వృత్తి, ప్రవృత్తి కలగలసిన సాహితీ కలనేత డా. పెళ్లకూరు జయప్రదగారి సాహిత్యం.వారికి నా అభినందన చందనం!
వైద్యవృత్తిలో తీరికదొరికితే చాలు కాస్త విశ్రాంతి లభిస్తుంది
అనుకోకుండా దొరికిన విరామాన్ని సాహితీ సృజనకు వినియోగించడం ముదావహం. సమాజంలోని
సమస్యాత్మక సంఘటనలెన్నిటికో
అక్షరతూణీరాలను గురిపెట్టడములోను వీరి హస్తవాసి ఎన్నదగినదే. అస్వస్థతకు చేదుగుళికలే పరమౌషధం కదా!
సాహితీవనంలో ఆమె పూయించిన సాహితీసుమాలు
ఎన్నో,ఎన్నెన్నో! అన్ని ప్రక్రియలలోను తనదైన బాణీని వినిపించారు.ఆకాశవాణిలో
సైతం తన కథాసరిగమలను వినిపించారు.విజయవాడ ఆకాశవాణి కేంద్రంనుండి ప్రసారమైన ‘శాపవిమోచనం’ గుండె తడి చేసే కథ . కూతురు స్నిగ్ధ కన్నులనుండి
జారిన నిర్మలమైన కన్నీటి బొట్టును పితృప్రేమలా అభివర్ణిస్తూనే ఆ కన్నీటి చుక్క
తండ్రి ఉత్తరాన్ని తడిచేసిందనడం కథా ఎత్తుగడను తెలుపుతుంది. తండ్రి
ఆవేదనను,తాపత్రయాన్ని,కూతురి అసహాయతను
చెప్పకనే చెప్తుంది కథాప్రారంభం . తండ్రి కూతుళ్ల అనుబంధానికి పూడ్చలేని గండి ఎక్కడో పడే ఉంటుందని అర్థమవుతుంది. ధనవిలువ మాటున మనిషి కూల్చివేస్తున్న విలువలను చిత్రిక పడతారు. మనిషి
నడవడిలోని ఆరోహణ,అవరోహణలను సమంగా మీటి
మనిషి మనవలసిన విధమిదీ అంటూ ప్రవర్తనావళిని బీజాక్షరాలుగ కథలో నాటుతారు.
‘ ప్రేమ అనే పదం ఆకర్షణకే అంకితం. గుర్తిస్తే...దాన్ని
మించిన ప్రేమలు చాలావున్నాయి’ అంటారు జయప్రదగారు. ప్రేమంటే ఇదే!...ఈ కథ చదివాక స్నేహబంధము ఎంత
మధురము అన్న కవి మాటలు గుర్తుకురాక మానవు.‘ సభ్యత ముసుగులో గొంతు దగ్గర భద్రంగా దాచుకున్న నా
కన్నీటి కుండ బ్రద్దలయింది’ అంటారు. కథ చదివిన పాఠకుడి గుండె ఘనీభవించిన నయాగరా
అవుతుంది. చదువులేక అజ్ఞానంతో విషయపరిజ్ఞానం లోపించిన వారికి అవగాహన ,
చదువుకొనలేనివారికి విద్యాదానం, అమాయక తల్లులకు వాస్తవ పరిస్థితులు, ఆడపిల్లల
పుట్టుకకు కారణం స్త్రీ కాదని పురుషులలోని
వై క్రోమోజోమ్ మాత్రమే ఆడ లేదా మగ అని
సెక్స్ ను నిర్ణయిస్తాయని.... ఇలా ఎన్నోఅంశాలు జయప్రదగారి కలం కథాకళి మనతో కథాకేళి ఆడుకుంటుంది.
