తుందో తెలుపుతాయి ఈ చిత్రాలు.ఇక పదహారేళ్ల వయసు సినిమాలో లైంగికదాడిని ఎదుర్కొనే దిశగా స్త్రీ రాటుదేలడం, అమాయకుడిని అఖండుడిగా తీర్చిదిద్దిన తీరు పడతులు పరిశీలించతగిన అంశాలుగా అంతర్లీనమైన సందేశాన్ని వినిపించారు.త్యాగం తనవంతై తానే రాలిపోతుంది అనే త్యాగమయిగా గోరింటాకులోని స్వప్న (సుజాత)పాత్రలో స్త్రీ మానసిక సంఘర్షణను పతాకస్థాయికి తీసుకుపోయిన ఉదాత్తమైన పాత్ర అంటూ వర్ణించిన సీతారత్నంగారి దృష్టికోణం ఎన్నదగినది.ఇక ఈ నాటి ప్రేక్షకులను అలరించిన నువ్వేకావాలి, మనసంతా నువ్వే,ఆనంద్,గోదావరి సినిమాలు స్త్రీలోని ప్రేమను,లాలిత్యాన్నిమధురంగా మలిచిన పాత్రలు.విస్తృతి పరిధికిలోబడి,వేల సినిమాలలోని కొన్నిస్త్రీపాత్రలనే విశ్లేషించినా,సమాజంలో నాటి,నేటి స్త్రీల స్థితిగతులలోని మార్పులు అవగతమవుతాయి. ఈ పుస్తకాన్ని ఓసారి తెరచిచూస్తే కాలంతోపాటు ఎదిగిన సినీ చరిత్ర రీలులా గిర్రున తిరుగుతుంది.

Wednesday, January 25, 2012

కథాజగత్-మాతృన్యాయం

0 comments
మాతృదేవోభవ అనే పదానికి న్యాయం చేసిన కథ మాతృన్యాయం

మాతృన్యాయం-రచయిత: గంగా శ్రీనివాస్

ఈ కథకు సమీక్ష రాయడం ప్రారంభించిన రోజే కన్నవారిని కాదంటే భరణం కట్టాల్సిందే అనే వార్తను చదవడం తటస్థించింది. ఆదాయవనరులు,కుటుంబసభ్యుల సంఖ్యనుబట్టి మార్గదర్శకాలుకూడా జారీ చేసినట్లు వార్త చెప్తోంది.తల్లిదండ్రుల సంరక్షణ,వయోవృద్ధుల నిబంధనలు-2011 అమల్లోకి వస్తే తల్లిదండ్రులకిక అన్యాయమే జరగదు,పిల్లలు సేవలు చేస్తుంటే వారి పని ఇక కాళ్లూపుతూ కూర్చోవడమేనని అనుకుంటారేమో!

