Wednesday, January 28, 2015
Sunday, October 12, 2014
Saturday, September 27, 2014
Wednesday, September 17, 2014
ప్రక్షాళన
24-9-2014 నవ్య సంచికలో నేను రచించిన కథ ప్రక్షాళన ప్రచురితమైంది.
బ్లాగ్మిత్రులు చదువుతారని చిన్న ఆశ.
http://www.navyaweekly.com/2014/sep/24/page22.asp
బ్లాగ్మిత్రులు చదువుతారని చిన్న ఆశ.
http://www.navyaweekly.com/2014/sep/24/page22.asp
Friday, July 18, 2014
Thursday, May 22, 2014
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
అక్షరమంటే అమితమైన ప్రేమతో మాధ్యమమేదైనా సరే అక్షర ఆవిష్కరణ చేయాలనుకునే నాకు జ్యోతి వెలిగించిన చిరుదివ్వె నా చిన్నిగుండె చప్పుళ్లు. మనసు పరుగిడినంత వేగంగా మనిషి పరుగులు పెట్టలేనపుడు మధ్యమధ్యలో చతికిలపడటం ఖాయం.ఈ మధ్య అదే జరుగుతోంది.అయితే ఈ రోజు నా బ్లాగు పదివేల వీక్షకులను దాటినట్లు చెప్తుంటే బాల్యం మనసును తాకిందేమో,ఉత్సాహం ఉరకలువేసి బ్లాగ్మిత్రులకందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Friday, May 2, 2014
గాజునది
ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురింపబడిన నా సమీక్ష.
మనసు గలగలలు వినిపించిన గాజునది
స్త్రీ బహురూపిణి. విభిన్న
పాత్రలను ఏకకాలంలో పోషించగలగడం ఆమెకున్న అసామాన్య శక్తి.అయితే తదనుగుణంగా స్త్రీ భావజాలం
కూడా త్రిడి ప్రింటర్ లోవలె ఏమూసలో కావాలంటే అలానే కావాలంటూ ముద్ర వేయడం
సబబనిపించుకోదు. శిలాలోలిత కలంపేరుగా లక్ష్మి రచించిన కవితా సంపుటి గాజునది.
స్త్రీ మనసును పారదర్శకం చేసే శీర్షిక గాజునది. శిలాలోలిత ఆలోచనా నెగడు
నిత్య జ్వలితం. అందుకే ఈ నిరంతర కవితా మెరుపులు.ఈ కవితా ఒరవడికి పేర్చబడ్డ కవితా శీర్షికలు స్త్రీల అసహాయతలకు, సమాజంలోని
అవాంఛనీయ పోకడలకు,మసిబారుతున్న మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనాలు.
గాజుబీకరులో బంధింపబడిన నీటి
చిత్రంలా కాక స్థిరీకృతమైన ఆకారాల్లో
జీవలక్షణాలను పుణికి పుచ్చకున్న భావజాలము కావాలని గాజునది లో చెప్పిన లోతైన
భావనాపటిమ కవితా వస్తువుపై శిలాలోలితకున్న పట్టు తెలుపుతుంది.తమదైన వ్యక్తిత్వంతో
కొత్త బాటను నిర్మించుకునే స్త్రీలు చేయి తిరిగిన శిల్పులే కదా!
గాజులగలగలలే కాదు గొంతుముడి
విప్పుకుని బయల్పడిన మాటల గలగలలు వినిపించిన గాజునది, రచయిత్రి నిశిత పరిశీలనా
శక్తిని,సామాజికాంశాల ఆసక్తిని స్ఫటికమై ప్రస్ఫుటింపచేస్తుంది.
జీవితంలో పైకెదిగి వృద్ధిలొకి
రావాల్సిన ఎందరి ఆశాసౌధాలనో బాంబు పేలుళ్లు కూల్చివేసాయి. తెగిపడ్డ సీతాకోక చిలుక
రెక్కలు కవిత చదివితే, మనసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతుంది.కాలమేఘాలు
కురిపించిన బాష్పగోళాలు గోకుల్ చాట్ పేలుళ్లు.వాటికి సశేషంగా మిగిలిన దుఃఖవీచికలు
ఇంకా మనసును తాకుతూనే ఉన్నాయి.
గాజుముక్కల వంతెన కవితలో
బ్రతుకు సమరాన్ని వర్ణిస్తూ గాజుముక్కలపై నడకేనని అనడం ఉపమానమే కాదు అమృతోపమానం.
నిజమే!ఆదమరచి నడిచామా గాజుముక్కలు కసుక్కున కాటేస్తాయి.
విరోధినామ సంవత్సరమైనా. వికృత నామ
వత్సరమైనా కాలం చెట్టుకు పూచిన కొత్త పువ్వులేనంటారు. ‘ కాలానికి కాళ్లు నొప్పి
పడినప్పుడల్లా ఓ క్షణమాగి కొత్త పేరుతో
నడుస్తుంటుంది’ అని చమత్కరించడం చిరునవ్వులు పూయిస్తుంది.కాలం పరచిన బాటలో
మీ కాలి బాట మీలోకే దారితీయాలని చెప్పడం
ఆత్మావలోకనమే.
మానవ హారం మరో చక్కటి కవిత.
మనిషిని మనిషిని కలిపి కుట్టేది మానవత్వం. ‘కలలెప్పుడు మానసిక ప్రపంచ కవాటాలే.
మనిషి గొంతు ముడి విప్పితే రాలేది మాటలే.అవే కలగలిసిన మానవత్వపు మూటలు’ అని చదివినప్పుడు బస్తాలలో
బంధింపబడిన మానవత్వాన్ని మూటలు విప్పి మానవాళిపై వెదజల్లాలనిపిస్తుంది.
కాంతి+కాంతి=చీకటి. చీకటి రేఖలపై కాంతిని ప్రసరించి స్త్రీ పురుష సమానత్వంలో
అహానికి వీడ్కోలు పలికితే బ్రతుకంతా వెన్నెల పుప్పొడే! మలినమైన మానవతా పరిమళం
మనిషితనానికి వీడ్కోలు పలికితే ఆర్థిక సంబంధాలు అగాథాలు సృష్టిస్తాయి.అని కాంతిని
స్త్రీ,పురుషులకు సంకేతపదాలుగా వర్ణించారు.
చలన సూత్రాలు.చదివితే కళ్లలో
అకాల వర్షమే! దేహాలు వదిలి వెళ్లినా వాళ్లు విదిల్చిన అక్షరాలు ఊతకర్రయి అక్షరపూలను శాశ్వతం చేసాయనడం, ఎందరో
సాహితీవేత్తలు కురిపించిన అక్షరాలకు
మోకరిల్లాలనిపిస్తుంది.
రోబో కవితలో, ‘ ప్రాణమున్న రోబోలం మనం.మనకై
మనం నవ్వం,మాటలాడం.కరుణించం, కలసిరాం. మననుంచి
ఎప్పుడో జారిపడిపోయిన పాదరసం బొట్టు మన మనసు’ అంటారు.అందుకే ఆ పాదరసపు బొట్టుకు పునఃప్రతిష్ట జరగాలంటారు.నిజమే! అమానుషత్వమే
తనువంతా ఆమ్లధారలా తడుపుతున్నవేళ మనసును తిరిగి ప్రతిష్టించుకోవాల్సిందే..
ఉత్తరం ఉరిపోసుకుంది.ఇది
అక్షర సత్యం. ‘ మనిషి మాటలు ఔట్ డేటెడ్. స్పర్శను,స్వరాన్ని కోల్పోతూ
అక్షరాలు చాటింగులు,సొరుగులు,గోడలు,ముఖ పుస్తకాలే ఇక మనకు మిగిలింది ’ అన్నా, మానవ పరిమళం
మనిషితనమొక్కటే అని చెప్పినా,ప్లాస్టిక్ పర్యావరణానికి
ముప్పని చెప్పడమైనా ఆమె దృష్టంతా మానవసమాజ శ్రేయస్సే!