మానవజీవితం విభిన్న సంఘటనల సమాహారం. కొన్ని వింటాం, కొన్ని
చూస్తాం. అయితే ఈ జీవన వేగంలో ఎన్నటినో
త్వరగానే మరచిపోతాం అయితే జయప్రదగారు
మాత్రం ఈ సంఘటనలను ఒడిసిపట్టుకుని తన
స్పందనను సత్వరమే కవితగా,కథగా లేదా నవలగా మలచి పాఠకులకందిస్తారు. తీసుకున్న
ఇతివృత్తం ఏదైనా మనల్ని కూచోబెట్టి చదివించగలిగే శైలి వీరి సొంతం. సమాజంలో తారసపడే
వ్యక్తుల ప్రవర్తన మనసును కుదిపినపుడల్లా ఆమె హృదయం ఆవేదనా భరితమవుతుందని చెప్పకనే
చెప్తాయి వీరి కథలు. నాకెందుకులే అనే ఉదాసీనతను దరికి రానీయక పరిష్కార దిశగా
కథనాన్ని పరుగులు పెట్టిస్తారు. అన్యాయాలను,అరాచకాలను కథలలో, కవితలలో, నవలలలో
పాత్రల ముఖతః సాక్షాత్కరింపచేస్తారు.ప్రక్రియ ఏదైనా కావచ్చు కాని పాఠకులను
రసరమ్యగుళికలై అలరించే శక్తి వీరి రచనలలోని విశేషం. అక్షరాలు ఆమె మాటలను తు.చ
తప్పకుండా ఆలకించి తమను తాము ఆవిష్కరించుకుంటాయి.
సమాజంపట్ల కాస్తయినా ఆలోచనలేకపోతే మనిషి మానవత్వంలోపించిన గాజుబొమ్మే! తేనెటీగల్లా ముసురుకున్న ఆలోచనలు, పేర్చబడ్డ అక్షర
వల్మీకము! ఫలితంగా జయప్రదగారి కలం ఝళిపించిన ‘ఆలకించే అక్షరం’! ఇది నానీల సమాహారం. వీటిలో ఆవిష్కరింపబడిన అక్షరసత్యాలు చెర్నాకోలై
చురుక్కుమనిపిస్తాయి.నానీల సృష్టికర్త డా.గోపిగారు అందించిన స్ఫూర్తితో నానీలకు
శ్రీకారం చుట్టానని చెప్పారు. కథకైనా,కవితకైనా నిశితమైన పరిశీలనే ఆయువుపట్టు.
వృత్తి,ప్రవృత్తి జుగల్ బందీయై జయప్రదగారికి సమాజపోకడలపై చక్కటి అవగాహన,
పరిశీలనాసక్తిని ప్రసాదించింది.
రచయిత(త్రు)లెవరు తోచడంలేదని రాస్తూ కూర్చోరు.సమాజంపట్ల వారి
దృక్పథంలో ఆర్తి,ఆవేదన నెలకొన్న కారణాన కలిగే స్పందన వారిని రచనవైపు
పురికొల్పుతుంది. కథలు రాయడానికి అవసరమయే ముడిసరుకు విపణివీధిలో దొరికే వస్తువు
కాదు. మస్తిష్కపు పుటలలో మరపడుతున్న ఆలోచనా నెగళ్లు తడబడుతూ, ఒరుసుకుంటూ,ఒకదానినొకటి
తోసుకుంటూ అక్షరసేద్యంలో భాగస్వాములుకావాలని ప్రయత్నిస్తుంటాయి. జీవితం కష్టసుఖాల కావిడే!
అయితే సమతుల్యత లోపించి కష్టాలు మాత్రమే కాటువేస్తే మరపుమాటున నిద్రపుచ్చాలని
ప్రయత్నిస్తాము. తెచ్చిపెట్టుకున్న నిశ్శబ్దంమాటున తాత్కాలికంగా నిద్రపోతాయి, కాదు నిద్ర
నటిస్తాయి.నిద్ర వదిలిందా విస్ఫోటనమే! పరిష్కారంకోసం ఎదురు చూడవు.కోల్పోయిన జీవితానికి
పరిహారం ఇవ్వగలరా అని ఎదురు
ప్రశ్నిస్తాయి. ఇదే వీరి రచనలలోని అంతర్వాహిని. ఘనీభవించిన శోకమూర్తులు ఈమె
కథలలోని స్త్రీపాత్రలు. కథ ముగిసే సమయానికి పాఠకుల హృదయాలు ద్రవీభూతమవుతాయి. వీరి రచనలు చదివిన పాఠకులు మనసును ముడుచుకుని
కూర్చోలేరు. ఇక్కడే డా.జయప్రదగారి రచనా శిల్పం అక్షరశిలగామారి చదువరుల హృదయంపై
పీఠంవేసి కూర్చుంటుంది. కథకు వస్తువు అనుభవాల ప్రేరణలే అయినా ఊహ సైతం
ఊపిరిపోసుకున్న ఆలోచనానుభవమే కదా!