కథావస్తువును ఎంచుకునేటప్పుడు పాతవిషయాన్నికాక కొత్తదనానికై అన్వేషణ జరగడం సహజం.వృద్ధులైన తల్లిదండ్రులు-పిల్లల నిరాదరణ అన్నసమస్య నిత్యనూతనం కాదుకాని అదొక రావణకాష్ఠం.నేటియవ్వనమే రేపటి వార్ధక్యం కదా?అద్భుతమైన మార్పు ఆవిష్కరింపబడితే తప్ప ఈ విషయం పాతబడదు.మరి ఈ మార్పు ఎక్కడ ప్రారంభమవాలి? మనిషిలోనా?మనుగడలోనా?పిల్లలప్రవర్తనాతీరును,తల్లిదండ్రులపట్ల వారి ఉదాసీనతను సమాజం ఆక్షేపించాలా లేక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా?ఇలాంటి ప్రశ్నలెన్నిటినో లేవనెత్తిన కథలోని మలుపులు చూద్దాం.
న్యాయవాది రాఘవరావు నేరస్థుడిని శిక్షింపచేయడంలో తన వాగ్ధాటినే పదునైన కత్తిగా వాడటంలో దిట్ట.అటువంటి న్యాయవాది, తన పొరుగుననే వున్నవృద్ధదంపతులు దుర్గాంబ,అనంతపద్మనాభంలు కొడుకు ఇంట,కోడలిచేత పడుతున్న అగచాట్లను నిశితంగా గమనించేవాడు.ఆ నేపథ్యంలో వారి కొడుకు,కోడలిపై క్రిమినల్ నెగ్లిజన్స్ నేరంగా ప్రతిపాదించి,విధింపచేసే శిక్ష కఠినమైనదే అవుతుంది.
శారీరక బాధలకు పరిష్కారం వైద్యం.మందులు,సర్జరీలు అనారోగ్యాన్ని జయించలేనపుడు విముక్తిగా మరణాన్ని కోరుకుంటాడు మనిషి.అయితే మానసిక,శారీరక బాధేదైనా పిల్లల ప్రేమపూర్వక పలకరింపులే అమ్మానాన్నలకు చలివేంద్రం.ఇవి కొరవడిన అనంతపద్మనాభం తమ పుత్రుడు తమను శారీరక,మానసిక బాధలకు గురి చేస్తున్నాడని న్యాయవాది రాఘవరావు ద్వారా కోర్టుకు ఫిర్యాదు చేస్తాడు.ఇక కోర్టు వాతావరణాన్ని కథనానికి తగినట్లు చిత్రీకరించడంలో శ్రీనివాస్ గారు నూటికి నూరు శాతం సఫలీకృతులైనట్లే.
న్యాయవాది ఆస్తుల వివరాలు ప్రశ్నించినపుడు దుర్గాంబ తడబడుతుంది.ఆ తడమాటుకు తన చురచుర చూపులతో అనంతపద్మనాభం చురకలంటిస్తాడు.కథాశిల్పంలో ఈ ఎత్తుగడ కథాపఠనంపై ఉత్సుకతను పెంచింది.ముగింపుఎలా ఉంటుందోనన్న ఆతృతకు మొగ్గ తొడిగింది.తల్లిదండ్రులమీద దయలేని పుత్రులను చెదలతో పోల్చిన వేమన మానవత్వంలేని పుత్రులను కాస్తంత ఘాటుగానే విమర్శించాడు.అదే తనమాటగా నొక్కిచెప్పాడు న్యాయవాది రాఘవరావు.కొడుకుకోసం తమ ఆస్తులన్నీ కరిగించేసుకున్న దుర్గాంబ,అనంతపద్మనాభంల కొడుకు సాయికిరణ్ ను కఠినంగా శిక్షించాలని రాఘవరావు కోర్టును కోరడం సామాజి స్పృహ వున్న ఎవరిచేతనైనా ఆమోదింపబడే న్యాయమే.

డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ క్రాస్ ఎగ్జామిన్ కు ఉపక్రమించినపుడు దుర్గాంబ పేరు లలితమ్మగా మారడం కథాగమనానికేం అడ్డుకాలేదు.

మనవడు తేజను బడికి తీసికెళ్లినపుడు జరిగిన ప్రమాదంలో తేజ,అనంతపద్మనాభం ఇద్దరు గాయపడతారు.ఆ రోజు పుట్టినరోజు కూడా కావడంతో వేసిన కొత్తబట్టలు మట్టికొట్టుకుపోయి గాయాలైన తేజకు మందు రాస్తున్న కోడలు దివ్య దగ్గర, భర్తకు కూడా కాస్త మందు తీసుకోబోయిన అత్తను విసురుగా తోస్తుంది కోడలు.ఫలితం..గోడను గుద్దుకుని తల చిట్లి సొమ్మసిలి పడిపోతుంది దుర్గాంబ.ఈ సంఘటనే అనంతపద్మనాభాన్ని కోర్టు ముంగిట నిలిపింది.అయితే కోర్టులో దుర్గాంబ సమాధానాలు అందరిని ఆశ్చర్యపరిచే దిశగా సాగుతాయి.అటు కొడుకు ఇటు భర్త! ఎవరి పరువు భంగపడరాదు.వారిద్దరి మర్యాద తనపైనే ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు.భర్త బాధపడినా కొడుకు చిన్నబోయినా ఆమెకు బాధే!సమాజంలో జరిగే తప్పుకు సమాజం బాధ్యత ఉండదా?ఈ ప్రశ్న దుర్గాంబ సంఘర్షణలోనుండి ఉత్పన్నమవుతుంది.