Friday, March 14, 2014
నిశ్శబ్ద జలపాతాలు
2-3-2014 ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా సమీక్ష.

హోరెత్తిన నిశ్శబ్ద జలపాతాలు
పొత్తూరి జయలక్ష్మి రాసిన ప్రతికథ వెనుక
తిరోగమించే సమాజపోకడలపట్ల ఆవేదన బలంగా కనిపిస్తుంది.
మూఢనమ్మకాలు మనిషి లక్ష్యాన్ని అలక్ష్యంవైపు నెట్టి సాధించవలసిన విజయాలకు అడ్డుగోడలవుతాయి.ఆచారాలు
ఆచరణీయమే! అయితే మూఢాచారాలు మనిషినే కాదు మనసును కకావికలం చేస్తాయి. దీనికి
దృష్టాంతాలే నిశ్శబ్ద జలపాతాలు వినిపించిన హోరునాదం.అందులో అలవోకగా రచయిత్రి కలం
జాలువార్చిన కథాజలపాతాలు మన మనసులలో నిరంతరం ఉరకలు వేస్తూనే ఉంటాయి.
అన్ని మంచి శకునములే. చక్కటి కథ. ఊహలకు
రెక్కలు పొదిగి మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లవు ఈమె కథలు.మన ఇరుగు పొరుగు వారి
జీవితాలలో జరిగే సంఘటనలు వారినెలా ప్రభావితం చేస్తాయో చూసినట్లు,వినినట్లు మనకు
వివరిస్తారు. మంచి పనికి మంచి మనసుంటే చాలంటారు.పిల్లి ఎదురు పడ్డా దుశ్శకునమని
ఆందోళన పడటం మనిషిని మరింత భీరువును చేస్తుంది.ఇది అందరికీ తెలుసు కాని కథగా
చెప్తే సూదిమందులా సత్వరం పనిచేస్తుంది కదా!
అనుమానం దాంపత్య
జీవితానికి విషపు చీడలాంటిది.పరస్పర అనుమాన నివృత్తితో సంసారం స్వర్గమవుతుంది.మనసు
పాడింది సన్నాయి పాట కథ ఇదే చెప్తుంది.
ఇక నిస్సహాయుడు
కథలో నేటి సమాజ ముఖచిత్రం స్ఫష్టంగా గోచరిస్తుంది.ప్రేమగా పెంచుకున్న వృక్షాలను
నరికివేసి ఆ స్థానంలో ఇల్లు కట్టుకోవడం నేడు నిత్యవేడుకే!ప్రాణంలేని ఆత్మీయులు
ఫోటోలలో దర్శనమిస్తారు.ప్రాణంలేని చెట్టు గుమ్మంగా,అల్మైరాగా మిగులుతాయి.మనిషికి
మరణం ఒక జీవక్రియ కాని చెట్టుకు మాత్రం మరణం హత్యే అన్న రచయిత్రి మాటలు మనసున్న
మనిషికి రంపపుకోత!
పూలబంధం కథ మనసుల పుష్పరాగమే! ఇల్లుకట్టి
చూడు కథ ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి
అనుభవైకవేద్యమే. పులికన్న గిలి భయమెక్కువ ఉంటుంది. ఇల్లు కట్టడంలో వాస్తు ప్రధానం.
నమ్మినా నమ్మకపోయినా అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో వాస్తును అంతో ఇంతో పాటిస్తారు. వాస్తే
కాదు వాస్తవాలు గ్రహించడం కూడా అవశ్యమేనంటారు.
ఆర్థికమాంద్యం విసిరిన వలలో
గిలగిలలాడిన చేప వికాస్. అయితే బలైనది అతడి భార్య వికసిత.భర్తను చేరుకోగలనన్న ఆశతో
అమెరికాలో అడుగు పెట్టిన వికసితకు వికాస్ ముఖం చాటేస్తాడు.అయితే బేలతనం వదలి తన
జీవితానికి బాట వేసుకుంది వికసిత. వికసితవదనం కథలో వికాస్ ప్రవర్తనకు మూలకారణాలు
ఏవైనా అమ్మాయిలూ, బహుపరాక్! అనక తప్పదు.
తమకు ఎదురయే ఇబ్బందులకు మూఢనమ్మకాలను ఆశ్రయించి
మనసును సాంత్వన పరచాలనుకుంటారు. అది తాత్కాలికమేకాని శాశ్వత పరిష్కారం చూపలేదు.
కాలంతోపాటు మనము మారాలి. సాటివారిని మనతో సమానంగా చూసే అలవాటు చేసుకోవాలి
మానవత్వాన్ని మించిన మతంకాని కులంకాని లేదనే నిజం అమృతబిందువులు కథలో కురిసిన
అమృతమే!
కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నమవుతున్న
నేటి పరిస్థితులలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు,కనీసం తమను కన్నవారేవరో
తెలియని పసిపాపలు ఒకవైపు,తమ పొత్తిళ్లను వీడి వత్తిళ్లను కావలించుకున్న సంతానానికి
భారమైన వృద్దతల్లిదండ్రులు మరొకవైపు. వీరిని కలిపే ఆలోచనకు అనురాగపు పొదరిల్లు కథ
వేదికగా నిలవడం సత్సంకల్పం.
రచయిత్రి ముద్రించిన తొలి కథల సంపుటి
ఇది. దైనందిన జీవితంలో ఎదురయే విభిన్న వ్యక్తులు, వారిలోని వైవిధ్య
వ్యక్తిత్వాలు,వారి జీవితాలలో తారసపడే ఎన్నో సంఘటనల వైచిత్రి రచయిత్రిని
కథారచనవైపు పురికొల్పి వుండవచ్చు.అయితే వాటిని నేర్పుగా కథలుగా మలచి సమాజానికి
సంతసమేకాక,సందేశము మిళితము చేసి అందించడం సామాజిక స్పృహ ఉన్న వారికే సాధ్యం కదా.
అది జయలక్ష్మి కథలలో అంతర్లీనమైన జలపాతమే!
Tuesday, December 31, 2013
Sunday, December 29, 2013
చిత్రగ్రంథి
ఈ రోజు ఆదివారం ఆంధ్రప్రభలో చిత్రగ్రంథి కవితా సంపుటిపై నా సమీక్ష.
కవితారసాలూరిన చిత్రగ్రంథి
సుధామ జగమెరిగిన కవి,రచయిత, విశ్రాంత
ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణాధికారి. సాహితీప్రక్రియలన్నిటిలోను ప్రవేశమున్నప్పటికీ కవితాసరిగమల ఆలాపనకే పెద్దపీటవేసి ఆంధ్రప్రభ దినపత్రికలో కవికాలమ్ నిర్వహించిన ఈ
కవి కలం కవితాసుధాభరితమై ప్రశంసలనందుకుంది. సాహితీబాటలో కవిగా,రచయితగా, బహుపాత్రధారియైన
సుధామ మనముందుకు తెచ్చిన చిత్రగ్రంథి కవితా సంకలనం వస్తువైవిధ్యంతో అలరిస్తుంది.
ఇక ‘చిత్రగ్రంథి ‘లోకి ప్రవేశిద్దాం.తొలికవితకు
శీర్షికే ‘కవి(త) ప్రవేశం ’.
కలుషితమవుతున్న పర్యావరణం
మనిషిని ప్రకృతికి దూరం చేస్తోంది.
నీటిని గాలిని ధ్వనిని
క్షరముకాని అక్షరంగా
సహజసిద్ధంగా
స్వచ్ఛంగా నిలుపుకుంటే చాలు
మహిని,మనిషిని కూడా
రక్షించుకున్నట్లే. అంటూ పర్యావరణాన్ని రక్షించుకోవాలనే స్పృహను కలిగిస్తారు.