మా తొలినాటి కథలు అని పరిచయం చేసిన కథలకు ముందుమాటగా తన
తొలికథ చిరుప్రాయంలోనే మొగ్గతొడిగిందంటారు. కత్తిపట్టలేని
నేను కలం పట్టానన్నారు. అనూహ్యంగా కథనరంగంపై కలంకవాతు చేస్తున్నారు. ఇక వీరి
రచనలలో పురుడు పోసుకునే ప్రశ్నలెన్నో! స్త్రీలపట్ల
వివక్ష చూపేవారిని ఈమె గొంతు ఎలుగెత్తి ప్రశ్నిస్తుంది.స్త్రీల మనసులకే సొంతమైన సున్నితభావాలకు విలువనివ్వరేమని
ఆవేదన చెందుతారు. డా.జయప్రద గారు నవలలు
కథలేకాక కవితలపై కూడా తన అనురక్తిని చాటుకున్నారు. ప్రవహించే కాలం విభిన్న కవితాంశాలతో
చదివినంతసేపు పాఠకులను అంతర్ముఖులై
మనసులోకి నడవమంటుంది. రచయిత్రిలో పెల్లుబికే భావపరంపర ద్రావకంలా గొంతుకలో దిగుతూ
మన తీర్పు కోరుతాయి. స్త్రీ పురుష వివక్షపై ఈమె స్పందించిన తీరు ఘాటైన తిరగమోతే!
అమెరికా,భారతదేశం భూగోళానికి అటు ఇటే కాని
పరస్పర ఆకర్షణ మాత్రం అయస్కాంతమే! బాల్యమంతా పొదువుకున్న రెక్కలక్రింద నుండి తొంగి చూచి
ఎగరడం నేర్చుకున్నాక నేరుగా వలసకేంద్రంలో దిగి అమ్మ,నాన్నలను కాని
కట్టుకున్న ఇల్లాలినికాని కేవలం ఆర్థికాంశాలకే పరిమితం చేస్తే ఉద్భవించేది
కవితకాదు అక్షరాల కొలిమి.
భరతగడ్డమీద
పిల్లల్నికనడం...
అమెరికాకు
దత్తతనివ్వడానికేనని తెలిసుంటే...
ప్రసవానికొక పునర్జన్మ
నెత్తకపోదును
అని నిట్టూర్చింది ఆమె
నిష్ఫల విశ్వాసం...
నీలో ప్రేమ భాండాగారం
ఇంకిపోనంతవరకు
నీ పిల్లల స్వార్థానికి
ఢోకాలేదు.....
అయినా ఆమె అథరాలు
చిరునవ్వుని వీడవు
ఆమెను కమ్మిన మాయ కాష్టంలో
కాలిపోదు
జయప్రదగారు తన కవితలలో
ఆర్తి,ఆవేదన సమన్వయపరచి వినిపిస్తారు.రెండు విభిన్నాంశాలను ఏకవాక్యంలో వ్యక్తీకరిస్తూ నేటి సమాజ పోకడను
అక్షరాశ్రువులద్వారా నిరసిస్తారు.కవితలలో భావుకత అలరిస్తే వాస్తవికత
ఆలోచింపచేస్తుంది.
ఇక ‘ఆలకించే అక్షరం’ వీరు వెలువరించిన నానీల
సంపుటి.
మంగళసూత్రాన్ని
పేనారుగాని
మనసుల్ని అల్లలేదు
విడాకులందుకే
మనిషి మనసు
అస్థిరం
అది వేల స్పందనల
మధ్య మగ్గం
గుండె చెమర్చింది
అందుకే
నా వేళ్లకొసన
కవిత్వం పండింది
నానీలనిండా
జాలువారిన చమత్కృతి కదళీపాకమే! నానీలలోని విరుపుల మెరుపులన్నీ మనసును ఓ క్షణం
ఉలిక్కిపడేలా చేస్తాయి. నానీల నిర్మాణంలోని సరళత మనసును పరిమళమై
చుట్టుకుంటుంది.అందుకే వీరి నానీలు వేమన పద్యాల్లా నాలుకపై
నర్తిస్తూనే ఉంటాయి.
డా.జయప్రదగారు
నవలలను రచించారనడంకన్నా మనకు పరిచయస్తులైన వారినే మనకు తిరిగి గుర్తుచేసారనవచ్చు.