ఒకప్పుడు పాఠశాలల్లో మోరల్ సైన్స్ పేరిట వారానికి ఒక పీరియడైనా వుండేది.కాని ఆ సమయాన్నికూడా లెక్కలు,కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటరు కబ్జా చేస్తున్నాయి.కాసులొచ్చే చదువులకే క్లాసులలో ప్రాధన్యత పెరిగి సమాజానికి ఉపయోగపడే పాఠాలు
మృగ్యమవుతున్నాయన్న నిజాన్నితల్లి దుర్గాంబ పాత్ర ద్వారా రచయిత చక్కగా వినిపించారు.

పెద్దలకు,పిల్లలకు నడుమ అత్మీయబంధమే గృహపాలనలోని మూలసూత్రంగా గుర్తింపునందుకున్ననాడు శ్రీనివాస్ గారి చేతిలో పురుడు పోసుకున్నఈ కథకు ఊపిరందుతుంది.చివరకు టి.వి. సీరియళ్లలోని అత్తా కోడళ్ల హింసనాదాలు కూడా మనుషులదారేకాక మనసులదారే తప్పేటట్లు చేస్తున్నాయి,నీతిపాఠాలు నేటి పిల్లలకు దూరమయాయంటూ దుర్గాంబ కార్చిన కన్నీరు కన్నతల్లులందరిదీ. ఆవేశంలో జరిగే అనర్థాలలో ఇది కాకతీళయంగా జరిగిన ఒక సంఘటనే తప్ప మరేమి కాదంటూ,ముందుగా పథకరచన జరగలేదన్న సూక్ష్మాన్ని హుందాగా తెలిపిన దుర్గాంబ మాటలు అందరిని మాటరానివారిని చేసాయి.కోడలి దురుసుతనానికి,కొడుకు నిర్లిప్తతకు తగిన శిక్ష పడాలని వాంఛించిన అనంతపద్మనాభం ఆవేశానికి దుర్గాంబ పలుకులు హిమవర్షమే!ఇక చివరకు వారి కొడుకు సాయికిరణ్ కు ఏ శిక్ష పడుతుందోనని ఆతృతగా చూస్తుంటే తల్లిదండ్రులను యాత్రలకు తీసికెళ్లమని న్యాయమూర్తి సూచించినపుడు శ్రవణకుమారుని కథ గుర్తుకు వస్తుంది.మరి అన్యాయానికి న్యాయం చేసిన మాతృన్యాయమూర్తి చేసింది సబబేనా అని ప్రశ్నించుకుంటే విభిన్నస్పందనలు వినిపిస్తాయి.ఎన్నివిన్నా చివరకు చెప్పగలిగేదొకటే....మాతృదేవోభవ!

సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకుని దాని వెనుకగల మూలకారణాలను దుర్గాంబ పాత్ర ద్వారా తెలియచేసి చర్చకు వేదిక కాగల అంశాలనెన్నింటినో మనముందుంచిన రచయిత గంగా శ్రీనివాస్ గారు అభినందనీయులు.
మాతృన్యాయం కథను క్రింద ఇవ్వబడిన లింకులో చదవండి.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/matrn-yayam



src="http://kinige.com/images/kinigebannerimage.png"border="0">

కినిగె తెలుగు పుస్తకానికి చిరునామా

Tuesday, January 17, 2012

సాహితీకడలికి అక్షరనీరాజనం సముద్రం!