భూత,వర్తమాన,భవిష్యత్కాలాలను
సమన్వయపరచుకోవడమెలాగో స్వగతం-స్వాగతం కవిత మనకు వినిపిస్తుంది.
గతాన్ని వర్తమాన కవ్వంతో
చిలికి భవిష్యత్తు మీగడను పైకి
తేల్చడమే ముఖ్యం అనడం కవి దార్శనికత మూడు కాలాలకు విస్తరించడమే.
జీవితంపై ఆశ ఉద్దీపన కావాలి
కాని అంతం కాకూడదు.
‘జీవితేచ్ఛ’ కవితలో ఆశలు
నిర్మించేవాళ్లు గోడలను కొలుస్తారంటారు. అవరోధాల గోడలనధిగమించాలి. మృత్యుశ్వాసనధిగమించి
జీవితేచ్ఛ పరిమళించాలి.బ్రతుకుపై నిరాశకు వీడ్కోలు పలికే కవిత.
‘అగ్నినగ్నీకరం’ కవిత భగ్గుమనే
హృదయావేదనను ప్రతిఫలిస్తుంది. నగిషీకరించడంకాదు నగ్నీకరించినపుడు అది అగ్నీకరణమన్న
కవి భావుకత కవితావేశాన్నందిస్తుంది.
మనిషి మానుషాన్ని మటుమాయం
చేస్తున్నాడు. మానవ ప్రకృతిని మానవుడు ధరించేలా చెయ్యి.జీవనగీతం రానివ్వమని ‘కొత్త పల్లవి’ పాడుతారు.
ఉల్లితరిగినప్పుడు
కన్నీళ్లులా ….పఠిత సజలనేత్ర కావాలి అనడం హృద్యంగా ఉంది.
‘విలువ’ శీర్షికన రాసిన కవిత అమూల్యమైనదే. మెట్లపై మనిషి జారి
పోవడం కాదు,నేడు మెట్లే జారిపోతున్నాయి.
వినిమయ విపణి వీధిలో మనిషే
వస్తువై, మారిన ప్రపంచానివే విలువలు కాని వ్యక్తిత్వ ప్రపంచానివి
కావు అనడం ఈ కవికి మానవతా విలువలపైనున్న ఆర్తిని ప్రస్ఫుటింపచేస్తుంది.
చితిలోను చ్యుతిలేని వృద్ధాప్యం
బ్రతుక్కీ,మృత్యువుకి మధ్య
చివరి జాప్యం.
చివరి జాప్యంలో మారుతున్న
విలువలలో మనిషీ మారకద్రవ్యమే అని సూటిగా చెప్పడం గుండెలో నాటుకుని కళ్లను
తడుపుతుంది.
ఆకాశవాణినుండి
కవితావాణిదాకా సుధామ మీటిన మైలురాళ్లు సాహితీబాట లోని పథికులకు మార్గనిర్దేశనాలే
అనడంలో అతిశయోక్తి లేదు.
ఏదో నాలుగు కవితలు రాసేసాం,
కలం మూసేసాం అనుకోకుండా విలక్షణత,వస్తువైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చిన
కవితా పఠనం ఉత్సుకతను ఉద్దీపన కావిస్తుంది. ‘ చిత్రగ్రంథి ’ కవితా సంకలనం మనసును ఉరకలేయించడమేకాదు అదుపు తప్పిన సమాజపోకడలకు చురకలు వేస్తుంది.చిలికేకొద్ది చిక్కనైన
కవిత్వం తొంగి చూచిన ప్రతి పాఠకుడిపై చిలకరించిన
చల్ల పలుకై పలకరిస్తుంది. ఆలోచన, అవగాహన, రమ్యతకు తగిన సమతుల్యత మాటల పటాటోపంకాక
పదాల పల్లవింపులు సహజత్వానికి దగ్గర దారై మన దరిదాపులలోనే కవి నిలుచుని మనతో కవితా
కబుర్లు చెప్తున్నట్లుంటుంది .మనసును హత్తుకున్న కవితేదయినా ఆ కవితాస్రష్టను
కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది.
Sunday, December 22, 2013
పిలవని పిలుపు
గోతెలుగు.కాం లో నేను రచించిన కథ ఈ క్రింది లింకులో చదవమని మనవి.
http://www.gotelugu.com/issue37/1024/telugu-stories/pilavani-pilupu/
గోతెలుగు.కాం వారి సౌజన్యంతో.
http://www.gotelugu.com/issue37/1024/telugu-stories/pilavani-pilupu/
గోతెలుగు.కాం వారి సౌజన్యంతో.
Sunday, December 15, 2013
జూలియస్ సీజర్
ఈ రోజు 15-12-2012 ఆదివారం ఆంధ్రప్రభలో నా సమీక్ష.
లక్ష్మీకాంత మోహన్ అనువదించిన మరో
చక్కటి నాటకం జూలియస్ సీజర్.విలియం
షేక్స్ పియర్ చిత్రిక పట్టిన ఆనాటి సమాజస్థితి గతులను తరచి చూడాలంటే చరిత్ర,సాహిత్య
పఠనమే రహదారి.చదివిన సాహిత్యానికి దృశ్యీకరణ రసానుభూతికి రాచబాట.అయితే నటన ద్వారా
మనం చలనచిత్రాలలోని సన్నివేశాలకు స్పందిస్తాం
కాని నాటక ప్రదర్శనలో ఈ అనుభూతికి మించిన
ఆనందం సాక్షాత్కరిస్తుంది. కారణం ప్రత్యక్షంగా కనబడే పాత్రధారులు.వినబడే
గాత్రం,అలరించే హావభావాలు.జీవితమనే నాటకరంగంలో మనిషి జీవనం రంగుల రాట్నమే.
జూలియస్ సీజర్
నాటకానికి వేదిక రోము నగరం.ఆ తర్వాత సార్థిస్,ఫిలిప్పీ వస్తాయి. రోమన్ సామ్రాజ్యం
పతనావస్థకు చేరినపుడు జూలియస్ సీజర్ పాత్ర
ప్రవేశిస్తుంది.న్యాయానికి అన్యాయం, మంచికిపోతే చెడు ఎదురైంది అనడం వింటుంటాం.అది
సర్వసామాన్యంగా జరిగేదే!మంచికి చెడుకు నిత్య సంఘర్షణే. సీజర్ పరిపాలనలో అదే
జరిగింది. సీజరుకు వ్యతిరేకంగా పనిచేసి అతడిని అంతమొందిస్తే అతడికి తల ఒగ్గక బ్రతకవచ్చుననుకుంటాడు
కేషియస్.అందుకు తన మిత్రుడైన బ్రూటస్ తో సంప్రదింపులు జరుపుతాడు.
సీజర్ భార్యకు వచ్చిన పీడకల సైతం సీజరును
భయపెట్టదు.అమాయకత్వాన్ని స్వార్థమెపుడు మాయ చేస్తూనే ఉంటుంది.విజయోత్సవంలో
పొంగిపోతున్న సీజరును అప్రమత్తంగా ఉండాలని చేసిన హెచ్చరికలు అతడిని కాపాడలేకపోయాయి. నమ్మిన
స్నేహితుడు బ్రూటస్ సైతం సీజరుపై కత్తిదూసినపుడు ‘యు టు బ్రూటస్!’ అని ప్రాణాలొదులుతాడు సీజరు. నమ్మినవారు మోసం
చేసినపుడు ఈ నాటికి ఎక్కడో ఓ చోట వినబడుతుందీ మాట!
ఇక అనువాదంలో
ఇమిడిపోయిన తెలుగు పలుకుబడుల ద్వారా నారికేళపాకాన్ని కదళీపాకం చేసి అందించిన రచయిత
అభినందనీయుడు.
రచయితగా,కవిగా
స్వయంప్రకాశకుడు ఈ అనువాదకర్త.విలియం షేక్స్ పియర్ రచనలు వసివాడని నిత్య పారిజాత
సుమాలు.అదే స్ఫూర్థితో అనువదించబడ్డ పదిహేను నాటికలు కూడా రంగస్థల వేదికపైనే కాదు పాఠకుల హృదయ వేదికపై కూడా సుగంధభరితం కావాలని ఆకాంక్షిద్దాం.