మనం పాత్రలు మాట్లాడటం చూస్తాం. మనసుతో వింటాం.ఆ పైన మనం ఆ పాత్రలతో మమేకమై అనుబంధాలను పెంచుకుంటాం. ఇక నవలలలో ఈమెకున్న సౌలభ్యం అలవోకగా పురివిప్పి నర్తించే
సంభాషణలే! పైగా ఎక్కడా అనవసర పాత్ర ప్రవేశించదు. అయితే పాత్ర కాలిడిందా మనోవిశ్లేషణ మొదలవుతుంది. అలా తాకి వదలడంకాదు
మనసులోని మర్మము తెలుసుకోమంటూ వెంటపడతాయి వీరు సృష్టించిన అక్షర శిల్పాలు. డా. జయప్రదగారు రచించిన ‘ఆమె’ నవల ఏ వాదానికీ లొంగని మానవతావాదానికి ప్రతీక. సరళంగా , సూటిగా సాగుతుందీ
నవల. కథ అల్లికలో
మానవతకు పెద్దపీటవేస్తూ ఇతరులకు వెలుగుదారులు పరచే మదర్ థెరీసా బాటను
నడిచేవారి మనోదేవాలయాన్ని దర్శింపచేస్తారు. పాఠకులముందు ‘ఆమె’ కథ ఉంటుంది. కాని అది అద్దమై మన ఆలోచనలను
ప్రతిఫలిస్తుంటుంది. నవల ముగింపు కథౌన్నత్యాన్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. మనస్తత్వాల
చిత్రీకరణలో చెయ్యి తిరిగిన రచయిత్రి డా.జయప్రదగారు. వీరి వృత్తి వైద్యమే కాని
అది తెరచిన కిటికీనుండి వీరు గాంచిన జీవన మూలాలు శృతిబద్ధంగా మీటిన కథోపనిషత్తయి
మనలను అలరిస్తుంది. వారికివే నా ఆత్మీయతాభినందనలు.
12 comments:
జయప్రద గారి రచనలపై చాలా చక్కని సమీక్ష. అక్షరమక్షరం హృదయాన్ని తడిమింది. వారి రచనలన్నింటిని చదివి చూస్తే తప్ప ఇంత చక్కని వ్యక్తీకరణ రాదు. చాలా ఆకట్టుకుంది .. అభినందనలు & ధన్యవాదములు ఉమాదేవి గారు .
జయప్రద గారి రచనలు నేను చదవలేదు. కాని మీ సమీక్ష అసాంతం ఆగకుండా చదివేసాను.మీ సమీక్ష చదివాక, జయప్రధ గారి రచనలు ఇంతకాలం ఒక్కటి కూడా చదవనందుకు కించిత్తు బాధపడ్డాను.తొందరలో ఆ పుస్తకాలు సేకరించి చదవాలి. చాలారోజులకు మంచి టపా తో ప్రత్యక్షం అయ్యారు. మీకు థాంక్స్ ఉమాదేవి గారు.
జయప్రద గారి రచనలు నేనూ చదివాను.ఆ రచనల మీద మీ సమీక్ష చాలా బాగుంది.
వారి గురించి వినడమే కాని వారి పుస్తకాలు చదవడం కుదరలేదు. మీ సమీక్ష చదివాక వెంటనే చదవాలనిపిస్తుంది.
రచయిత(త్రు)లెవరు తోచడంలేదని రాస్తూ కూర్చోరు. మంచిమాట.
కవితలన్నీ బాగున్నాయండి.
ఉమాదేవి గారూ, మునుపు పరిచయం లేని రచయిత్రిని గురించి మీ మాటల్లో చదవడం బాగుందండీ! చిక్కటి పరిచయం...ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. థాంక్యూ!
వనజగారు,నా సమీక్ష మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు సంతోషంగా ఉందండి.చదివినందుకు ధన్యవాదాలు.
వెన్నెలగారు,జయప్రదగారి రచనలు AVKF లో ప్రయత్నించండి.మీరు చదివినందుకు ధన్యవాదాలు.
మాలాగారు,సమీక్ష నచ్చినందుకు ధన్యవాదాలండి.
జ్యోతిర్మయిగారు,తప్పక చదవండి మానవతా మూలాలు మరచిపోనివ్వవు వారి రచనపై సమీక్ష నచ్చినందుకు ధన్యవాదాలండి.
లక్ష్మిదేవిగారు,నిజమే మరి! పురుడు పోసుకునే ప్రతి పదానికి ప్రసవ వేదన తప్పదు కదా!మీకు నా పదప్రయోగము నచ్చినందుకు ధన్యవాదాలండి.
మానసగారు,పరిచయంలోని చిక్కదనం మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు ధన్యవాదాలు.
Post a Comment