2 comments
సముద్రం-కథా రచయిత:పాపినేని శివశంకర్

సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి?ఇదీ కథ ప్రారంభం!ఛాయిస్ లో వదిలేద్దామనిపించే ప్రశ్న.కథాగమనంలో లోతు తెలిసేకొలది జవాబుకు ఎదురుచూస్తూ అదే ప్రశ్న చర్విత చర్వణమై మనల్ని నిలదీస్తుంది.పాపినేని శివశంకర్ గారి కథనం నర్తించిన తీరు నల్లేరుపై నడకేయైనా సాహితీ భాండాగారంలోని అరిసెలు,గారెలు,బొబ్బట్లనదగ్గ సాహితీరుచులను చవిచూపిన రీతి మాత్రం అభినందనీయం.
తన స్నేహితుడైన వనమాలిలోకి సాహితీ ప్రవేశం చేసిన రచయిత తాను తడిమిన మైలురాళ్ల జ్ఞాపకాలతో పాఠకులను మమేకం చేస్తూ గావించిన కలం కవాతు కొత్తదనాన్ని సంతరించుకుని పఠనాసక్తిని,రచనానురక్తిని చిప్పిలచేసి సాహితీసౌరభాన్ని గుబాళింపచేసింది. శ్రీశ్రీ,తిలక్,చలం,షేక్సిపియర్ ఒకరా,ఇద్దరా!ఎందరో సాహితీ పిపాసులను అల్లనల్లన తడిమి సువర్ణాధ్యాయాన్ని కనులముందు సాక్షాత్కరింపచేయడం కథ విశిష్ఠతను ద్విగుణీకరింపచేసింది.
వృత్తిలో ప్రవృత్తిని మిళితంచేసి సామాజిక అవగాహనను ఒక సమాచారంగా కాక సృజనాత్మకంగా వనమాలి తన విద్యార్థులకు బోధపరచే విధానాన్ని వివరిస్తూ పాఠాలలోకికాక పుటలలోకి విస్తరించడం అనే వాక్య ప్రయోగం సముచితం,సందర్భయోగ్యం.పుస్తకంలో ఐక్యం కావడమంటే ఇదే.
రాహుల్ సాంకృతాయన్ ఓల్గాసే గంగా,ప్రేమ్ చంద్ రంగభూమివంటి సాహితీ సృజనకారులను వీరి కలం స్పృశించినవేళ చరిత్ర మనోయవనికపై చలనచిత్రమవుతుంది.
వుయ్ ఆర్ ది హాలో మెన్,వుయ్ ఆర్ ది స్టఫ్డ్ మెన్...టి.ఎస్.ఎలియట్ వేదనాక్షరాలు నేడు ఎల్లెడల కనబడుతున్న మనిషి డొల్లతనాన్ని,కృత్రిమ పూర్ణత్వాన్ని మరోమారు వనమాలి ముఖత పలికిన వైనాన్ని గుర్తు చేయడం నేటి సమాజ ముఖచిత్రాన్నిఅంజనం వేసి చూపడమే!
వనమాలి సహధర్మచారిణి కమలినిని పెళ్లి చూపులలో చూసినప్పుడు పరస్పర వివరాలగురించికాక అన్నా కెరినినా గురించే మాట్లాడినపుడే ఆమెకర్థమైంది అతడి జ్ఞాన దాహం.సాహితీ సముద్రాన్ని ఔపోసన పట్టేంత కాంక్షతో ఎదగడం రచయిత తడిమిన ప్రతి రచనలోను ప్రస్ఫుటమవుతుంది.సముద్రమంతా అల్లకల్లోలమైనా,తాను మాత్రం సాహితీ సముద్రాన్ని ఈదుతూ ఉండిపోవడం సామాన్యుల ఊహకందని విచిత్రం!అయితే మనిషిని తనలో కలిపేసుకున్న పుస్తకానికే అగ్రతాంబూలం.