Sunday, December 8, 2013
తుఫాను
ఈ రోజు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో తుఫాను నాటికపై నా సమీక్ష.
నేటికీ
మరపురాని నాటి నాటికలు
విలియమ్ షేక్స్ పియర్ ఆంగ్ల సాహిత్యాభిమానులకు
ఆరాధ్యుడు.సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, వారి మనోభావాలను పదునైన చమత్కృతితో నాటకీకరణ గావించి
రంగస్థలానికి తను రచించిన నాటికలను ఆభరణాలుగా ఒసగిన మహాకవి. తాను మరణించినా తన
నాటకాలకు చిరాయువు ప్రసాదించిన రచయిత షేక్స్ పియర్. అట్టి రచనలను తనదైన శైలిలో
మాతృకలోని మాధుర్యం చెడకుండా అనువదించారు పమిడిముక్కల లక్ష్మీకాంత మోహన్ గారు. ఇతనిలోని
కళాకారుడు విభిన్నరూపాలలో అలరించాడు. విద్యార్హతలు కళాపిపాసకు కొలమానాలు కానేరవు. తగిన
గుర్తింపు దొరికినపుడు రచయితకు గాని,నటుడికిగాని ప్రాణవాయువందుతుంది.అదే మరిన్ని మంచి
రచనలకు ఆయువుపట్టవుతుంది.
కావ్యేషు నాటకం రమ్యం
అంటారు.నాటికలలో సమకాలీన అంశాలను పరిగణలోనికి తీసుకున్నపుడు ఆనాటి రాజరికాలలోని
నిరంకుశత్వాన్ని, భూస్వాముల పెట్టుబడిదారీతనాన్ని,ప్రజల కడగండ్లను కళ్లకు
కట్టినట్టు చిత్రీకరించిన షేక్స్ పియర్ రచనలను తెలుగు పాఠకులకు అందించిన లక్ష్మీకాంత
మోహన్ అభినందనీయులు.
ఇక నాటకాలలోనికి వస్తే ముందుగా తుఫాను నాటకాన్ని
చూద్దాం.కథకు రంగం ఓడ,దీవి. ఆనాటి పరిసస్థితులకు అనుగుణంగా పాత్రలను సృష్టించి
మనల్ని ప్రేక్షకులు గావించిన కథాగమనం.రాజ్యకాంక్ష చిరాయువు.మోసం, కుట్ర, ద్రోహం
ఆయుధాలుగా మరింత ఊపిరి పోసుకుంటుంది. ‘తుఫాను’ నాటకంలో అదే జరిగింది .
ప్రాస్పెరో తన కూతురు మిరాండాకు తన తమ్ముడు ఆంటోనియో తనకు
చేసిన ద్రోహాన్నివివరిస్తాడు. నేపుల్స్ రాజుకు కప్పంకట్టి, అతని కనుసన్నలలో మెలగి అతడి ద్వారా
తన అన్నను సింహాసనం నుండి దించి సముద్రంలో
ఒక ఓటి పడవలో వదిలిపెట్టమని చెప్తాడు అంటోనియో.అయితే గాంజలో అనే వృద్ధుడు వీరికి తగినంత ఆహారమిచ్చి సహాయపడతాడు.
ఏరియల్ అనే భూతశక్తి ద్వారా సముద్రంలో తుఫాను రేపుతాడు ప్రాస్పెరో.జరిగిన
అన్యాయానికి ఓడపైనున్నతన ప్రత్యర్థులను భయభ్రాంతులను చేస్తాడు.అయితే వారిని
సముద్రానికి అర్పణ చేయడు.తుఫాను ఎలాగైనా ఉపశమింప చేయమని కోరిన కూతురికి ఏమీకాదన్న
భరోసా ఇస్తాడు.
ఫెర్డినాండు సముద్రంలో
మునిగి పోకుండా ప్రాస్పెరో ఉన్న గుహ దగ్గరకు చేరుకుంటాడు.తన మనసులో రూపు
దిద్దుకున్న ప్రణాళిక రచింప ప్రారంభిస్తాడు ప్రాస్పెరొ. ఫెర్డినాండు మరణించాడనుకుని అటు
మిలాన్ కు,ఇటు నేపుల్స్ కు రాజులవాలని ఆంటోనియో,సెబాస్టియన్ ఉవ్విళ్లూరుతారు.వారి
ఆలోచనకు ఏరియల్ అడ్డుపడుతాడు.
విభిన్న మలుపులు తిరిగి చివరి అంకంలో
మిరాండా,ఫెర్డినాండు ఒకటై రాజ్యాధికారులవుతారు.ఈ సుఖాంతానికి షేక్స్పియర్ రసరంజకంగా
తిప్పిన మలుపులను అంతే సహజంగా చక్కటి సంభాషణలతో,తెలుగు పలుకుబడులతో అలరింపచేసారు
లక్ష్మీకాంత మోహన్..
ఈ నాటకం మనదేశానికి సంబంధించిన ఇతివృత్తం కాకున్నా,రాసి శతాబ్ధాలు గడిచినా ఇంత ఆసక్తికరంగా వుందంటే ఇదెంత విశ్వజనీనమైందో అర్థమౌతుంది.
Thursday, December 5, 2013
నెట్ నేస్తం...
ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన నా వ్యాసం.
మా అబ్బాయికి ఆరేండ్లే
అయినా కంప్యూటర్ ఆవులిస్తే చాలు పేగులు లెక్కపెడతాడు అని మురిసిపోతారు కొందరు తల్లిదండ్రులు.మా అమ్మాయికి ల్యాప్ టాప్ వుంటే చాలు ఇల్లు దాటదు.తమ కనుసన్నలలోనే
ఉన్న పాపాయి తమ నీడలో క్షేమంగా ఉందనుకుంటారు అమ్మానాన్నలు.నిజమే! కంప్యూటర్ వచ్చాక
కలానికి,కాగితానికి విశ్రాంతి పలికింది.అన్నీ ఆన్ లైన్ లోనే! ఎన్నోవిషయాలను,విశేషాలను
అడగడం ఆలస్యం అడిగినవి,అడగనివి కూడా మనముందుకు తెస్తుంది.పాఠ్యాంశాలు పెరిగేకొలది
డిక్షనరీ,వికిపీడియా,కంప్యూటరు సంబంధిత పాఠాలు వంటివెన్నోతమ పిల్లలు వినియోగిస్తూ
పదుగురితో చర్చిస్తుంటే ఆ ఇంటి పెద్దలు ఆశ్చర్యపోతూ సంబరపడిపోతారు. విస్తృతమైన
సాంకేతిక పరిజ్ఞానం ఈ నాటి పిల్లలకు అందుబాటులోకి రావడం మంచిదే.అయితే ఆ మంచిని
మించి మనిషిని నిలువునా ముంచే
వలలో,అదేనండి నెట్లో అదే పనిగా చిక్కుకుంటే చిక్కుముళ్లు పడినట్లే!
తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుకు దోహదపడేందుకు తాహతుకు
మించినదైనాసరే కావలసిన డెస్క్ టాప్,ల్యాప్ టాప్,ఐప్యాడ్ వంటివి కొనిస్తారు.తమ
అవసరాలను సైతం వాయిదా వేసుకుంటారు.విషయ సముపార్జనకు నెట్ కనెక్షన్ తప్పనిసరి.కాని నెట్
బ్రౌజింగ్ ఒక వ్యసనంగా మారితే మాత్రం ప్రమాదమే!మానసిక వైద్యంలో నిత్య చర్చావేదిక ఈ
నెట్ అడిక్షన్.అసలు ఇంటర్నెట్ ఎలా వాడాలో తెలియని వారు కడకు దానికే అంకితమై ఆ వలలో పూర్తిగా
ఇరుక్కుపోవడం లక్ష్యసాధనలో పెద్ద అవరోధం.తత్ఫలితంగా చదువు,పరీక్షలు అంటే
విముఖత,నలుగురిలో కూర్చుని మాట్లాడాలంటే నిరాసక్తత పెరుగుతాయి.సామాజిక వెబ్
సైట్లపై ఉండే ఆసక్తి,కుటుంబసభ్యుల విషయంలో ఉండకపోవడం మొదలై,ప్రమాద ఘంటికలు
మ్రోగుతున్నా పెద్దలు గమనించలేకపోవడం దురదృష్టకరం.
సమాచార సేకరణ జీవితానికి బంగారు బాట వేయడానికి మైలురాయిగా
ఉపయోగపడాలి కాని అవాంఛనీయ విషయానురక్తి బ్రతుకు చిత్రాన్ని చిధ్రం చేస్తోంది.సామాజిక
సైట్లలో అనుభవాలు,అనుభూతులు పంచుకోవడంలో నియంత్రణ ఉండాలి.నిద్రలేమి లేదా
అతినిద్ర,చిరాకు,విసుగు,బద్ధకం,తిండి మానేయడం లేకుంటే అదే పనిగా తినడం వంటివి
శారీరక రుగ్మతలుగా అనిపించినా, మానసిక వికారాలు పెంచే వల వ్యామోహానికి పిల్లలను
దూరంగా ఉంచడమే మేలు.
ఇక కాస్త పెరిగిన యువతీ యువకులకు మంచి పనే
చేస్తున్నాం,కనీసం ఇలా అయినా స్నేహాలు పెరుగుతున్నాయి కదా అనిపించడంలో ఆశ్చర్యపడనవసరం
లేదు .కాని వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడం,తీసిన లేదా తీసుకున్న ప్రతి ఫోటోను అప్పటికప్పుడు
అప్ లోడ్ చేసెయ్యడం,అందరితో పాస్ వర్డ్ షేర్ చేసుకోవడం వంటివి కూడదని
హెచ్చరించవలసిన బాధ్యత పెద్దలదే.ఫోనైనా,కంప్యూటరైనా కనబడ్డ ప్రతి సాఫ్ట్ వేర్ ను
డౌన్ లోడు చేసెయ్యడం,ప్రతి కొత్త యాప్ ను వాడాలనుకోవడంలో కాస్త తరచి చూచి
అడుగెయ్యాలి.లేదంటే వైరస్ బారిన పడి మన సమయాన్ని,ఢబ్బును వృధాపరుస్తాయి.
ఈ నేపథ్యంలో పిల్లలేం
చేస్తున్నారో పెద్దలు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.మీకు తెలియదు,మీకు
రాదు,మీకర్థం కాదు అని పెద్దవాళ్లు దగ్గరికొస్తే తరిమేస్తూ, కంప్యూటరు కిటికీలను
మూసేసారంటే తస్మాత్ జాగ్రత్త అనక తప్పదు. విషయ అవగాహన పెంచుకుంటున్నామన్న
మిషతో వలలో పడితే మాత్రం అది మనిషిని సైతం
పతనమనే వైరస్ కు బలి చేస్తుంది.
Sunday, December 1, 2013
వెనిస్ వర్తకుడు
ఈ రోజు(1-12-2013) ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ప్రచురితమైన నా సమీక్ష.
చిన్నతనంలో ఆకట్టుకున్నకథలు, నాటికలు మనఃఫలకంపైనుండి చెరిగిపోవు.అయితే ఇప్పటికీ
రంగస్థలంపై ప్రదర్శించబడే ఇటువంటి నాటికలు
షేక్స్ పియర్ ప్రతిభకు అద్దం పడతాయి.లక్ష్మికాంత్ మోహన్ అకుంఠిత దీక్షతో
అనువదించిన నాటికలలో అహ్లాదకరమైన రచన వెనిస్ వర్తకుడు.
వెనిస్
నగర వర్తకుడు ఆంటనియో.అతడు చేసేది వాణిజ్యమే కాని వ్యక్తిగా ప్రేమాన్వితుడు, దయార్ద్ర హృదయుడు. అతని
స్నేహితుడైన బసానియో పోర్షియాను వివాహమాడాలనుకుంటాడు.అయితే ఆమె స్థాయికి
తగినట్లుగా వుండాలంటే అప్పు చేయాలి. ఆంటనియో అతడు కోరిన పైకం ఇవ్వలేక షైలాక్
దగ్గరకు తీసుకుని వెళ్తాడు.అధర్మానికి,కుటిలత్వానికి షైలాక్ ప్రతీక. దుష్ట ఆలోచనతో
అప్పు ఇచ్చిన షైలాక్ మూడు నెలల గడువులో అప్పు తీర్చకపోతే ఆంటనియో శరీరంనుండి ఒక
పౌండు మాంసాన్నినష్ట పరిహారంగా కోరుతాడు.మానవ సహజమైన అసూయ ఇలాంటి వింత కోరికకు
అంకురం తొడుగుతుంది.
నాటిక రెండవరంగం బెల్మాంటులో పోర్షియా ఆమె పరిచారిక
నెరిస్సాతో జరిగిన మాటల కలబోతలో మానవీయ కోణాలు ప్రదర్శితమవుతాయి. చక్కగా నడచుకుంటే
చక్కని జీవితం అని పలికిన నెరిస్సా పలుకులకు పోర్షియా స్పందిస్తూ ‘ చెయ్యటమనేది చెప్పటమంత
తేలికైతే కరువుకాటకాలు కనుమరుగయేవి. ఏది మంచో నూరు మందికి చెప్పగలిగినా నేను ఆచరణలో పెట్టడం మాత్రం కష్టం.మన మనసులు మంచి
మాట చెప్తున్నా మన ఉద్రేకాలు మాత్రం మనసులు గీచిన మంచి గీటుల్ని దూకి అవతల
పడుతాయి.’ అంటుంది. షేక్స్ పియర్ మనస్తత్వ విశ్లేషణను అత్యంత సహజంగా
అనువదించిన లక్ష్మికాంత మోహన్ అభినందనీయులు.
ఇక నాటకం చివరి
అంకంలో షైలాక్ మనసును మార్చాలని కడసారి
ప్రయత్నంగా మారువేషంలోనున్న పోర్షియా, ‘మనిషి హృదయంలో కరుణ సహజంగా ఉండాలికాని
నిర్బంధంతో రాదు ’ అంటుంది. ‘ అది వర్ష తుషారం ఆకాశం నుండి భూమి మీద పడినట్లు దానంతటదే
వస్తుంది. కరుణ అనేది రాజదండంకంటే బలవత్తరమైనది.కరుణ చూపమని దేవుడిని
వేడుకునే మనం ఇతరులపై కూడా కరుణ చూపమనే కదా!’ అని షైలాక్ ను
ప్రశ్నిస్తుంది. కాని విభిన్న మనస్తత్వాల మానవులం,అందరం ఒకేలా స్పందించం కదా! షైలాక్ తన మొండిపట్టు వీడడు.అయితే
పోర్షియా నాటకం చరమాంకంలో తన మారువేషంతో రంజింప చేసి షైలాక్ ఆట కట్టించడం
కొసమెరుపు.
మూలకథలోని భావ ప్రకటనా పటిమకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా తనకు
ఆశువుగా అలవడిన అనువాద కళను చక్కని సంభాషణా చతురత చూపి ఇది మనకు తెలిసిన నాటకమైనా
ఉత్సుకతను పెంచే రీతిన మలవడంలో మోహన్ గారు కృతకృత్యులయారనే చెప్పవచ్చు.
ప్రదర్శనకు
అనుకూలమైన నాటికల పరంపరలో ఇదొక అద్భుత రసమయ కావ్యం.
Thursday, November 28, 2013
Thursday, November 21, 2013
నాన్నా నీకేం కావాలి?
27-11-2013 నవ్య సంచికలో ప్రచురితమైన కథ.
‘ఓ, గాడ్! అప్పుడే ఐదయిపోయింది.వాట్ నాన్సెన్స్!ఈ
సెల్ అలారం సెట్ చేసానే! పని చేయడం లేదా?దీన్ని డస్ట్ బిన్ లో పడేసి మరొక్కటి
కొనుక్కోవాలి.లేకపోతే ఆలస్యానికి పెనాల్టీ తప్పదు.అదేదో ఇప్పటికే పడింది. నాకంటే
ముందే చేరిపోయిఉంటాడు రాజేష్ వాకింగ్ కు!నడవాలన్న ఆకాంక్షకన్నా తనకన్నా ముందే రాజేష్
బిగ్ షాట్స్ అడుగులో అడుగు వేస్తూ,జోకులు
పేలుస్తూ,వారిలో నవ్వులు పూయిస్తూ ,వారి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతూ సమాంతరంగా పరిచయాల ఖాతాను కొండలా పెంచుకుంటాడు.మిత్రలాభం బహుబాగా
తెలిసినవాడు.పనులు సాధించుకోవాలంటే ఈ
దినచర్య తప్పదు.బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలంటే ఈ మాత్రం బాలెన్సింగ్
చేసుకోవాల్సిందే!’
భర్త అవసరాలు
గమనిస్తూ,ఇల్లాలి పాత్ర తు.చ తప్పకుండా పోషించే అవంతి బెడ్ కాఫీ అందించినా
వద్దువద్దంటూ కారు తాళాలందుకుని పరుగులుతీసాడు సుధీర్.
నిశ్చలంగా చూస్తుండిపోయింది
అవంతి. ‘ఎందుకీ పరుగు? నడక మంచిదే కాని నడత కూడా బాగుండాలి కదా! వాకింగ్ గ్రూపులు కట్టి, సమావేశాలు పెట్టి ఎవరి శైలిలోవారు ఇతరులను వ్యాపార లావాదేవీలలో వ్యూహత్మకంగా దెబ్బ
తీస్తూ, అవసరమనిపిస్తే అడుగులకు
మడుగులొత్తుతూ,అవసరంలేదనిపిస్తే
అణచివేస్తూ! ఇన్ని రాజకీయాలు చేస్తేకాని తెలవారదా?ఏమో!’
‘ఆలోచనల వరకే,ఆపైనమాట పెగలదు.సరే తను
చెప్పాలనుకున్నది చెప్పాలని నోటినుండి మాట పెగలడం ఆలస్యం,....’నీవేమైనా మీ ఇంటినుండి మూటలు తెచ్చావా?మాటలు పెంచుతున్నావు!కనీసం స్కూటరు కొనివ్వలేదు మీ నాన్న!నాతెలివితో
పదిమందితో పరిచయాలు పెంచుకుని ,పనులు సాధించుకుని ఈ స్థాయికి వచ్చి ఎందరో ఆడవాళ్లు
కలలుగనే రిచ్ లైఫ్ ను నీకందించాను. ఇంటినిండా విదేశీ వస్తువులు నింపాను.విదేశీ ఆర్కిటెక్ట్
తో డిజైన్ చేయించి అందరు ఆశ్చర్యపడేలా
ఇంటిని తీర్చిదిద్దాను.ఇక ఏం కావాలి నీకు? ఇంకా ఇంకా ఎదగాలనుకునే నన్ను కట్టడి
చేసి అందరిలో వెనకబడమంటావా?’
ఇలా క్లాసుల మీద క్లాసులు
పీకించుకున్నాక అవంతి ప్రేక్షకపాత్రకే అంకితమైపోయింది.
కూతురు నీలిమ పిలిచిన
పిలుపుకు ఆలోచనలకు చుక్కపెట్టి గడియారం
వంక చూసింది. ఏడవుతోంది. నీలిమను పరిశీలనగా చూసింది.
తనను దేనికీ పిలవకుండానే చకచకా బడికి తయారయిన నీలిమను కళ్లతోనే ప్రశంసించింది.ఆ
ఏడాదే ఐదవతరగతి లోకి వచ్చింది నీలిమ.పాఠశాలకు వెళ్లివచ్చిన తొలిరోజున
‘అమ్మా! నా పనులన్నిటిని నేనే చేసుకుంటాను.నువ్వు
అడ్డు చెప్పకు.ఈ రోజు మా క్లాస్ టీచరు అన్ని పనులు మీరే స్వంతంగా చేసుకోవాలన్నారు.’అని చెప్తే ‘ఫోరా బడాయి’ అంది కాని టీచరు మాటను శిలాక్షరంలా
పాటిస్తూ
పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్న కూతురిని చూడగానే అవంతి మనసు దూదిపింజలా
మారిపోయింది.చక్కగా తయారై స్కూల్లో పిల్లలకు చాక్లెట్లు పంచడానికి బయలుదేరిన కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది, ’ చిట్టి తల్లీ హ్యాపీ బర్త్ డే రా! ‘ అంటూ.
“అమ్మా, నాన్న....”అమ్మ సమాధానం తెలిసినదానిలా మాటను మధ్యలోనే తుంచేసి వంటమనిషి అందించిన టిఫను
బాక్సు, వాటర్ బాటిల్ అందుకుంది నీలిమ అయితే తన మాటలకు తల్లి బాధ పడుతుందనుకుని తనను
తాను ఊరడించుకునే ప్రయత్నంలో కందిన ముఖాన్ని దాచుకోలేక పోయింది.ఈ ఏడాదైనా తండ్రి గుర్తుపెట్టుకుని కూతురికి విషెస్
చెప్తాడనుకుంది.కాని కూతురి నిరాశ అతడిని బాధించదు. అయితే కూతురి పేరు మీద బుక్
చేయాలను కుంటున్న కారు,సైటు,ఇల్లు,లేటెస్ట్ మాడల్ సెల్ ఫోన్,ఐ పాడ్ ‘....ఏది కావాలో కనుక్కోవాలి, ఏదడిగినా
కొనివ్వాలి,ఎంతఖర్చయినా సరే!’సుధీర్ మనసులో దృఢంగా నిర్ణయమైపోయిందెప్పుడో!
“అమ్మా!పాప పుట్టిన రోజుకదా,ప్రత్యేకించి ఏం
వండమంటారు?”
వంటమనిషి ప్రశ్నకు, “‘సార్ వచ్చాక చెప్తాలే’’ అంది అవంతి.
‘అతడి ప్లాన్ ఏమిటో,ఎవరిని పిలుస్తాడో,ఎవరిని
పిలవడో,ఇంటికే పిలుస్తాడో,లేదా పాప పుట్టినరోజు సాకుగా తాను వలవేసిన మనుషులకు గ్రాండ్ గా డ్రింక్
పార్టీయే అరేంజ్ చేస్తాడో !’ సందర్భమేదైనా పరిచయాలు
తద్వారా ఏర్పడే రాజమార్గాలు, డొంక తిరుగుళ్లు,అవి పెంచే బ్యాంకు నిలవలు.వెన్నంటి
వచ్చే పేరు ప్రతిష్ఠలు, పట్టించుకోకుండా దులపరించుకునే అప్రతిష్ఠలు. అకేషన్ ఏదైనా
అప్లికేషన్ మాత్రం ఇదే!తమ పెళ్లిరోజుకు అయిన ఖర్చుకు ఎవరిదైనా పెళ్లి చేసేయవచ్చు.
వచ్చిన బహుమతులకన్నా ఇచ్చినవే ఎక్కువ.పొగడ్తలకు ఉప్పొంగిపోతూ, చూసావా నా ప్రతిభ
అని కళ్లతోనే యస్.ఎం.యస్ లు పంపుతుంటే అతడి రిచ్ ఫీలింగ్ కు సంతోషపడాలో లేక
ఎందుకింత ధనదర్పాల దాహం అని బాధ పడాలో అర్థంకాదు అవంతికి.
‘ విస్తరిలో అన్నీ ఉన్నాయి.అయినా అసంతృప్తి
ఎందుకు? ఇంకా సంపాదించాలనే ఆశ చావదెందుకు?తను మధ్య తరగతినుండి వచ్చిన
అమ్మాయి.సర్దుకుపోవడం తెలుసుకున్నంతగా కోరికలు తీర్చుకోవాలన్న ఉబలాటం నేర్పని
తల్లిదండ్రుల పెంపకం తనది.తన సాదాసీదా ఆలోచనలను ఎప్పటికప్పుడు ఎరేజ్ చేస్తాననే
భర్త మాటలకు మూలాలు మరచిన మనిషి అనుకుని మనసులో నవ్వుకున్నా, పైకిమాత్రం సరే...సరేనంటూ తలూపుతుంది.’ సర్దుకుపోవడంలో ఇదీ ఒక పాఠమేనని అవంతికి తెలుసు.
కూతురు బడికెళ్లగానే తను
భర్తతో కలిసి కనీసం కాఫీ అయినా తాగాలనుకుంటుంది.అనేకసార్లు ఆ భాగ్యము దొరకదు.అదీ
ఎండమావే! విజిటింగ్ కార్డు పట్టుకుని
తిప్పితిప్పి చూస్తున్న భర్త ముఖంలో
ఆనందాన్ని ప్రస్ఫుటంగా గమనిస్తోంది అవంతి.
వేడివేడి ఇడ్లీలు,సాంబారు
వడ్డించింది వంటమనిషి.
“ పదండి టిఫను చేద్దాం.” పాప బర్త్ డే ఎలా ప్లాన్ చేస్తారో
తెలుసుకోవాలన్న ఆతృతలో ఉంది అవంతి.
“నో...నో నువ్వు కానిచ్చేయ్.ఈ రోజు అక్కడే సొరకాయ
జ్యూస్,సలాడ్స్ కానిచ్చేసాం.లంచ్ కు కూడా రాను.”
“డిన్నరు?“ అవంతి ప్రశ్నకు “ ఏమో ఇప్పడే ఎలా చెప్పను?అది సరే,పాప టైంకే స్కూలుకు వెళ్లింది కదూ.”
అవునన్నట్టుగా తల ఊపింది
మౌనంగా.
“ గుడ్,దానికీ నాలానే టైమ్ సెన్స్ ఎక్కువ.చూస్తుండు
అదీ ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్ అవుతుంది.
చూడు..ఏదైనా కావాలంటే
డ్రైవరుతో వెళ్లి తెచ్చుకో.నా కోసం చూడకు.వింటున్నావా ?ఏమిటా పరధ్యానం?”
“ అన్నీ విన్నాను,ఒక్క నిమిషం నేను చెప్పేది
వినండి.”
“రాత్రికి వస్తాగా అప్పుడు మాడ్లాడుకుందాం.టైం లేదు.అర్జంటుగా
ఒకరిని కలవాలి.అతడితో వెళ్తేగాని మన పనులు సానుకూలపడవు. “డబ్బు రేస్ లో ముందుకు అడుగేసాడు.
“ఒక్క క్షణం....ఆగండి.”అవంతి గొంతులో అణచుకున్న కన్నీటి ఆనవాళ్లు.
విసుగ్గా ఆగాడు సుధీర్
తలైనా తిప్పకుండానే.
“ఈ రోజు మనపాప పుట్టిన రోజు...మీరు బర్త్ డే విషెస్
చెప్పాలని త్వరగా వస్తారనుకున్నాను.”
“ అరె!మరిచేపోయానే,చూసావా నాదెంతవర్క్
మైండో!ఇలాటివన్ని నువ్వే మానేజ్ చెయ్యాలని మొన్న నువ్వోసారి గుర్తు చేసినప్పుడే
చెప్పాను.నీకన్నా నా సెక్రటరీయే నయం నా ప్రోగ్రాంలన్నీ డైరీలో వరుసగా ఉంటాయి.”
“అయితే మీ సెక్రటరీకే చెప్పండి మన పెళ్లిరోజులు,పుట్టినరోజులు
గుర్తుపెట్టుకుని మీకు చెప్పమని.” కోపాన్ని గొంతులోనే నొక్కుకోవడం కాపురానికి
రాగానే నేర్చుకున్న ఇంద్రజాలవిద్య.అన్నీగుర్తుండవు కాని కనీసం చెప్పాకైనా
ప్రోగ్రాం ప్లాన్ చెప్పొచ్చు కదా.తన తండ్రి సాధారణ కుటుంబీకుడు.తాము కోరిన
చిన్నచిన్న కోరికలు తీర్చినా తీర్చలేకపోయినా కలిసి గుడికి
వెళ్లేవారు,పార్కుకెళ్లేవారు. నాన్నతో కలిసి ఆడిన ఆటలు నిత్యజ్ఞాపకాలు.’
‘ అలా బొమ్మలా నిలుచుంటే ఏం లాభం?బేబికి ఏం కావాలో
చూడు ఛాయిస్ తనదే.’
బర్త్ డే గిఫ్ట్ కు ధర
ఎంతైనా సరే వెనక్కి తగ్గడు.
“మీరు
నిన్న రాత్రే పాపనడిగుంటే బాగుండేది,స్కూలునుంచి రాగానే ప్రజంట్
చేసేవారుకదా?”
“సరే ఇప్పుడు
మించిపోయిందేముంది?ఏమైనా టెండర్ పోగొట్టుకున్నామా,డేట్ క్యాన్సిల్ అయిందా?ఇంత చిన్న
విషయానికి నా టైమ్ ఐదు నిమిషాలు వేస్ట్ చేసావు.”
కిటికీ దగ్గరకు వెళ్లి
సిగరెట్ వెలిగించాడు, రిలీఫ్ కావాలన్నట్టుగా. ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కనబడ్డ గుడిసెలు
సుధీర్ అసహనాన్ని మరింత పెంచాయి. చిరాగ్గా తల
విదిలించాడు.వాష్ బేసిన్ దగ్గరకు గబగబ వెళ్లి భళ్లున వాంతి చేసుకున్నాడు.’
గుడిసెలు,వారి జీవితాలు తనకు పడవు’ అనుకున్నాడు సుధీర్.
' రాత్రి హ్యాంగోవర్ ఇంకా దిగినట్లు లేదు ’ అనుకుంది అవంతి. ఆ గుడిసెలు తొలగించి తన బంగళా
ప్రక్కనే కూతురికి, అల్లుడికి మరో సౌధాన్ని నిర్మించాలన్న తపన.ఆ గుడిసెలు
ఖాళీ చేయించాలి, స్థలాన్ని కొనెయ్యాలి. రెండు జరిగి తీరుతాయి.తనకున్న పరిచయపరపతి
అలాంటిది.’ ఇదే ధ్యాస ఎక్కువై రాత్రి పగలు,అంతస్తు,హోదాను పెంచుకోవాలనే తపనే తప్ప మరొకటి
తలవడు.
“ మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.రాత్రికి ఇంటికే
వచ్చెయ్యండి.ఇక్కడే ఏదో చిన్న పార్టీ ఏర్పాటు చేద్దాం.త్వరగా వచ్చెయ్యండి ప్లీజ్!” కూతురి కళ్లలో వెలుగు చూడాలన్న ఆశ అభ్యర్థనను
బలంగా వినిపిస్తోంది.
ఏమనుకున్నాడో ఏమో సరేననడం
అవంతి మనసంతా ఆనందార్ణవమైంది.
సంతోషమందించిన కొత్తశక్తి
అవంతిలో ఉత్సాహాన్ని పెంచింది. సాయంత్రానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా
జరిగిపోసాగాయి.భర్త త్వరగా ఇంటికి వస్తాడన్న ఆనందం సాధారణ ఇల్లాలికి నిత్య
సంతోషమే. కాని బిజినెస్ టైకూన్ సుధీర్ నెలలో ఏ ఒక్కరోజో వేళకు వస్తాడు.పాప
పుట్టినరోజుకు త్వరగా రావడమంటే పాపకు ఇంతకు మించిన సంతోషముండదన్న భావనే అవంతిని
ఉత్సాహపరుస్తోంది. ఇల్లంతా పండుగ వాతావరణం పరచుకుంటోంది.రంగురంగుల బెలూన్లు,పూల
తోరణాలు భవన అందాన్ని ఇనుమడింపచేస్తున్నాయి.
కూతురు నీలిమ ఇంటికి రాగానే
బుగ్గలు రెండు పుణికి ముద్దుపెట్టుకుంది. తల్లి సంతోషానికి కారణమేదైనా నవ్వుతున్న అమ్మ ముఖం నీలిమ మనసును
పరవశింపచేసింది.
“ మీ నాన్న త్వరగా వచ్చేస్తాడమ్మా.త్వరగా తయారవు. నాన్నఫ్రెండ్స్
కూడా రావచ్చు.వారిని చూడగానే లేచి నిలబడి నమస్కరించాలి. నీకు విషెస్ చెప్తారు.అందరికీ థ్యాంక్స్
చెప్పాలి.” తన తండ్రి నేర్పిన పాఠాలను కూతురికీ నేర్పుతోంది
అవంతి.
‘నాన్న త్వరగా ఇంటికి వస్తున్నాడా ?’ చకచకా తయారయి తండ్రి కోసం ఎదురుచూడసాగింది.
కారు శబ్దం విని కిటికీ దగ్గరకు పరుగెత్తింది.కారులెన్నో పరుగులు తీస్తున్నాయి.
తండ్రి జాడ మాత్రంలేదు.రంగు రంగుల విద్యుత్తు కాంతుల తోరణాలు వెలగనారంభించాయి.అటు గుడిసెలలో
గుడ్డి వెలుగు కనిపించాల్సిన దృశ్యాలను మసగ్గా చూపిస్తోంది.కాని
నీలిమకు ఆ దృశ్యాల వెలుగులు మనసును చురుక్కుమనిపిస్తున్నాయి.కూలి డబ్బులు ఆ పూటకు
సరిపడా మెతుకులనే ఇచ్చాయి.దాన్నే పరమాన్నంగా సత్తుగిన్నెలో కలిపి చంకలోకెత్తుకున్న
కొడుక్కో ముద్ద, నాన్నఒడిలో కూర్చుని గారాలు
పోతున్న కూతురికో ముద్ద తినిపిస్తున్న దృశ్యం....ఇటు
టేబిల్ పై అందంగా నీలిమ అన్నపేరును నీలవర్ణంతో రాయించి తండ్రి రాగానే కట్
చేయడానికి సిద్ధంగా ఉన్న భవన ఆకారంలోని పేద్ద కేకు.నీలిమ కళ్లు మళ్లీ కిటికీనే
ఆశ్రయించాయి.చెప్పలేని భావాలు, వ్యక్తీకరణకు చాలీచాలని వయసు, ప్రావీణ్యత సంతరించుకోని భాష అయినా చిన్నబుచ్చుకున్న మనసులోని బాధను పలుకగలుగుతున్న నీలిమ ముఖంలోని
భావాలు అవంతిలో అసహనాన్ని పెంచుతున్నాయి. ఆపుకోలేని
నిద్ర పసి మనసును మరిపిస్తోందేమో అనిపిస్తోంది.
“ నాన్నవస్తే లేపు అమ్మా....” అంటూ కట్ చేయాల్సిన కేకు వంక ఓసారి చూసి నిద్రలోకి
జారుకుంది.కాని కేకు కట్ చేయాలని తండ్రి కోసం ఆతృతగా ఎదురు చూసిన బిడ్డ చూపులు అవంతి గుండెను నిలువునా కోసాయి.
హారన్ చప్పుడు విని తల్లి
లేపకుండానే ఉలిక్కిపడి లేచింది నీలిమ.
“ సారీరా నీలూ,లేటయింది అందరూ పార్టీ పార్టీ
అన్నారు.”
“ నా బర్త్ డేకా నాన్నా!” ఆసక్తిగా అడిగింది నీలిమ.
“ కాదురా,మన ప్రక్కనున్న గుడిసెలు రేపు ఖాళీ
చేయిస్తారు.నీకో పేద్ద ఇల్లు కట్టిస్తాను కదా అందుకని పార్టీ.” అవంతి వైపు చూసాడు విజయగర్వంతో.
“ నాకొద్దు నాన్నా!” చప్పున అంది నీలిమ.
“మరేం కావాలి?స్కూల్ కు వెళ్లడానికి కొత్త కారా?”
“నాకేం వద్దు.” కళ్లు చికిలిస్తూ చూసింది తండ్రిని.
“సరే బొమ్మలు కొనుక్కో,ఢ్రస్ లు కొనుక్కో,ఎంత
డబ్బు కావాలో అడుగు.లక్షా...రెండు లక్షలా?”
నీలిమలో భావాలను విడమర్చి
చెప్పలేని అశక్తతను గమనించసాగింది అవంతి.తను కలుగచేసుకుంటే తండ్రి కూతురి మధ్య
అడ్డం రావద్దంటూ ఆక్షేపణలు.
స్పందించని కూతురిని చూసి
విసుగ్గా, “ఏం కావాలో అడగవు,అదివద్దు ఇది వద్దు
అంటావు...ఎలా?”
“అసలు నీకేం కావాలి నాన్నా?”
మనసులో ఏర్చికూర్చలేని
భావాలెన్ని ఉన్నా నీలిమ వేసిన చిన్న ప్రశ్న ఎన్నో కుటుంబాలలో జరుగుతున్న జీవన
దృశ్యాన్ని కళ్ల ముందు నిలిపింది.
“నాకా!”తెల్లబోయాడు సుధీర్
కూతురి ప్రశ్న తండ్రి మనసును కవ్వమై చిలుకుతోంది.
‘ప్రక్కనే గుడిసెలో తండ్రి ఒడిలో కూర్చుని అన్నం తిన్నాక ,తండ్రి
ప్రక్కనే పడుకున్న పాపలా తను నాన్నతో కబుర్లు చెప్పాలి,కిలకిలా నవ్వులు నవ్వగలగాలి.తండ్రి
అందించే డబ్బుల గలగలలు కాదు తనకు కావలసినది.’మనసు మాటలు
పేర్చినా వ్యక్తీకరించలేని నీలిమ తనకు
తెలిసిన ప్రశ్ననే పదేపదే ప్రశ్నించసాగింది.
“నీకేం కావాలి నాన్నా?ఇంకా ఇంకా డబ్బులు కావాలా?
చాలా చాలా కావాలా?“ మళ్లీ మళ్లీ అదే అడగసాగింది నీలిమ.
అవంతి ముఖంలో సంబరంతో కూడిన
ఆశ్చర్యం.తన మనసులోని ప్రశ్న కూతురి ముఃఖత వచ్చినందుకు.
‘ ఎంతో సంపాదించుకున్నాము. అన్నీ కూర్చుకున్నాము .
అయితేనేం బిడ్డలకు కాస్త సమయమైనా
వెచ్చించలేని తండ్రితనమెందుకు?వారానికొక్కసారైనా భార్యాపిల్లలతో గడపలేని సంపాదన
తృప్తినిస్తుందా? నేటి చిన్నారులకు తండ్రితో ఆటలు,పాటలు కాదుకదా మాటలే లేవు!’ అవంతి గుండెలోనుండి వెలువడలేని భావావేశం నీలిమ మనసులో ప్రశ్నావళిగా ముద్రితమవుతోంది.
*****************
Subscribe to:
Posts (Atom)