ఇంట్లో పుస్తకాల అరలు,గ్రంథాలయంలో బారులు తీరిన పుస్తకాల బీరువాలు వనమాలిని పలకరించే నిత్య నేస్తాలు.మూర్తిమత్వమందిన పుస్తక రాశుల నడుమ మనుష్యుల మధ్యకన్నా మిన్నగా గడిపే వనమాలి అంశగల పుస్తకప్రియులు నేడు ఎందరో వున్నారన్నది అక్షరసత్యం.
ఎందుకు చదవాలి పుస్తకాలు అనుకునేవారిని చేష్ఠలుడిగి చూస్తాం!సాహితీ జీవనమే పరమావధిగా భావించిన వనమాలికి సన్మానం జరగడం అసాధారణమేమిగాదు.కాని ఇంతటి విజ్ఞానం తమను అందలమెక్కించలేదని,ఎప్పటికి క్రింది మెట్టు పైనే వున్నామన్న కూతురు విమల ఆక్రోశం,తండ్రిపై ఉక్రోషం ఆమె దృక్పథం దృష్ట్యా న్యాయసమ్మతమే అనిపించినా ఆర్థిక సోపానాలకేకాని జ్ఞాన సోపానాలకు విలువలుండవా ఈ సమాజంలో అని గుండె గుబులు పడుతుంది.దూరంగా ఉండీ మనసులు దగ్గరకాలేకున్న వారసులకు ధనసంపద మాత్రమే వారసత్వానికి పనికివచ్చి,జ్ఞానసంపద తాకరానిదైనపుడు వనమాలి స్థితప్రజ్ఞత ముఖేష్ పాటలో రచయిత పాపినేని శివశంకర్ గారు ఉటంకించడం..యహా పూరా ఖేల్ అబీ జీవన్ కా,తూనే కహా హై ఖేలా,చల్ అకేలా,చల్ అకేలా..హాట్సాఫ్!
స్టీఫెన్ హాకింగ్స్ బ్లాక్ హోల్స్ స్మాల్ యూనివర్స్ గురించి అవసానదశలోను ఆలోచించగల ఆసక్తి..ఆశక్తి!విభిన్నమార్గాలలో సాహితీ సముద్రం తను నడయాడిన దారిని మరింత విస్తృతపరుస్తూ మన జీవనంలో కోరుకున్నవారికి కోరినట్లు లభించినా ఏమవుతాయో ఈ పుస్తకాలన్నీ!అటు వనమాలిలోను నిర్లిప్తత! అతని తలగడ ప్రక్కనే పెర్కిన్స్ పుస్తకం,బోర్లాతెరిచిపెట్టి!మనసులో దుఃఖాన్ని ఎవరో ఏతమేసి తోడిపోసినా తీరనిబాధ పుంజీలు తెంపుకుంటుంది.కథాగమనానికి పాత్రల పరిధి స్వల్పమైనా కథనానికది కొదువకాలేదు. పఠనాసక్తిగల పాఠకులతో పంచుకోవాలనుకునే ఈ కథను సమీక్షకు ఎంచుకున్నాను.ఎటు చూసినా పుస్తకాల దొంతరలు! రెపరెపలాడుతున్న పుస్తకకెరటాలు అలలు అలలుగా చుట్టు కమ్ముకొస్తుంటే నిండు సాహితీ సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యగలం? వనమాలి పాత్ర ద్వారా పుస్తక ప్రియుల అంతరంగాన్నిసాహితీసముద్రంగా అభివ్యక్తీకరించిన రచయితకు ధన్యవాదాలు.
తురుపుముక్క-కథా జగత్ లో ప్రచురితమైన ఈ కథను క్రింద ఇచ్చిన లింకులో చదవగలరు.

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/samudram---papineni-sivasankar




src="http://kinige.com/images/kinigebannerImage.png" border="0" >

కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా